Thursday, April 9, 2026
అల్లాహ్ దాస్యమే మనందరి జీవిత ధ్యేయం
హితబోధ చేస్తూ ఉండు. విశ్వసించేవారికి హితబోధ ప్రయోజనం కల్గిస్తుంది. నేను మానవుల్ని, జిన్నుల్ని నన్ను ఆరాధించడానికి తప్ప మరే లక్ష్యంతో పుట్టించ లేదు. నేను వారినుండి ఉపాధి కోరడంలేదు. నాకు తిండి పెట్టమని అడగడం లేదు. అల్లాహ్ యే అందరి ఉపాధిప్రదాత. ఆయన మహాబలుడు, అద్భుత శక్తిసంపన్నుడు (అజ్-జారియాత్: 55-58)
మనమంతా అల్లాహ్ దాసులం. అల్లాహ్ మనందరి ప్రభువును,పాలకుడు, పోషకుడు,సంరక్షహకుడు, జీవన్మరణాలకు అధిపతి. అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ - ఇవే కాక ఇంకెన్ని లోకాలున్న ఆ లోకాలన్నింటికీ ఏకైక ప్రభువు అల్లాహ్. (విశ్వంలోని) ప్రతి అణువుకూ దేవుడే సృష్టికర్త. ఆయనే సమస్త సృష్టిని పర్యవేక్షిస్తు న్నాడు. భూమ్యాకాశాల నిక్షేపాలకు చెందిన తాళపుచెవులు ఆయన చేతిలోనే ఉన్నాయి. (అజ్-జుమర్: 62) ఆ విషయానికొస్తే,
భూమ్యాకాశాల్లో ఉన్న సమస్త సృష్టిరాసులు అల్లాహ్ ఎదుట సాష్టాంగపడుతున్న విషయం నీవు గమనించలేదా? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పర్వతాలు, వృక్షాలు, జంతువులు, అనేకమంది మానవులు, (దైవ)శిక్షకు అర్హులైపోయిన చాలా మంది మానవులు కూడా (సాష్టాంగపడుతున్నారు). అల్లాహ్ ఒక వ్యక్తిని నీచుడిగా, అపకీర్తి పాలు చేయదలచుకుంటే, ఇక అతడ్ని ఎవరూ గౌరవించరు. అల్లాహ్ తాను తలచిన పని తప్పకుండా చేస్తాడు. (అల్-హజ్: 18)
సృష్టిలో ప్రతి ప్రాణీ, అది భౌతికంగా కనిపించేదయినా, కనిపించనిదయినా, సూర్యచంద్ర నక్షత్రాలయినా, సముద్రాలు, అరణ్యాలు, అండ పిండ బ్రహ్మాండాల్లోని అనువణువు ఇచ్చే సాక్ష్యం అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడెవడూ లేడు అని. అవన్ని ఆయన ఆజ్ఞకే బద్ధులయి జీవిస్తున్నాయి. కాబట్టి వాటి మధ్యన ఘర్షణ లేదు. ఆ దృష్ట్యా అన్నీ ముస్లిములే, అన్నీ ఆయన దాస్యంలో తరిచేవే. మనిషి ఈ యాదార్థాన్ని విస్మరించిన కారణంగానే అధోగతికి పాలవుతున్నాడు, అశాంతి, అలజడులకు కారణం అవుతున్నాడు. సృష్టికి కర్త ఒక్కడే అని మనిషి అంగీకరించి ఆయన ఆధెశానుసారం జీవించిన నాడు అతని కావాల్సిన భౌతిక భద్రత, మానసిక శాంతి, పరలోక మోక్షం అన్నీ ప్రాప్తిస్తాయి.
ఓ మానవుల్లారా! ఆయనే ఆది ఆయనకు ముందు ఏదీ లేదు. ఆయనే అంతం ఆయన తర్వాత ఏదీ ఉండదు. ఆయనే బాహ్యాం ఆయనకు మించింది ఏదీ లేదు. ఆయనే నిగూఢం ఆయన తప్ప ఏదీ లేదు. ఆయనే సర్వ శుభాలకు నిలయం. ఆయనే సర్వ శక్తులకు మూలం. ఆయనే కీర్తికి అసలు కారకడు. ఆయనే విశ్వ సామ్రాజ్యాధికారి. తాను తలచిన వారికి రాజ్యాధికారాన్ని ప్రసాదిస్తాడు, తాను తలచి వారి నుండి రాజ్యాధికారాన్ని ఊడబెరుకుతాడు. తాను తలచిన వారికి కీర్తి శిఖరాలపై కూర్చోబెడతాడు, ఆతను తలచివారిని అప్రతిష్ట అడుసు పాల్జేస్తాడు. అందరూ దీనులే ఆయన ప్రసాదించిన వారు తప్ప, అందరూ నగ్నులే ఆయన తొడిగించినవారు తప్ప. అందరూ ఆకలిగొన్నవారే అయన తినిపించినవారు తప్ప. సృష్టి మొదలు నేటి వరకు, నేడు మొదలు ప్రళయం వరకు వచ్చిన, ఉన్న, రాబోవు వారందరూ కలిసి ఆయన్ను ఆరాధించే గొప్ప భక్తునిలా మారిపోయినా ఆయన ఘనాఘనుడే, ఆందరూ కలిసి పరమ నీచునిగా మారిపోయి ఆయన్ను ఆరాధించడం మానేసినా ఆయన ఘనాఘనుడే
“అబ్ద్” (దాసుడు) అనే పదం మరియు దాని ఉపపదాలు (ఉదాహరణకు: ఇబాద్, అబ్దీ, అబ్దుహు, ఇబాదుక, ఇబాదునా, అబ్దుక, ఇబాదీ, అబ్దునా) ఖుర్ఆన్లో వందల సార్లు వచ్చాయి. (ఇబాద్) ఖుర్ఆన్లో సుమారు 96 సార్లు వచ్చింది. (అబీద్) ప్రత్యేక సందర్భాల్లో 5 సార్లు వచ్చింది. (అబ్దుహు - తన దాసుడు) ప్రవక్త ముహమ్మద్ ﷺ ను సూచిస్తూ 6 పవిత్ర స్థానాల్లో వచ్చింది: సూరహ్ ఇస్రా, కహ్ఫ్, ఫుర్కాన్, నజ్మ్, జుఖ్రుఫ్, తహ్రీమ్. దీని బట్టి తెలిసేదేమిటంటే, అల్లాహ్ యెడల దాస్య భావన అనేది మనిషిగా మనకు లభించిన ఒక మహా గౌరవం, మరియు అల్లాహ్ తన ప్రవక్తను “తన దాసుడు” అనే అత్యున్నత బిరుదుతో సంబోధించాడు.
అందుకే అల్లాహ్ తన ప్రవక్తను, తాను ఎంపిక చేసిన సందేశహరుణ్ణి అత్యంత విశిష్టతతో కూడిన సందర్భాల్లో ఈ ఉబూదియ్యత్ లక్షణంతోనే (దాస్య గుణంతోనే) ప్రస్తావించాడు. ఆయన (అల్లాహ్) ఎంతో పరిశుద్ధుడు. ఆయన తన నిదర్శనాలు చూపడానికి ఒకరోజు రాత్రి వేళ తన దాసుణ్ణి మస్జిద్ హరామ్ నుండి దూరాన ఉన్న అఖ్సా మసీదు దగ్గరకు తీసి కెళ్ళాడు. ఆ మసీదు పరిసరాలను ఆయన శుభవంతం చేశాడు. ఆయన సమస్తం వింటున్నాడు. ప్రత్యక్షంగా ప్రతిదాన్నీ చూస్తున్నాడు. (సూరహ్ అల్-ఇస్రా: 1)
ఉబూదియ్యత్ -అల్లాహ్ యెడల మనిషి సంపూర్ణ దాస్యభావన అల్లాహ్ ఘనతా గౌరవానికి, మహిమకు చిహ్నం. దాస్య భావం తోటి ప్రజల విషయంలో చెడ్డదే, అపకీర్తికి, అగౌరవానికి ఆనవాలే సందేహం లేదు. కానీ సర్వ సృష్టికర్త మనందరి పోషకుడు, పాలకుడు, పరిరకక్షకుడు అయిన అల్లాహ్ యెడల దాసి భావన క్లైగి ఉండటం మనిషిగా మనందరికీ గొప్ప గౌరవం, కీర్తికిరీటం. ఈ కారణంగానే - అల్లాహ్ తన తొలి ప్రవక్త (రసూల్) నూహ్ (అలైహిస్సలాం) గురించి ఇలా అన్నాడు: నూహ్తోపాటు మేము ఓడలో ఎక్కించినవారి సంతానమా! (వినండి) నిశ్చయంగా అతను కృతజ్ఞతగల దాసుడు.” (సూరహ్ అల్-ఇస్రా:03)
ప్రవక్త అయ్యూబ్ (అలైహిస్సలాం) గురించి ఇలా అన్నాడు: మేమతడ్ని సహనశీలిగా, మంచి దాసునిగా కనుగొన్నాము. నిశ్చయంగా అతను తన ప్రభువు వైపు మాటిమాటికి మరలే వాడు. (సూరహ్ సాద్ : 44)
ప్రవక్త సులైమాన్ (అలైహిస్సలాం) గురించి అల్లాహ్ ఇలా అన్నాడు: దావూద్కు మేము సులైమాన్ (అనే సుపుత్రుడి)ని ప్రసాదించాము. నిశ్చయంగా అతను ఎంతో మంచిదాసుడు, తన ప్రభువుని అత్యధికంగా స్మరిస్తూ ఆయన వైపు మరలేవాడు. (సూరహ్ సాద్ : 30)
ప్రవక్త ఈసా (అలైహిస్సలాం) శిశువుగా ఊయలలో ఉన్నప్పుడు ఆయన నోటా వెలువడిన తొలి మాట: “నిశ్చయంగా నేను అల్లాహ్ దాసుడను.” (సూరహ్ మర్యమ్ : 30)
ఆయన్ను అల్లాహ్ పై ఆకాశాల్లోకి సజీవంగా ఎత్తుకున్న తర్వాత కొందరు ఆయన్ను దైవత్వ స్థాయికి చేర్చే ప్రయత్నం చేసినప్పుడు, దైవాంశ సంభూతునిగా, అల్లాహ్ కుమారునిగా, ముగ్గురిలో ఒకడిగా చేసి త్రోవ తప్పినప్పుడు - అల్లాహ్, ఆయన దాస్య లక్షణాన్నే స్పష్టంగా ప్రకటించాడు: ఈసా మా అనుగ్రహం పొందిన దాసుడు తప్ప మరేమీకాదు. మేమతడ్ని ఇస్రాయీల్ సంతతి (కనువిప్పు) కోసం మా శక్తికి ఒక నిదర్శనంగా చేశాము.(సూరహ్ అజ్-జుఖ్రుఫ్ : 59)
స్వయంగా మన ప్రవక్త ముహమ్మద్ (స) లోక రాజ్యాధికారం పొందిన చక్రవర్తి అవ్వడానికి బదులుగా ఈ దాస్య గుణాన్నే ఎన్నుకున్నారు. అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం: దైవ దూత జిబ్రయీల్ (అలైహిస్సలాం) ప్రవక్త (స) వద్ద కూర్చున్నారు. అప్పుడు ఆయన ఆకాశం వైపు చూశారు. ఒక దూత దిగివస్తున్నాడు. జిబ్రయీల్ (అలైహిస్సలాం) అన్నారు: “ఈ దూత సృష్టి ప్రారంభం నుండి ఇప్పటి వరకు దివి నుండి భువికి దిగివచ్చింది లేదు; ప్రళయానికి ముందు ఇప్పుడు దిగివచ్చాడు.” ఆ దూత దిగివచ్చి ఇలా అన్నాడు: ఓ ముహమ్మద్! మీ ప్రభువు నన్ను మీ వద్దకు పంపాడు: మీరు చక్రవర్తి ప్రవక్తగా ఉండాలనుకుంటారా? లేక బానిసయిన ప్రవక్తగా ఉండాలనుకుంటారా?” అప్పుడు జిబ్రయీల్ (అలైహిస్సలాం) అన్నారు: “ఓ ముహమ్మద్! మీ ప్రభువుకు వినమ్రత చూపండి.” దానికి ప్రవక్త ﷺ ఇలా అన్నారు: “నేను బానిసయిన ప్రవక్తగా ఉండాలని కోరుకుంటున్నాను.” (ముస్నద్ అహ్మద్ - షైఖ్ అల్-అల్బానీ (రహ్మ) దీనిని సహీహ్గా ప్రకటించారు)
అల్లాహ్ కు తన దాసుల నుండి కావలసిన అసలు వస్తువు దాస్యం (ఆరాధన): "నేను జిన్నులను, మనుషులను సృష్టించినది కేవలం నన్ను సేవించటానికే." (అజ్ జారియాత్ : 56) ఈ విషయం ఎంత ముఖ్యమైనదంటే ఒకవేళ మనిషికి తన ప్రభువయిన అల్లాహ్ ను ఆరాధించే అవకాశం దొరక్కపోతే, అతను ఆ ప్రదేశాన్ని వదలి వేరే చోటికి వెళ్ళిపోవాలని ఆదేశించటం జరిగింది. (అన్ నిసా 97)
నిఘంటువు ప్రకారం ఇబాదహ్ - ఆరాధన లేక దాస్యం యొక్క అసలు అర్ధం మనిషి తనను తాను ఎవరి ముందయినా ఆత్మ సమర్పణ చేసుకోవటం, తల వంచటం, తన అశక్తతను, నిస్సహాయతను వ్యక్తపరచటం, షరీఅత్లో కూడా దాదాపు దీని భావం యిదే.
అబుల్ హయ్యాన్ అందలూసీ ఇలా అంటారు: "ఆరాధన (ఇబాదత్) అంటే అశక్తత, అణకువ అని అర్థం. జమ్హూరీ విద్వాంసులు చెప్పేది కూడా యిదే." (అల్ బహ్రుల్ ముహీత్, సం.1, పుట 23)
అందుకే దివ్య ఖుర్ఆన్ ఆరాధనకు వ్యతిరేక ధోరణిని 'గర్వం, అహంకారం'గా పేర్కొనడం జరిగింది. "నా ఆరాధన పట్ల అహంకారం ప్రదర్శించేవారు. అతి త్వరలోనే అవమానితులై నరకంలో ప్రవేశిస్తారు." (అల్ మూ'మిన్ : 60)
ఆరాధన కొరకు అణకువ, అశక్తత, వినయం లాంటి పదాలను ప్రయోగించినప్పటికీ అల్లాహ్ కొరకు దీనిని పలికేటప్పుడు అందులో ప్రేమభావన కూడా అంతర్లీనమైపోతుంది. ఇబ్నె కసీర్ ఇలా అంటారు: " ఇబాదహ్ -ఆరాధన యొక్క నిఘంటువు అర్థం అణకువను ప్రదర్శించటం. అందుకే ... షరీఅత్ విషయానికి వచ్చేసరికి ఇందులో ప్రేమాతిశయంతోపాటు అశక్తత, భయం కూడా చేరి ఉంటుంది." (తఫ్సీరుల్ ఖుర్ఆన్ - సం. 1, పేజీ - 25)
ఇమామ్ ఇబ్నె తైమియ్యా ఇలా అంటారు: "అత్యంత అణకువ ప్రేమాతిశయం యొక్క సమాహారమే ఇబాదహ్ అల్లాహ్ దాస్యం." (రిసాలా ఉబూదియ్య - పేజీ : 28)
హాఫిజ్ ఇబ్నె ఖయ్యిమ్ ఇలా వ్రాశారు : "ఆరాధన (ఇబాదత్) లో రెండు భాగాలున్నాయి - (1) అత్యధిక ప్రేమ, భక్తి పారవశ్యం, (2) అశక్తత, అణకువ". (తఫ్సీర్ ఇబ్నె ఖయ్యిమ్, పేజీ - 65)
ఆరాధన లేక దాస్యం అంటే అర్ధం అల్లాహ్ సన్నిధానంలో అణకువను, దీనావస్థను ప్రదర్శించటం, దీనిని ఖుర్ఆన్ ఖషియ్యత్, తజర్రూ, తౌబహ్, ఇనాబత్, ఖుషూ, ఖుజూ, ఖునూత్గా అభివర్ణించింది అల్లాహ్ ఆరాధన చేయట మంటే అల్లాహ్ సన్నిధిలో మనిషి తనను తాను పూర్తిగా అర్పించుకోవటమే. ఇక ఈ ఆత్మసమర్పణ చేసుకునే శక్తి ఎటువంటిది? అది దౌర్జన్యభరితమైనది గానీ, బలాత్కరించేది గానీ కాదు. ఆ శక్తి ఎంతో ప్రేమమయమైనది, దాసుల పట్ల ఎంతో వాత్సల్యం కలది. మనపై ఆ శక్తి మేళ్లు అగణ్యం – అందుకే ఆయన ముందు అణకువను, వినమ్రతను ప్రదర్శించే మనసు ప్రేమాతిశయంతో పొంగి పొర్లుతుంది. దాసునికి అల్లాహ్ కి మధ్యగల ఆ సంబంధం అనిర్వచనీయమైనది. ఆ సమయంలో దాసుడు దైవభీతితో కంపించి పోతాడు. భక్తీ పారవశ్యంతో దాసుని కంట కన్నీరొలికే సమయంలో అతడు ఎంతో ఉత్సుకతలో అల్లాహ్ వైపునకు ఆకర్షితుడవుతాడు. అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతాడు. అల్లాహ్ సన్నిధిలో అతని ద్వారా అభివ్యక్తమయ్యే వినయ వినమ్రతలకు ప్రధాన కారణం అతనిలోని భయం మాత్రమే, అయితే ఆ భయం స్వచ్ఛందమైనది. అది భయకంపితుడైన కారణంగా కలిగిన భీతి కాదు. ఆ భీతిని గురించి ఒకట్రెండు మాటల్లో వర్ణించటం సాధ్యం కూడా కాదు. అది ప్రేమకు పరాకాష్ట! భీతికి ఆఖరి అంచు. ఆ రెండింటిలో ఏది ఎక్కువో, ఏది తక్కువో దాసుడు తేల్చుకోలేని పరిస్థితి! మనిషి తాను భయపడే శక్తిమంతుని వైపునకే పరుగిడుతాడు. తన నుండి లాక్కుంటాడని భయపడుతున్న వాని నుండే పొందాలని ఆశపడతాడు. ఆ ఉత్కంఠ స్థితిలోనే నిలువెల్లా నెమ్మది ఉంది. ఆ నెమ్మదిలోనే సఖశిఖపర్యంతం ఉత్కంఠ మిశ్రమమై ఉంది.
ఆరాధన అనేది తన వాస్తవికత రీత్యా అంతరంగంలో ముడివడినది. మనిషి మనోమయ స్థితికి మరో పేరే తఖ్వా (దైవభీతి) అని హదీసులో ఉంది. (అత్తఖ్వా హాహూనా) తఖ్వా (దైవభీతి)కి ఆరాధనా సారంగా పేర్కొంటుంది ఖుర్ఆన్."ప్రజలారా! మిమ్మల్నీ, మీ పూర్వీకుల్ని సృష్టించిన మీ ప్రభువును ఆరాధించండి. తద్వారా మీలో భయభక్తులు జనించే అవకాశం ఉన్నది." (అల్ బఖర హ్: 21)
బాహ్య దృష్టితో చూసినప్పుడు తన ప్రభువు సన్నిధిలో వంగటమే ఆరాధన. అయితే అంతర్గత వాస్తవికత రీత్యా నిజ ప్రభువయిన అల్లాహ్ ను తెలుసుకుని, ఆయనతో ప్రగాఢమయిన సంబంధం ఏర్పరచుకోవటమే ఆరాధన. దాసుడు ఈ స్థితికి చేరుకున్నప్పుడు, అల్లాహ్ ఎదుట నిలబడి ఉన్నట్లే అనుభూతి చెందుతాడు: "మీరు అల్లాహ్ ను చూస్తున్నట్లుగానే ఆయన్ని ఆరాధించండి.” (ఇహ్సాన్ అంటే యిదే) (బుఖారీ- విశ్వాస ప్రకరణం)
దైవప్రవక్త (స) వారి ఈ ప్రవచనం ప్రకారం దాసుడు అల్లాహ్ నామ స్మరణలో, ఆయన ధ్యానంలో పూర్తిగా లీనమైపోవాలి, ఆయన్ని అత్యంత సమీపం నుండి చూస్తున్నట్లుగా అనుభూతి చెందాలి. అదే ఆరాధన! ఈ భావనే అల్లాహ్ సామీప్యానికి, ఆరాధనకు పరాకాష్ట! ఎదుటా నీవే యదలోనా నీవే - ఎటు చూస్తే అటు నీవే…! అన్నట్టువంటి మానసిక పరిస్థితి. ఏ వ్యక్తి అయినా ఈ భావనకు లోనవకుండా, బాహ్యంలో తాను దైవారాధన చేశానని వాదిస్తే అతను తన వాదనలో సత్యవంతుడు కాడు. ఎందుకంటే ఆ అనుభూతి లేకుండా ఎవరిలో కూడా ఆరాధన (ఇబాదత్) ప్రభావం ఉండదు. మనకు కానరాని ప్రత్యేక ఆత్మకు మరో పేరే మానవుడు. అయితే మానవ శరీరం లేకుండా ఈ లోకంలో అతని ఉనికిని ఎవరూ ఊహించనయినా లేరన్నది కూడా యధార్థమే. అంటే, అల్లాహ్ విషయంలో దేహారాధన ఎంత ముఖ్యమో ఆత్మా భావన కూడా అంతే అవశ్యం. ఆ విషయానికొస్తే - ఈమాన్ విశ్వాసం అంటేనే - త్రికరణ శుద్దితో, మనోవాక్కర్మలతో చేసేది. నోటితో పలకాలి,మనసుతో అంగీకరించాలి. అవయవాలలో ఆచరణ ఛాయను ఇవ్వాలి.
అల్లాహ్ పట్ల గల ప్రేమ, భయం మనిషి క్రియాత్మక జీవితానికి ప్రాతిపదిక మాత్రమే కాదు, అసలు జీవితం అంటేనే దాస్యం లేక ఆరాధన, దానిని మనిషి ఈ ప్రాపంచిక జీవితంలో తనివితీరా ఆస్వాదించాలి. వేరే మాటల్లో చెప్పాలంటే మనకూ - దైవానికి మధ్యన ప్రత్యక్ష సంబంధం నెలకొనాలి. దైవదాస్యం అనేది బాహ్యంలో అజ్ఞాపాలనగా గోచరిస్తుంది. కాని వాస్తవికత దృష్ట్యా మనిషి తనను తాను దాస్యం యొక్క అత్యున్నత స్థానానికి చేర్చాలి. అక్కడ అతను తన నిజ ఆరాధ్య దైవంతో గుసగుసలాడాలి. ఆయన సన్నిధానంలో దీనాతిదీనంగా విలపించాలి. తనను తాను దేవుని సన్నిధిలో సమర్పించుకున్నానన్న అనుభూతికి లోనవ్వాలి ఈ విధంగా ప్రాపంచిక జీవితంలో దైవాన్ని పొందటం, ఇదే దీన్ (ధర్మం) యొక్క అత్యున్నత యధార్థం. సమస్త ఆదేశాల, ఆదాబుల పరమార్థం ఇదే. దాసుణ్ణి ఆ స్థాయికి చేర్చటం! ఎవరయితే ఈ విధంగా ప్రపంచంలో తన ప్రభువును పొందాడో అతను పరలోకంలో తన ప్రభువును పొందుతాడు. ఎవరయితే ప్రపంచంలో ఈ 'ఎరుక'కు నోచుకోకుండా పోతాడో, అతడు పరలోకంలో కూడా ప్రభువు దర్శన భాగ్యానికి నోచుకుంటానన్న ఆశ పెట్టుకో వడం అత్యాశే అవుతుంది.
మనిషికి దానం చేయాలన్న సద్బుద్ధి కలిగినప్పుడు, దైవమార్గంలో ఇవ్వగలిగినది ఇస్తూ కూడా, తాను తన ప్రభువు వద్దకు మరలిపోవలసి ఉందనే ఆలోచనతో అతని హృదయం వణుకుతూ ఉండాలి (మోమినూన్ 60 ఆధారంగా). అతనికి ఖుర్ఆన్ పారాయణం చేసే అదృష్టం కలిగినప్పుడు అతని కళ్లు దైవభీతితో వర్షించాలి. అతను అల్లాహ్ పట్ల భక్తి పారవశ్యంతో రాత్రి గడిపినప్పుడు "వారి వీపులు వారి పడకల నుండి వేరై ఉంటాయి" (32 అస్ సజ్ దహ్ 16) అన్న దైవ వచనం అతని మదిలో మెదలుతూ ఉండాలి. అతనిపై ఆవేదనాభరితమైన ఘడియలు వచ్చినప్పుడు ....... అతనికి విశ్వాసం (ఈమాన్) లోని మధురిమ తెలిసివచ్చినప్పుడు, కనుమరుగై ఉన్న వాస్తవాల తెర అతనిపై నుండి తొలగించబడుతుంది. అతను కలత చెందిన హృదయంతో, వణికే పెదవులతో తన స్వామిని అనూహ్యమైన వాక్యాలతో మొరపెట్టుకుంటూ ఉన్నప్పుడు, అది అల్లాహ్ నుండి లభించే ఆహారం అయి ఉంటుంది.
ఈ ప్రపంచంలోని అన్ని వస్తువులకన్నా ఎక్కువగా మన ప్రభువు మనకు సమీపంలో ఉన్నట్లు మీకు అనుభూతి కలగకపోతే పరలోకంలో మనకు అల్లాహ్ సామీప్యం ఎలా లభిస్తుంది? నిశ్చయంగా నమాజ్ ఎంత గొప్ప ప్రతిఫలానికి ప్రతిరూపమంటే, దానిని చూసుకున్నప్పుడు పరలోకంలో నమాజీల కళ్లకు చలువ ప్రాప్తమవుతుంది. కాని ఈ భాగ్యం అందరికీ లభించదు. "నమాజ్ నా కంటి చలువ" (నసాయి) అన్న దైవప్రవక్త (స) ప్రవచనాన్ని ప్రపంచంలో పుణికిపుచ్చుకున్న వారికే ఈ భాగ్యం వరిస్తుంది.
ఇబాదత్ వాంఛించేది
దాసుడు తన ఎదుట అశక్తతను, అణకువను వ్యక్తపరచాలని అల్లాహ్ కోరుకుంటాడు. దీని పేరే ఇబాదత్ (ఆరాధన), మనిషి అంతరిక్షంలో పుట్టించబడలేదు. అతను సంఘటనలతో, కారకాలతో నిండివున్న లోకంలోనే ఉంచబడ్డాడు. అందుకే అన్ని కోణాలలో అతనిలో అల్లాహ్ దాస్య భావన తొణికిసలాడాలి.
1. వాటిలో ఒక కోణం అతని స్వయానికి సంబంధించినది. దైనందిన జీవితంలో - ప్రతిసారీ - అతని కార్యకలాపాలలో రెండింటిలో ఏదో ఒక దానిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛాధికారం ఉంటుంది. 1. అల్లాహ్ మార్గం. 2. మనోవాంఛల మార్గం, మిథ్యా దైవాల మార్గం. ఆ సమయంలో అతనిలోని నైజం ఇతరత్రా కాలి బాటలను వదలి తన ప్రభువు రాచబాటను ఎన్నుకోవాలని ప్రేరేపిస్తుంది. ఇదే “విధేయత”. ఈ విధేయతను కనబరిచే సందర్భం తన ఇంట్లో, కార్యాలయంలో, కార్ఖానాలో, మార్కెట్లో, పార్లమెంటులో అన్ని చోట్లా ఎదురవుతుంది. అలాంటి సందర్భాలలో విశ్వాసి (మోమిన్)లో, తాను దైవమార్గాన్ని ఎన్నుకోవాలా? లేక దైవేతర మార్గాన్ని ఎన్నుకోవాలా? అన్న ప్రశ్న జనిస్తుంది. ఇది అతని వ్యక్తిగత విషయం.
2. రెండవ కోణం బయటి ప్రపంచం. వేరే మాటల్లో చెప్పాలంటే అది ముస్లిమేతరులతో ముడివడినది. ఈ ప్రపంచంలో నివసించే వారిలో ఎవరయితే ఇప్పటి వరకు తమ ప్రభువుతో సంబంధం ఏర్పరచుకోలేదో, ఈ కారణంగా ఎవరయితే భయంకరమయిన పరిణామం వైపునకు సాగిపోతున్నారో వారిని దైవదాస్య మార్గం వైపునకు తీసుకురావటానికి 'విశ్వాసి' అయిన దాసుడు ప్రయత్నించాలి. తాను స్వయంగా నమ్మినడుచుకునే సన్మార్గం పైకి వారిని కూడా తీసుకురావాలి. ఇదే షహాదత్ (సాక్ష్యం) లేదా దావత్, తబ్లీగ్ (పిలుపు , చేరవేయటం) అనబడుతుంది. విధేయత (దైవాజ్ఞాపాలన) విశ్వాసుల వ్యక్తిగత విషయమైతే, ముస్లిమేతరుల వరకు సత్యాన్ని చేరవేయటం 'తబ్లీగ్, దావత్'. ఈ బాధ్యత విశ్వాసులైన దాసులపై మోపబడింది.
ఇప్పుడు ఆరాధన (ఇబాదత్) కు సంబంధించి మొదటి దానిని (విధేయతను) తీసుకోండి అది రెండు రకాలు. ఒకటి వ్యక్తిగతమైనది. రెండవది : సామూహికమైనది. వ్యక్తిగత విధేయత అంటే, విశ్వాసులు తమ వ్యక్తిగత వ్యవహారాలలో దైవాజ్ఞలకు కట్టుబడి ఉండటం. ఇందులో నైతికతతో, వ్యవహారాలతో ముడివడిన అంశాలన్నీ వచ్చేస్తాయి. ఉదాహరణకు: సత్యం పలకటం, వాగ్దానాన్ని నెరవేర్చటం, అప్పగింతలలో నమ్మక ద్రోహానికి పాల్పడకుండా ఉండటం, న్యాయబద్ధంగా వ్యవహరించటం, వినయంగా మెలగటం, కొలతలు తూనికలలో మోసం చేయకుండా ఉండటం, ఎవరి హక్కును వారికి ఇవ్వటం, ఒకరిపట్ల శ్రేయోభిలాషతో మసలుకోవటం ఇలాంటివన్నీ ఒక మనిషికి వ్యక్తిగతంగా ఎదురయ్యేవే. ఈ విషయాలన్నింటిలో మనిషి తన స్వయం నిర్ణయంతో ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకుంటాడు. వీటన్నింటిలో దైవ నిర్దేశాలను అవలంబించడమే వ్యక్తిగత విధేయత. ఒక ముస్లింకు ఏ విషయంలోనయినా దైవాదేశం ఏమిటో తెలిసి ఉన్నప్పుడు, దానిని పాటించటంలో విముఖత కనబరచటం అతనికి ఎంతమాత్రం సమ్మతం కాదు.
"ఏదేని వ్యవహారంలో దైవం మరియు దైవప్రవక్త ఒక నిర్ణయం గైకొన్నప్పుడు విశ్వాసి అయిన పురుషునికి గానీ, విశ్వసించిన స్త్రీకి గానీ ఆ వ్యవహారంలో స్వీయ నిర్ణయం తీసుకునే అధికారం మిగిలి ఉండదు. ఒకవేళ ఎవరయినా అల్లాహ్ ను , ఆయన ప్రవక్తను ఎదిరిస్తే, అతను స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడిపోయినట్లే." (అల్ అవాజాబ్: 36)
ఈ వ్యక్తిగత విధేయతకు ప్రతి విశ్వాసి విధిగా కట్టుబడి ఉండాల్సిందే. ఒకవేళ ఎవరయినా తన క్రియాత్మక జీవితంలో ఈ ఆదేశాలను పాటించకపోతే అతను దైవ సన్నిధిలో దాసుడుగా పరిగణించబడడు. దాస్యం లేక ఆరాధన (ఇబాదత్) అనేది ఆత్మ సమర్పణకు ప్రతిరూపమైతే, బాహ్యపరంగా అది మనిషి తనను తాను దైవ విధేయతకు బద్ధుడైన వానిగా నిరూపించుకోవడానికి మారుపేరు, అతని బాహ్య జీవితమంతా అల్లాహ్ చూపిన ఆదేశాలు, నిర్దేశాలకు లోబడి ఉండాలి. ప్రతి ముస్లిం పురుషుడు, ప్రతి ముస్లిం స్త్రీ దైనందిన జీవితంలో తనకు ఎదురయ్యే సమస్త వ్యవహారాలలో సంపూర్ణంగా అల్లాహ్ విధేయతకు కట్టుబడి మసలుకోవాలి. ఇతర మార్గాలను, పద్దతులను అనుసరించటాన్ని విడనాడాలి.
ఓ విశ్వాసులారా! ఇస్లామ్లో (విధేయతా మార్గంలో పూర్తిగా ప్రవేశించండి. షైతాన్ అడుగులకు మడుగులొత్తకండి. వాడు మీకు బహిరంగ శత్రువు." (బఖరః: 208)
శక్తీ స్థోమతలను బట్టే బాధ్యతాభావం ఉంటుంది. శక్తికి మించిన భారం వేయటం దైవ విధానం కానేకాదు. ఏదేని అజ్ఞను అమలుపరిచే తాహతు లేనప్పుడు విశ్వాసులపై ఆ కార్యభారం ఎలా మోపబడుతుంది? ధర్మాదేశాలు తమ స్వరూపం రీత్యా ఒక్కటే (సమానమే). కాని ఆ ఆదేశాలతో మనకు గల సంబంధం సమానమైనది కాదు. "నమాజును స్థాపించండి" అన్నది ఖుర్ఆన్ ఆదేశం. దాంతోపాటు "జకాత్ను ఇవ్వండి" అనేది మరో ఆదేశం. ఈ రెండు ఆదేశాలు కూడా బాహ్యంలో ఒక్కటిగానే ఉన్నాయి. ఈ రెండింటిలో ఆజ్ఞ ఉంది. కాని ఆ ఆజ్ఞలు మనకు సమానంగా వర్తించవు. నమాజును ప్రతి విశ్వాసి ఖచ్చితంగా చేయాల్సిందే. ఇందులో ఎటువంటి మినహాయింపు లేదు. కాని జకాత్ ఆజ్ఞ స్థోమతతో ముడిపడి ఉంది. జకాత్ చెల్లించే స్థితికి చేరుకున్న వ్యక్తికే ఈ ఆజ్ఞ వర్తిస్తుంది. ఆర్థిక స్థోమత లేని వ్యక్తిని జకాత్ చెల్లించాలని ఎవరూ ఆజ్ఞాపించలేరు.
రెండవ దశ సంస్థాగతమైనది. అంటే ముస్లింలు ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా చెల్లాచెదురుగా ఉండకూడదు. సాధ్యమైనంత వరకు వారు తమ మధ్యన సంస్థను స్థాపించుకుని, సలహా సంప్రతింపుల నియమాన్ననుసరించి తమ సామూహిక వ్యవహారాలను నిర్ణయించుకోవాలి. ఈ నియమానికి బద్దులయ్యే ఒక స్వరూపం ఏమిటంటే, దైవప్రవక్త మహనీయ మూసా (అ) సినాయ్ ఎడారికి చేరుకున్న పిదప ఇస్రాయీల్ సంతతివారిని 12 తెగలుగా విభజించి, వారిపై 12 మంది పర్యవేక్షకులను నియమించారు. మక్కాలోని తొలి కాలంలో అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (స) వ్యక్తిత్వం చుట్టూ కూడా ఇలాంటి వ్యవస్థే ఉండేది. 'దార్ అర్థమ్' దానికి కేంద్రం. హిజ్రతకు పూర్వం మదీనా అన్సార్ల విషయంలో కూడా ఇదే విధానం అవలంబించబడింది. రెండవది బైఅతె అఖబా (623) సందర్భంగా మదీనాకు చెందిన 75 మంది (73 మంది పురుషులు, ఇద్దరు స్త్రీలు) దైవప్రవక్త సన్నిధిలో హాజరై ఇస్లామ్ స్వీకరించినప్పుడు, "మీరు మీ పైన 12 మంది పర్యవేక్షకులను నియమించుకోండి" అని ఆయన (స) చెప్పారు. (అల్ బిదాయ వన్నిహాయ సం. 3, పేజీ : 160), అందువల్ల వారు తమపై 12 మంది పర్యవేక్షకులను ఎన్నుకున్నారు. వారిలో ముగ్గురు ఔస్ తెగవారు, తొమ్మండుగురు ఖజ్రజ్ తెగవారు. ఆ తర్వాత దైవప్రవక్త (స) వారిని ఉద్దేశించి ఇలా అన్నారు :"మీరు మదీనాలోని విశ్వాసులకు కావలివారు, వారిని కనిపెట్టుకుని ఉండేవారు.
ఇస్లాంలోని ఆదేశాలన్నీ మనిషిలోని మనసుతో ముడిపడినవి. విశ్వాసం మానవ మనోక్షేత్రంలో నాటుకున్నప్పుడు, మనోమయ భావాలపై దాని ప్రభావం మొదలవుతుంది. అది బాహ్య జీవితంపై పడసాగుతుంది. విషయావగాహన నిమిత్తం వీటిని స్థూలంగా మూడు దశలుగా విభజించవచ్చు. దీని మొదటి దశ 'ఉపదేశం'. దీనికి 'మూలం' ఏదంటే ప్రతి ముస్లిం హృదయంలో తోటి ముస్లిం యెడల శ్రేయోభిలాష ఉండాలి. హజ్రత్ జరీర్ మహాప్రవక్త ముహమ్మద్ (నఅనమ్) వద్దకు వచ్చినప్పుడు, "జరీర్! నీ చేతిని ముందుకు చాపు" అన్నారు. "దేని కొరకు' అని జరీర్ అడగ్గా, "నీవు అల్లాహ్ వైపునకు ఏకోన్ముఖుడవై ఉంటానని, ప్రతి ముస్లిం యెడల శ్రేయోభిలాషిగా వ్యవహరిస్తానని మాటివ్వు" అన్నారు మహాప్రవక్త (స). (కన్జుల్ అమాల్- సం.1, పేజీ : 82)
అంటే పరస్పర వ్యవహారాలలో నీవు నీ తోటి సోదరుని పట్ల వ్యవహరించే తీరు ప్రాపంచికంగా, పారలౌకికంగా అతనికి లాభం చేకూర్చేదిగా ఉండాలి. ముస్లిం సోదరుల మధ్య విభేదాలను సృష్టించి, వారిని విచ్ఛిన్నపరచే ప్రతి చేష్టకు నీవు దూరంగా ఉండాలి.
ఈ ఆచరణనే సూరతుల్ అస్ర్ లో "తవాసవ్ బిల్ హఖ్, తవాసవ్ బిస్సబ్"గా పేర్కొనటం జరిగింది. తోటి ముస్లింల పట్ల విశ్వాసి అయిన ఒక దాసునిలో వ్యక్తమయ్యే ఈ గుణాన్ని దేవుడు "పరస్పర సత్యోపదేశం, సహనబోధ"గా పేర్కొని ఈమాన్ వాంఛించే వాటిలోని రెండు కోణాలను ప్రస్పుటం చేశాడు. ఈ ప్రక్రియలోని ఒక కోణం ఏదంటే, దేవుడు తన దాసుల నుండి కోరేవాటిని నెరవేర్చమని విశ్వాసులైన దైవదాసులను ప్రేరేపిస్తూ ఉండాలి. రెండు దైవ ప్రసన్నతను చూరగొనే నిమిత్తం ఈ ఉపదేశ మార్గంలో - ప్రాపంచికంగా ఎదురయ్యే కష్టనష్టాలపై, అవరోధాలపై మొక్కవోని ఓరిమిని, సాహసాన్ని చూపాలి. కష్టాలు ఎదురైనప్పటికీ ఈ మార్గంలో స్థిరంగా ఉండాలి.
కరుణామయుని (నిజ)భక్తులు భూమిపై (విర్రవీగకుండా) నమ్రతగా నడుస్తారు. మూర్ఖులు వారితో వాదనకు దిగితే ‘మీకు సలాం’ అంటారు. వారు తమప్రభువు సన్నిధి లో నిలబడి ప్రార్థనచేస్తూ, సాష్టాంగపడుతూ రాత్రిళ్ళు గడుపుతారు. అదీగాక దైవాన్ని వేడుకుంటూ “ప్రభూ! మమ్మల్ని నరకయాతనల నుండి కాపాడు. అవెంతో బాధాకరంగా, దారుణంగా ఉంటాయి. నరకం పరమచెడ్డ నివాసస్థలం” అని అంటారు
వారు తమ సంపద వినియోగిస్తున్నప్పుడు దుబారా ఖర్చుచేయరు; ఇటు పిసినారి తనం కూడా వహించరు. వారి ఖర్చు ఆ రెండు అతిచర్యలకు మధ్యస్తంగా ఉంటుంది. వారు ఒక్క దేవుడ్ని తప్ప మరెవరినీ ప్రార్థించరు. దేవుడు నిషేధించిన ఏ ప్రాణినీ అన్యాయంగా హతమార్చరు. వ్యభిచారానికి ఏమాత్రం పాల్పడరు.
ఈ పాడుపనులు చేసేవాడు మటుకు తన పాపఫలం అనుభవిస్తాడు. ప్రళయం రోజు అతనికి రెట్టింపు శిక్ష పడుతుంది. అందులోనే అతను ఎల్లకాలం అవమానభారం తో క్రుంగిపోతూ పరమనీచంగా పడివుంటాడు. అయితే పశ్చాత్తాపహృదయంతో క్షమాపణ కోరుకొని, దాంతోపాటు సత్యాన్ని విశ్వసించి సత్కార్యాలు చేయడం మొదలెడితే అలాంటి మనిషికి శిక్ష ఉండదు. పైగా దేవుడు అలాంటివారి (గత) దుష్కర్మలను సత్కర్మలుగా మారుస్తాడు. ఆయన గొప్పఅనుగ్రహశీలి, పరమదయాళువు.
పశ్చాత్తాపంతో క్షమాపణ కోరుకొని సదాచార వైఖరి అవలంబించినవాడు నిజానికి మనస్పూర్తిగా పశ్చాత్తాపం చెంది దేవుని వైపు మరలి వచ్చినవాడవుతాడు. (కరుణామయుని భక్తులు) అసత్యానికి ఎన్నడూ సాక్షులుగా ఉండరు. ఎప్పుడైనా వారు పనికిమాలిన వ్యవహారం మీదుగా పోవలసివస్తే దాన్ని ఏమాత్రం పట్టించుకో కుండా హుందాగా, గౌరవప్రదంగా దాటివెళ్తారు. వారికి వారిప్రభువు సూక్తులు విన్పించి హితోపదేశం చేయడం జరిగితే వారు అంధులుగా, బధిరులుగా మారి వాటిని నిర్లక్ష్యం చేయరు. వారు “ప్రభూ! మా భార్యాపిల్లల ద్వారా మా కంటికి చలువ ప్రసాదించు. మేము దైవభీతిపరులకు నాయకులయ్యేలా చెయ్యి” అని ప్రార్థిస్తారు.(ఫుర్ఖాన్ :63-74)
(ఇలాంటి) వారే తమ సహనానికి ప్రతిఫలంగా (పరలోకంలో) అత్యున్నత స్థానాలు పొందేవారు. వారిని (దైవదూతలు) ఎంతో గౌరవిస్తూ శాంతివచనాలతో స్వాగతిస్తారు. వారక్కడ (స్వర్గంలో) కలకాలం (సుఖసంతోషాలతో) ఉంటారు. ఎంత మంచి నివాసస్థలం అది! (అల్-ఫుర్_ఖాన్: 76)
అతిశయిల్లకండి!
ఇస్లాం ధర్మానికి ఆయుపట్టు తౌహీద్. తౌహీద్ లేకపోతే ఇస్లాం లేదు, తౌహీద్ లేకపోతే నాకమూ లేదు, నరకమూ లేదు. తౌహీద్ లేకపోతే శిక్షాబహుమానాలు లేవు. తౌహీద్ లేకపోతే మంచీ చెడులు లేవు. తౌహీద్ లేకపోతే విశ్వ వ్యవస్థ లేదు. అలాంటది తౌహీద్ లేకుండా తౌహీద్ను నమ్మే ముస్లింల మధ్య ఇత్తిహాద్-ఐకమత్యం ఎలా సాధ్యం? అయితే ముస్లింలు అన్నింటికన్నా ఎక్కువ తూట్లు తౌహీద్ భావానికే పొడిచారన్నది నిజం. ధర్మోన్నతి కోసం అహిర్నశలు పరిశ్రమించిన పుణ్యాత్ములను అభిమానించే విషయంలో అతికి లోనయిన అనేకులు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (స) గీసిన సరిహద్దు రేఖల్ని చెరిపే శారు. కొందరు వారిలో దైవత్వం ఉంది అని వాదిస్తే, మరికొందరు వారిని దైవానికి మరియు దాసులకు మధ్య దళారులుగా భావించారు. ఈ కారణంగా దైవపూజతోపాటు అనేక విధాల పూజలు వచ్చి చేరాయి. దేశ పూజ, జాతీయ పూజ, భాష పూజ, పదార్థ పూజ, వ్యక్తి పూజ, విగ్రహ పూజ, పూర్వీకుల పూజ, పుణ్యాత్ముల పూజ, కోరికల పూజ నేడు అన్నిటా సర్వసాధారణమయిపోయింది. విగ్రహం లేని వీధి లేదు. దర్గా లేని ఊరు లేదు. ఈ సమాధులను దర్శించడానికి పురుషులతో పాటు స్త్రీలు సయితం ఎగబడుతున్నారు. అక్కడికెళ్ళి మొక్కుబ డులు చెల్లించుకుంటున్నారు. ప్రదక్షిణలు చేస్తున్నారు. రొట్టెలు వదులుతు న్నారు. చదివింపులు చేస్తున్నారు. ఉరుసులు ఊరేగింపులు చేస్తు న్నారు. ప్రతి ప్రాంతానికో మఠాన్ని ఏర్పరచుకొని మతాధిపత్యాన్ని, మత మౌఢ్యాన్ని పెంచుతున్నారు. ఇదంతా గమనించిన ఓ కవి ఇలా అన్నాడు:
కొత్త పెళ్ళికూతురిలా ముస్తాబయి ఉన్నాయీ సమాధులు
ఆహా! ముస్లిం విగ్రహాలయాలు ఎలా సింగారించబడ్డాయో చూడు!
దీనికితోటు ఆయా దేశాల్లోని విగ్రహ భావాలు కలిగిన పాలకుల అండ వీరికి మస్తుగా లభిస్తోంది.వారు ఇటువంటి వాటిని మత సామ రస్యానికి వేదికలుగా పేర్కొని ప్రచారం చేయడమే కాక, స్వయంగా వారే హాజరయి చాదర్లు కప్పడం చేస్తుంటారు. ఇక సాహితీకారుల విష యానికొస్తే కవులు –
పై లోకాల్లో అర్ష్పై అసీనుడయి ఉన్నవాడే
మదీనాలో ముస్తఫాగా అవతరించినాడు
అని ప్రవక్త ముహమ్మద్ (స) వారికి దైవత్వాన్ని ఆపాదించే దుస్సాహసం ఒకడు చేస్తే,
అల్లాహ్ా అధీనంలో ఏముంది ఒఠ్ఠి తౌహీద్ తప్ప
మాకేం కావాలో ముహమ్మద్ (స) నుండి తీసుకుంటాము
అని అల్లాహ్కన్నా పైసా స్థాయిని (నవూజుబిల్లాహ్ా) ప్రవక్తకు కల్పి స్తాడు మరోకడు. ఈ పైత్యం ఎంత ముదిరిందంటే వక్ర భాష్యాలు చెప్పి ఖుర్ఆన్ దాదాపు వచనాలను ముహమ్మద్ (స) వారికి ఆపాదించే కుప్రయత్నం కొందరు చేస్తే, లేనిపోని హథీసులను క్రోడీకరించి ఆయన స్థాయిని పెంచే ప్రయత్నం మరికొందరు చేశారు.
‘పేదరికాన్ని ఆశ్రయించి పవిత్రంగా బతికిన ప్రవక్తకు సలామ్
నీడ లేని నిరుపమాన నబీకి సలామ్’
అంటూ (పవక్త (స) వారి శరీరానికి నీడ ఉండేది కాదు ఒకడు తప్పు లో కాలేస్తే,
నీ సమాధి దర్శనం నా హృదయానికి జీవజలం
ఈసా, ఖిజర్లకన్నా నీ స్థాయి గొప్పది’
అంటూ నిజాముద్దీన్ ఔలియా (ఒక వ్యక్తి బహువచనం ఎందుకో?) వంటి సామమాన్య వ్యక్తికి ప్రవక్తలకన్నా గొప్ప స్థాయిని కల్పించి తప్పుని ఒప్పుగా, ఒప్పుకునేలా చేస్తాడు మరొకడు. ఇవి ఇలాంటి గతంలో కూడా జరిగాయి. తర్వాత కూడా జరుగతాయి అని తెలిసిన అల్లాహ్ా తన అంతిమ గ్రంథంలో ఇలా సెలవిచ్చాడు:”ఇలా చెప్పెయ్యి! ఓ గ్రంథ ప్రజలారా! మీరు మీ ధర్మంలో అన్యాయంగా హద్దులు మీర కండి. పూర్వం తాము మార్గం నుండి తప్పడమేగాక, ఎంతో మందిని మార్గం నుంచి తప్పించి రుజుమార్గభ్రష్టులయిన వారి మనోవాంఛలను అనుసరించకండి”. (అల్ మాయిదహ్: 77)
సత్యాన్ని నమ్మి నడుచుకునే విషయంలో హద్దు మీరి ప్రవర్తించ రాదు. దేన్ని ఏ మేరకు ఆచరించమని ఆదేశించబడిందో ఆ మేరకే ఆచరిం చాలి. ధర్మంలో ఏ వస్తువుకు ఏ స్థాయి ఉందో దాన్ని ఆ స్థాయిలోనే ఉంచాలి. భక్త్తి విశ్వాసాలలో అవధులు మీరి దైవప్రవక్తను దైవత్వపు స్థానంలో ప్రతిష్ఠింపజేయడం ఎంతమాత్రం తగదు. పూర్వం ఇలానే గ్రంథవహులయిన క్రైస్తవులు ప్రవక్త ఈసా (అ) వారిని దైవ కుమారుని గా, దైవంగా చిత్రీకరించి ధర్మంలో అతిశయిల్లారు. సాధారణంగా మనిషి తాను అభిమానించే వ్యక్తిని గాఢంగా ప్రేమిస్తాడు. ఈ ప్రేమ ఒక్కోసారి మనిషి చేత అపశృతులు పలికిస్తుంది. తను నమ్మే ఇమా మును, పీరును, గురువును కూడా దైవప్రవక్త వలె పవిత్రునిగా, పాప రహితునిగా భావిస్తాడు. వారు విమర్శకు అతీతులను, అపౌరుషేయు లని తలపోస్తాడు. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే దైవ ప్రవక్తల వియంలో అతిశయిల్లిన కారణంగా యూదక్రైస్తవులు మార్గ భ్రష్టులయి దైవ అభిశాపానికి గురయితే, కౌన్, కిస్కా తెలియని వ్యక్తుల విషయంలో అతిశయిల్లడం ఎన్ని ప్రమాదాలకు దారి తీయ గలదో అలోచించాలి.
”అల్లాహ్ను వదలి వాళ్లు పిలుస్తున్న వారు ఏ వస్తువునూ సృష్టించ లేదు. పైగా వారు స్వయంగా (అల్లాహ్ాచే) సృష్టించబడిన వారాయె! వారు నిర్జీవులేగాని సజీవులు కారు. తాము ఎప్పుడు బ్రతికించి లేప బడతారో కూడా వారికి తెలీదు”. (అన్నహ్ల్: 20.21)
పై ఆయతులో ‘వారు ఎప్పుడు తిరిగి లేప బడతారో కూడా వారికి తెలీదు’ అని చెప్పబడిన మాట రాళ్ళు, రప్పలను ఉద్దేశించినది కాదు. మరణించిన మంచి వ్యక్తులకు ఉద్దేశించి చెప్పబడిన మాట. ఈ వాక్యం ద్వారా సమాధుల పూజా. దర్గా ప్రదక్షిణలు చేసేవారి చర్య నిర్ద్వందంగా ఖండించబడింది. అల్లాహ్ా తర్వాతి వచనంలో ఇలా సెల విస్తున్నాడు: ”(ఓ ప్రజలారా!) మీ అందరి ఆరాధ్య దైవం అల్లాహ్ ఒక్కడే. అయితే పరలోకం పట్ల నమ్మకం లేని హృదయాలు ఈ విషయాన్ని తిరస్కరిస్తు న్నాయి. వారు స్వయంగా అహంకారంతో విర్రవీగుతున్నారు”. (అన్నహ్ల్: 22)
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు