Thursday, April 9, 2026
ప్రపంచ ప్రగతికి ప్రమోన్నత ప్రభువు ప్రబోధించిన పద్నాల్గు ఆజ్ఞలు (14 commandments)
తన నిదర్శనాలు చూపడానికి ఒకరోజు రాత్రి వేళ తన దాసుణ్ణి మస్జిద్ హరామ్ నుండి దూరాన ఉన్న అఖ్సా మసీదు దగ్గరకు తీసి కెళ్లిన ఆ అల్లాహ్ ఎంతో పరిశుద్ధుడు. ఆ మసీదు పరిసరాలను ఆయన శుభవంతం చేశాడు. (సహజసిద్ధంగానే ఈ ప్రదేశం పంట పొలాలతో, నదీనదాలతో సస్యశ్యామలంగా ఉంది. పైగా ఈ ప్రదేశంలో దైవప్రవక్తలు సంచరించారు. నివసించారు. ఈ ప్రాంతంలో చాలామంది ప్రవక్తలు సమాధి అయిఉన్నారు. ఈ రకంగా కూడా ఈ ప్రాంతం విశిష్టమైనది. అందుచేత దీన్ని శుభప్రదమైన స్థలంగా ఖరారు చెయ్యటం జరిగింది) ఆయన సమస్తం వింటున్నాడు. ప్రత్యక్షంగా ప్రతిదాన్నీ చూస్తున్నాడు. ( బనీ ఇస్రాయీల్ :01)
మక్కాలోని పవిత్రమైన మస్జిదు నుంచి ప్రవక్త ముహమ్మద్ (సఅసం)ను తూర్పున సుదూరాన ఉన్న మస్జిదె అక్సా (జెరుసలేం)కు రాత్రివేళ తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి ఆయన్ను వరుసగా ఏడు ఆకాశాలపైకి తీసుకువెళ్ళి అల్లాహ్ చిహ్నాలను చూపించడం జరిగింది. ఈ గగనారోహణయాత్ర ఒక అద్భుతమైన మహత్యం. ఇది అల్లాహ్ యొక్క అపార శక్తిసామర్ధ్యాలను చాటిచెబుతుంది. ప్రవక్త ముహమ్మద్ (సఅసం)కు ఇవ్వబడిన ప్రత్యేక స్థానాన్ని కూడా తెలియజేస్తోంది. ఇస్లామీయ చరిత్రలో రెండు రాత్రులకు ఎనలేని ప్రాముఖ్యం ఉంది. ఒకటి: మహా ప్రవక్త ముహమ్మద్ (స) పై ఖుర్ఆన్ అవతరించిన రాత్రి. రెండవది: ఆయన (స)కు మేరాజ్ (గగనయాత్ర) భాగ్యం ప్రాప్తించిన రాత్రి. 'ఇస్రా' అంటే రాత్రి పూట తీసుకువెళ్ళటం అని అర్థం. ఇస్రా అంటేనే రాత్రిపూట తీసుకెళ్ళటం అనే అర్థం వస్తున్నప్పుడు వాక్యంలో మళ్లీ 'లైలన్' (రాత్రి) అనే పదం ఎందుకొచ్చింది? అనే సందేహం కలగవచ్చు. దానికి సమాధానం ఏమిటంటే, ఇక్కడ 'లైల్' అన్న పదం తక్కువ పరిమాణాన్ని సూచించటానికి తీసుకురాబడింది. 'అస్రా లైలన్' అంటే రాత్రివేళ అది కూడా చాలా కొద్ది సమయంలో వెళ్ళి రావటం అనే అర్థం వస్తుంది. . మక్కాలోని మస్జిదుల్ హరామ్ నుంచి పాలస్తీనాలోని బైతుల్ మల్టీస్కు పోవాలంటే కనీసం నలభై రోజుల ప్రయాణం చేయాలి. అందుకే 'బైతుల్ మల్టీస్' ను 'మస్జిదె అక్సా' (దూరాన ఉన్న మస్జిద్)గా వ్యవహరించటం జరిగింది. అంటే, నలభై రాత్రులు ప్రయాణం చేస్తేనేగాని చేరుకోలేని మస్జిదె అక్సాకు ఒకే ఒక్క రాత్రిలో అదీ రాత్రిలోని కొద్ది సమయంలో తీసుకువెళ్ళటం అద్భుతం.
'సుబ్షాన' ఇది 'సబహ' - 'యస్బహు' అనే క్రియాపదాలకు ధాతువు పదం. అన్ని రకాల లోపాల నుంచి అల్లాహ్ ను నేను పవిత్రునిగా భావిస్తున్నాను అని దీని భావం. సాధారణంగా గొప్ప సంఘటనలు గురించి చెప్పినప్పుడు ఈ పదం ఉపయోగించబడుతుంది. ఈ సంఘటన ప్రజలకు వింతగా, అసంభవంగా తోచినప్పటికీ అల్లాహ్ దృష్టిలో ఇది ఏమంత పెద్ద విషయం కానేకాదు. ఎందుకంటే ఆయన కారకాలకు, సాధనాలకు కట్టుబడిన వాడు కాడు. రెప్పపాటులో ఆయన 'అయిపో' అన్న ఆదేశాన్ననుసరించి ఏదైనా చేసెయ్యగలడు. ఆయన బలహీనతలకు, దౌర్బల్యాలకు అతీతుడు, పరిశుద్ధుడు. పరమ పవిత్రుడు.
అల్లాహ్ గొప్ప సూచనలను దైవప్రవక్త (సఅసం)కు చూపెట్టడం ఈ యాత్ర అసలు ఉద్దేశం. అంత సుదీర్ఘ యాత్ర ఒకే ఒక రాత్రిలోని అతి స్వల్పభాగంలో జరిగిపోవటం కూడా ఒక అద్భుతమే. ఆ రాత్రి దైవప్రవక్త (స) గగన లోకంలోకి తీసుకుపోబడ్డారు.. వివిధ ఆకాశాలలో ఆయన (స) పలువురు దైవప్రవక్తల్ని కలుసుకున్నారు. ఏడవ ఆకాశంలో 'అర్ష్' పీఠానికి దిగువన ఉన్న "సిద్రుతుల్ మున్తహా' వరకూ వెళ్ళారు. అక్కడ ఆయనకు నమాజుతో సహా కొన్ని దైవసూచనలు, దైవాదేశాలు ప్రసాదించబడ్డాయి. సహీహ్ హదీసులలో వాటి వివరాలు లభిస్తాయి. మహాప్రవక్త (స) గారి సహచరులు, వారి శిష్యులు మొదలుకుని నేటి విద్వాంసుల వరకూ అందరూ ఒక విషయంలో మటుకు ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. అదేమంటే దైవప్రవక్త (సఅసం) గారి ఈ యాత్ర 'స్వప్నావస్థ'లో జరిగింది కాదు. ఆయన పూర్తి మెలకువలో సశరీరంగా ఈ యాత్ర చేసి వచ్చారు. కళ్లారా అక్కడి స్థితిగతులను వీక్షించారు. అల్లాహ్ తన అపారమైన శక్తితో తన ప్రవక్తకు వీటన్నింటినీ దర్శనం చేయించాడు. ఈ యాత్రనే 'మేరాజ్' అంటారు. ఈ మేరాజులో రెండు భాగాలున్నాయి. మొదటిభాగం 'ఇస్రో' అనబడగా, రెండవభాగం 'మేరాజ్'గా వ్యవహరించబడుతుంది.
సోపానాలను, నిచ్చెనలను అసలు మేరాజ్ వ్యవహరిస్తారు. మహాప్రవక్త (సఅసం) స్వయంగా ఇలా అన్నారు : "ఉరిజ బీ ఇలస్సమాయి" (నన్ను గగనానికి ఎక్కించటం జరిగింది). మేరాజ్ అన్న పదం ఈ 'ఉరిజ' అనే పదం నుంచి వచ్చినదే. ఈ యాత్ర లోని రెండవ భాగం మొదటి భాగం కన్నా ఎంతో ముఖ్యమైనది, అద్భుతమైనది. అందువల్ల 'మేరాజ్' అనే పదమే సర్వత్రా ప్రసిద్ధిచెందింది. ఇది ఏ సంవత్సరం, ఏ తేదీన సంభవించిందన్న విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. అయితే 'హిజ్రత్'కు ముందు జరిగిందన్న విషయంలో మటుకు అందరి మధ్యా ఏకాభిప్రాయం ఉంది. హిజ్రత్ కు ఒక సంవత్సరం ముందు జరిగిందని కొందరు, కాదు అనేక సంవత్సరాల ముందు జరిగిందని మరికొందరు అభిప్రాయపడ్డారు. అలాగే నెల, తేదీల విషయంలో కూడా పలు అభిప్రాయాలు ముందుకు వస్తాయి. రబీవుల్ అవ్వల్ 17వ తేదీ అని కొందరంటే 27వ తేదీ అని కొందరన్నారు. రజబ్ నెల 27వ తేదీ అని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఇంకొందరు ఇంకో తేదీని ప్రస్తావించారు (ఫతహుల్ ఖదీర్).
ఈ గగనయాత్ర సందర్భంగా మహాప్రవక్త (స)కు కొన్ని సూచనలు (దృశ్యాలు) చూపబడ్డాయి. కార్యాచరణ పరిధిలో మనిషి సమత్వం, సమతూకాలను విడనాడి హద్దు మీరటం వల్ల కలిగే నష్టమేమిటో సంకేత ప్రాయంగా విడమరచి చెప్పడం జరిగింది. ఒక మంచి సమాజాన్ని స్థాపించటానికి ప్రజలు సామూహికంగా ఏ ఏ సూత్రాలను పాటించాలో కూడా స్పష్టంగా బోధపర్చడం జరిగింది. దివ్య ఖుర్ఆన్లైని బనీ ఇస్రాయీల్ సూరా మొత్తం మేరాజ్ (గగనయాత్ర) నేపథ్యంలోనే అవతరించింది. ముఖ్యంగా ఈ సూరాలోని 23వ వచనం నుండి 39వ వచనం వరకు మొత్తం "14 సూత్రాల పథకం" మానవ సమాజానికి ప్రసాదించబడింది. రండి, ఆ పధ్నాలుగు సూత్రాల పథకాన్ని ఓసారి సింహావలోకనం చేసుకుందాం-
1) నీ ప్రభువు తన ఆజ్ఞలు ఇలా జారీ చేస్తున్నాడు: మీరు ఒక్క నిజ దేవుడ్ని (అల్లాహ్ ను) తప్ప మరెవరినీ ఆరాధించకండి. ఒక్కడైన నిజ దైవాన్ని తప్ప వేరొక దైవాన్ని అంగీకరించకూడదు. అల్లాహ్ ఆయన ఒక్కడే మీ ఆరాధ్య దైవం. భూమిని, ఆకాశాలను, భూమ్యాకాశాల మధ్య ఉన్న సమస్తాన్నిఎవరైతే సమస్తాన్ని సృష్టిస్తున్నాడో, ఎవరైతే సమస్తాన్ని పోషిస్తున్నాడో, ఎవరైతే సమస్తాని కి మరణాన్ని ఇస్తున్నాడో, ఎవరైతే సమస్త జీవులను ప్రశ్నిస్తాడో , లెక్క తీసుకుంటాడో - ఆయననే అరబ్బి భాషలో “అల్లాహ్” అని పిలుస్తారు కాబట్టి మీరు ఆయన్నే పూజించండి. ఆయన ఆజ్ఞలను శిరసావహించండి. ఆయనకే విధేయత చూపండి. ఇది దేవుని హక్కు ఆయన్ని తప్ప వేరొకరిని గనక మీరు మీ సార్వభౌమునిగా ఒప్పుకుంటే నిందార్హు లవుతారు. ఒక్కడైన నిజదేవుని నుండి లభించే సహాయానికి మీరు దూరమైపోతారు. ఆయనే మనిషిని మట్టి నుంచి సృష్టించాడు. మాతృగర్భంలో పిండరూపంలో ఉన్నవారి గురించి కూడా ఆయనకు అన్నీ తెలుసు. ఆయన జీవితాన్ని ఇస్తాడు. చావును ఇస్తాడు. మనకు ఆనందాన్ని, దుఃఖాన్ని ఇచ్చేది ఆయనే. ఆయన ఒక్క వీర్యం బిందువు నుంచి స్త్రీపురుషులను సృష్టించాడు. మరణించిన తర్వాత మళ్ళీ లేపడం ద్వారా ఆయన మళ్ళీ రెండవసారి పుట్టిస్తాడు. ఆయనే విశ్వానికి సృష్టికర్త, విశ్వపోషకుడు. ఆయనే సంపదలను, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తాడని బోధించింది.
(విశ్వంలోని) ప్రతి అణువుకూ అల్లాహ్ యే సృష్టికర్త. ఆయనే సమస్త సృష్టిని పర్యవేక్షిస్తున్నాడు. భూమ్యాకాశాల నిక్షేపాలకు చెందిన తాళపుచెవులు ఆయన చేతిలోనే ఉన్నాయి. అల్లాహ్ సూక్తులు తిరస్కరించేవారే చివరికి నష్టపోయేవారు. ప్రవక్తా! వారినిలా అడుగు: “అజ్ఞానులారా! అలాంటప్పుడు మీరు అల్లాహ్ ను వదలి ఇతరుల్ని ఆరాధించమని నాకు చెబుతున్నారా?” “మీరు దేవునికి ఇతరుల్ని సాటికల్పిస్తే మీరు చేసే (మంచి)పనులు (కూడా) వ్యర్థమవుతాయి, మీరు ఘోరంగా నష్టపోతారు” అని నీదగ్గరకు, నీకు పూర్వం వచ్చిన ప్రవక్తలందరి దగ్గరకు దివ్యావిష్కృతి (వహీ) పంపబడింది” (అని వారికి చెప్పు.) (ప్రవక్తా!) నీవు మాత్రం అల్లాహ్ ను మాత్రమే ఆరాదిస్తూ కృతజ్ఞులయిన దాసులలో చేరిపో. వారసలు అల్లాహ్ కు విలువ ఇవ్వవలసిన విధంగా విలువ ఇవ్వనేలేదు. పునరుత్థాన దినాన యావత్ భూగోళం ఆయన పిడికిలిలో ఉంటుంది. యావత్తు నభోమండలం ఆయన కుడిచేతిలో చుట్టబడి ఉంటుంది. వీరు చేస్తున్న బహుదైవారాధనకు ఆయన ఎంతో అతీతుడు, పరమ పవిత్రుడు. (అజ్-జుమర్: 62-67)
ఇస్లాం ధర్మంలో తౌహీద్ ఆత్మ స్థానంలో ఉండగా, ఆరాధనలు, ఆచరణలు, వ్యవహారాలు దేహం వంటివి. ఏ విషయంలోనయినా తొలి ప్రాధాన్యం, అగ్రతాంబూలం – తౌహీద్ అఖీదహ్ కే. ఎంత వరకంటే, ప్రతి విషయంలో అమ్మానాన్నలతో మంచిగా వ్యవహరించమని ఆదేశించిన అల్లాహ్, తౌహీద్ కి వ్యతిరేకం అయిన షిర్క్ విషయంలో వారి మాట కూడా అస్సలు వినకూడదు అన్నాడు.
లుఖ్మాన్ తన కుమారునికి హితోపదేశం చేసిన సందర్భం గుర్తుకుతెచ్చుకో. అతను తన కుమారునితో “బాబూ! అల్లాహ్ కు (ఆయన దైవత్వంలో) ఎవరినీ సాటి కల్పించకు. దేవునికి సాటి కల్పించడం ఘోరమైన పాపం, దారుణమైన అన్యాయం” అన్నాడు. తల్లిదండ్రులకు సేవచేయాలని మేము మానవుడ్ని ఆదేశించాము. అతని తల్లి బాధ మీద బాధ భరిస్తూ అతడ్ని తన గర్భంలో పెట్టుకొని మోసింది. అతడ్ని పాలు విడి పించడానికి రెండేండ్లు పట్టింది. (అందువల్ల మేమతనికి ఇలా ఉపదేశించాం:) “నాపట్ల కృతజ్ఞుడవయి ఉండు. నీ తల్లిదండ్రుల పట్ల కూడా కృతజ్ఞతాభావంతో మసలుకో. నీవు (చివరికి) నా దగ్గరికే రావలసిఉంది. అయితే నీకు తెలియనిదాన్ని నాకు సాటి కల్పించ మని వత్తిడిచేస్తే మటుకు నీవు వారిమాట ఎన్నటికీ వినకు. ప్రపంచంలో వారి పట్ల సత్ప్రవర్తన కలిగిఉండు. అనుసరణ విషయంలో మాత్రం నావైపు మరలినవారి మార్గాన్నే అనుసరించు. చివరికి మీరంతా నా దగ్గరికే తిరిగిరావలసి ఉంది. అప్పుడు నేను మీరు (ఐహిక జీవితంలో) ఎలా నడచుకునేవారో మీకు తెలియజేస్తాను.” (లుఖ్_మాన్: 12-15)
2) తల్లిదండ్రుల పట్ల సద్భావంతో మసలుకోండి. మీ ముందు వారిద్దరిలో ఎవరైనా వృద్ధులైఉంటే వారిని ‘ఉఫ్’ అని కూడా విసుక్కోకండి. కసురుకుంటూ విదిలించి మాట్లాడకండి. వారితో గౌరవంగా మాట్లాడండి; దయార్ద్ర హృదయంతో, వినయంతో వారి ముందు తలవంచిఉండండి. (వారిపట్ల గౌరవాదరణలతో) “ప్రభూ! వీరు నన్ను చిన్నతనంలో ఎలా కరుణతో, వాత్సల్యంతో పెంచిపోషించారో అలా నీవు వీరిని కరుణించు” అని ప్రార్థించండి.
ఈ ఆయతులో అల్లాహ్ తన ఆరాధన తరువాత, తల్లిదండ్రుల యెడల మంచిగా మెలగటాన్ని రెండో స్థానంలో ఉంచాడు. దీన్నిబట్టి తల్లిదండ్రులు విధేయత, వారి సేవ, వారి గౌరవ మర్యాదలు ఎంత ముఖ్యమైనవో విదితమవుతోంది. దైవదాస్యం కోరే ప్రధానాంశాలను నెరవేర్చటం ఎంత అవసరమో, ఆ తర్వాత మాతాపితల విధేయతలో ఇమిడి ఉన్న ముఖ్యాంశాలను నెరవేర్చటం కూడా అంతే అవసరం. హదీసుల ద్వారా కూడా ఈ సంగతి పదే పదే నొక్కి వక్కాణించబడింది. ముఖ్యంగా మాతాపితలు ముసలివారుగా ఉన్నప్పుడు వారి ముందు విసుగును, చిరాకును ప్రదర్శించకూడదు. వారిని కసురుకోకూడదు. ఎందుకంటే ముసలితనంలో వారు బలహీనులు, నిస్సహాయులు, దిక్కు తోచనివారై ఉంటారు. అదే సమయంలో వారి పిల్లలు యుక్తవయస్కులై ఉంటారు. సంపాదనాపరులై ఉంటారు. భావాలు భావనల రీత్యా తల్లిదండ్రులకు - పిల్లలకు మధ్య ఎంతో వైరుద్ధ్యం ఉంటుంది. పరువం ఉరకలు వేసే వయసులో పిల్లలు తమ ముసలి తల్లిదండ్రుల అవసరాలను తెలుసుకుని తదనుగుణంగా మసలుకోవటమన్నది కించిత్ కష్టమైనపనే కావచ్చు. కాని ఈమాత్రం ఓపికను, సేవానిరతిని కనబరచినవాడే దైవసన్నిధిలో ప్రీతిపాత్రుడవుతాడు. హక్కుల్లో అత్యంత ముఖ్యమైనది, ప్రప్రథమమైనది తల్లిదండ్రుల హక్కు పిల్లలు తమ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. వారికి సేవలు చేయాలి. వారి ముందు అణకువ చూపాలి. ముఖ్యంగా వృద్ధాప్యంలో తల్లిదండ్రుల ముచ్చట తీర్చాలి. ఎందుకంటే వారు మిమ్మల్ని బాల్యంలో అల్లారు ముద్దుగా పెంచారు.
పక్షి తన పసిపిల్లలను తన వాత్సల్యభరితమైన నీడలోకి తీసుకోదలచినప్పుడు తన రెక్కలతో వాటిని కప్పేస్తుంది. వెచ్చని తన కౌగిలిలో ఆశ్రయాన్ని కల్పిస్తుంది. కాబట్టి మీరు కూడా మీ తల్లిదండ్రులతో అదేవిధంగా దయాభావంతో మెలగాలి. వారు మిమ్ము పసితనంలో పోషించినట్లుగానే మీరు వారిని పోషించాలి. పక్షి ఆకాశంలో ఎగిరి పోయేటప్పుడు తన రెక్కల్ని చాచుతుంది. నేల మీదికి దిగేటప్పుడు తన రెక్కలను ముడుచుకుంటుంది. అలాగే మీరు మీ తల్లిదండ్రుల ముందు వినయవినమ్రతలు చూపాలంటే మీలో కాస్తంత అణకువ ఉండాలి . మన హృదయంలో ఏముందో మనందరి ప్రభువు అయిన అల్లాహ్ కు బాగా తెలుసు. మనం సజ్జను సంతానం అయి ఉంటే, (పశ్చాత్తాపంతో) తనవైపు మరలేవారందర్నీ ఆయన క్షమిస్తాడు.
3) బంధువులు, నిరుపేదలు, బాటసారుల హక్కులు నెరవేర్చండి. సామూహిక జీవితంలో నిగ్రహం, సంయమనంతో మెలగాలి. పరస్పరం సహాయ సహకారాలు అందించుకోవాలి. ఒండొకరికొరకు త్యాగ భావన అలవరచు కోవాలి. పరుల హక్కును గుర్తించాలి. ప్రతి బంధువు తన బంధువులకు చేదోడు వాదోడుగా ఉండాలి. ప్రతి అవసరార్థుడు సాటి మనుషుల నుండి తోడ్పాటును పొందే హక్కుదారుడని తెలుసుకోవాలి. బాటసారి కొత్త ప్రదేశానికి వెళ్ళినా అక్కడి ప్రజలను తన హక్కునిచ్చే వారుగా పొందాలి. సమాజంలో జీవించే ప్రతి వ్యక్తి సాటి జనుల యెడల తనకు గల హక్కులు-బాధ్యతలను గుర్తెరగాలి. అడిగినవారికి సహాయం చేసే స్థోమత లేనప్పుడు మృదువుగా సాగనంపాలి. అదే సమయంలో దైవానుగ్రహం కోసం ప్రార్ధించాలి. ఎందుకంటే తమకు స్థోమత ఉంటే ఇతరులకు సాయం చేయవచ్చుకదా!
'హక్కు' అనే పదాన్ని ఉపయోగించటాన్ని బట్టి మనకు అర్థమయ్యేదేమిటంటే బంధువులకు, అగత్యపరులకు, బాటసారులకు ఎప్పుడన్నా ఏదన్నా యిచ్చి వారిని దెప్పిపొడవ కూడదు. ఎందుకంటే మీరు వారికి చేసేది ఉపకారం కాదు. వారి హక్కును వారికిస్తు న్నారంతే. స్థితిమంతుల ఆస్తిపాస్తుల్లో, ధనధాన్యాలలో అల్లాహ్ ఈ 'హక్కును ఉంచాడు. ధనవంతుడు గనక ఈ 'హక్కు'ను హక్కుదారులకు ఇవ్వకపోతే అతడు అల్లాహ్ సమక్షంలో పట్టుబడతాడు. ఈ జాబితాలో బంధువుల ప్రస్తావన అందరికన్నా ముందు రావటం గమనార్హం. బంధువులకు ఇవ్వవలసిన హక్కును ఇవ్వటం, వారిపట్ల ఉత్తమంగా మెలగటం - ఇదంతా 'సిలారహ్మీ'గా వ్యవహరించ బడుతుంది. సిలారహ్మీ గురించి ఇస్లాం పదే పదే నొక్కి పలుకుతోంది.
4) దుబారాఖర్చు చేయకండి. దుబారాఖర్చు చేసేవారు షైతాన్ సోదరులుగా పరిగణించబడతారు. షైతాన్ తన ప్రభువుకు కృతఘ్నుడైపోయాడు. ప్రజలు తమ దగ్గరున్న ధనాన్ని దుర్వినియోగపర్చరాదు. అవసరమున్న చోట ఖర్చు పెట్టాలి. బడాయి కోసం డబ్బును తగలెట్టడం, భోగలాలసత్వం కొరకు సంపదను దుబారా ఖర్చుపెట్టడం అనర్ధదాయకం. దైవానుగ్రహాల విలువను గుర్తించక పోవటమే. ఇలాంటి జల్సా రాయుళ్ళు షైతాన్ సోదరులవు తారు .ఎరుక. సహజమైన ఈ అసమానతలను అసహజమైన అసమానతలతో మార్పిడి చేయబోయి, ఇంకొక అన్యాయానికి పాల్పడటం తప్పు.
'తబీజీర్' అనే పదం బిజ్లున్ (విత్తనం) నుంచి వచ్చింది. విత్తనాన్ని నేలలో చల్లేటప్పుడు అది సరిగ్గా పడిందా, సరైన చోటులోనే పడిందా? లేక అటూఇటూ పడిందా? అని చూడటం జరగదు. రైతు విత్తనాన్ని చల్లి ఇంటికెళ్ళి పోతాడు. దుబారా ఖర్చు కూడా అంతే. దుబారా ఖర్చుచేసేవాడు తాను ఎంత డబ్బు తగలెట్టిందీ, ఎక్కడ తగలెట్టిందీ చూడడు. పైగా అతను విత్తనం మాదిరిగా తన డబ్బును వెదజల్లుతాడు. ఈ విధంగా డబ్బును వృధా చేసేవాడు షైతాన్ సోదరునిగా పోల్చబడ్డాడు. అందుకే మానవుడు ఈ పోలిక నుంచి తన్ను రక్షించుకోవాలంటే అతను తన సంపాదనను అనవసరమైన పద్దుల్లో నిరర్థకంగా ఖర్చుపెట్టే అలవాటును మానుకోవాలి. షైతాన్
దేవుని మేలును మరచినవాడు. కాబట్టి మానవుడు అతని అడుగు జాడలలో నడచి తాను కూడా 'దేవుని కృతఘ్నుడు'గా మారకూడదు (ఫతుల్ ఖదీర్).
5) మీరు దైవానుగ్రహం ఆశించి దానికోసం నిరీక్షిస్తూ (పేదలకు సహాయం చేయలేక) వారినుండి తప్పించుకోవలసివస్తే, వారికి మృదువుగా జవాబివ్వండి.
అడిగిన వారికి ఇవ్వాలంటే మీ దగ్గర ఉండాలి కదా! కొన్నిసార్లు మీ వద్దే లేని పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితిలో మీరు దేవుని నుంచి కలిమిని అశిస్తూ ఉంటారు. మీరేవిధంగా మీ ప్రభువుపై ఆశ పెట్టుకున్నారో అదే విధంగా చేయిచాచి అడిగేవారు కూడా మీపై ఎన్నో ఆశలుపెట్టుకుని అడుగుతారు. అలా అడిగినప్పుడు మీరు ఎంతో మృదువుగా, సున్నితంగా దాటవేయాలి. వారిని కసురుకోకూడదు. వారి మనసు నొప్పించే విధంగా మాట్లాడకూడదు.
6) మీరు మీచేతిని (ఏమాత్రం దానంచేయకుండా) మెడకేసి కట్టి ఉంచకండి. అలాగే దాన్ని పూర్తిగా తెరచి ఉంచడం కూడా సరికాదు. అలాచేస్తే మీరు నిందితులయి, నిస్సహాయులై పోతారు.
వెనుకటి ఆయతులో ధర్మం చేయటానికి నిరాకరిస్తే ఏవిధంగా నిరాకరించాలో. చెప్పబడింది. ఈ ఆయతులో ఖర్చుపెట్టవలసిన తీరు గురించి చెప్పబడింది. మనిషి తన ఆలుబిడ్డలను సయితం విస్మరించేటంత పిసినారిగానూ మారరాదనీ, ముందూ వెనుకా చూసుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా వృధాగానూ ఖర్చుపెట్టకూడదని ప్రబోధించ బడింది. పిసినారితనం వల్ల మనిషి నలుగురి చేత విమర్శించబడతాడు, అప్రతిష్ఠ పాలవుతాడు. అలాగే దుబారా ఖర్చువల్ల మనిషి దివాలా తీస్తాడు. (మూలంలో 'మహూర్' అన్న పదం వచ్చింది. నడిచి నడిచి బాగా అలసి పోయి, ఇక నడవటానికి శక్తిలేకుండా పోయిన జంతువును 'మహూర్'గా వ్యవహరిస్తారు). అలాగే దుబారా ఖర్చుచేసే మనిషి చేతిలో చిల్లగవ్వ కూడా లేకుండా చతికిలబడతాడు. 'చేతిని మెడకు బంధించి ఉంచకు' అంటే పరమ పీనాసిగా మారకు అని భావం. 'చేతిని మరీ విచ్చలవిడిగా వదలిపెట్టకు' అంటే ఇష్టం వచ్చినట్లు ఖర్చుపెట్టేసి, నెత్తిమీద గుడ్డ పెట్టుకుని కూర్చునే స్థితి రానీయకు అని అర్థం.
నీ ప్రభువు తాను కోరినట్లు కొందరికి ఇతోధికంగా ఉపాధినిస్తే, మరికొందరిని లేమికి గురిచేస్తాడు. ఆయనకు తన దాసుల స్థితిగతులు బాగా తెలుసు. ఆయన వారిని చూస్తూనేఉన్నాడు.
ఈ ఆయతులో విశ్వాసులకు ఓదార్పు ఉంది. ఎవరి వద్దయినా పరిమితమైన ఒనరులు ఉంటే వారు దైవదృష్టిలో ఆదరణకు నోచుకోలేదని భావం ఎంతమాత్రం కాదు. మనిషి ఉపాధిలో గల ఈ హెచ్చుతగ్గులలో అల్లాహ్ పరమార్థం దాగి ఉంది. ఆయన కోరితే తన శత్రువులను ఖారూన్ లాంటి కుబేరుల్లా చేసేస్తాడు. లేదా తాను ఇష్టపడే తన దాసులకు చాలీచాలని భృతిని మాత్రమే ప్రసాదిస్తాడు. ఇదంతా ఆయన యుక్తి, వివేకం.
7) దారిద్య్రభయంతో మీసంతానాన్ని చంపుకోకండి. మేము వారికీ ఆహారమిస్తున్నాం, మీకూ ఇస్తున్నాం. వారిని చంపడం ఘోరమైన పాపం. మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన అయిపోతుందేమోనన్న భయంతో సంతాన హత్యకు పాల్పడటం మహా పాతకం. ఈ దారుణానికి పాల్పడేవారు, ఉపాధి తాళం చెవులు తమ చేతుల్లో ఉన్నాయని.
అల్ అస్ఆమ్ సూరాలోనూ ఈ విషయం వచ్చింది - దారిద్య్రభయంతో మీ సంతానాన్ని (చేజేతులా) హతమార్చుకోకండి. మేము మీకూ ఆహారమిస్తున్నాము, వారికీ ఆహారమిస్తున్నాము. (151వ ఆయతు). దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) షిర్క్ తరువాత సంతానహత్యను అత్యంత ఘోరమైన అత్యాచారంగా పేర్కొన్నారు. (సహీహ్ బుఖారీ).
నేడు ప్రపంచంలో సంతాన హత్య ఎంతో పకడ్బందీగా, కుటుంబ నియంత్రణా పథకం లాంటి అందమైన ప్రణాళికలతో జరుగుతోంది. సంతానానికి మంచి శిక్షణ ఇచ్చే నెపంతో, స్త్రీల అందచందాలు తరగిపోకుండా ఉండాలనే సాకుతో ఈ ఫామిలీ ప్లానింగ్ స్కీమును అమలుపరచి సంతానాన్ని నేలపై కాలిడకుండా అడ్డుకుంటున్నారు.
దేవుడు ఈ లోకంలో నెలకొల్పిన ఉపాధి పరపకంలో మానవుడు తన కృతిమ ఉపాయాలతో జోక్యం చేసుకుని అస్తవ్యస్తం చేయరాదు. దేవుడు జీవనోపాధి విషయంలో హెచ్చు తగ్గులు పెట్టాడు. అందులో దాగివున్న పరమార్థాలు దైవానికే తలపోస్తున్నారన్న మాట! యదార్ధానికి మానవ కోటిని ఈ లోకంలో వసింపజేసిన దేవుడే అన్నపానీయాలను ఇస్తున్నాడు. మీ పూర్వీకులకు ఉపాధినిచ్చినవాడూ ఆయనే. మీ భావితరాలకు జీవనోపాధిని ప్రసాదించేది కూడా ఆయనే. జనాభా పెరిగినకొద్దీ ఆర్ధిక ఒనరులను విస్తృత పరచడం ఆయన ప్రణాళిక. కాబట్టి జనులు దైవప్రణాళికలో అనుచితంగా జోక్యం చేసుకోకూడదు. ఎట్టి పరిస్థితిలోనూ 'సంతాన హత్య'కు పాల్పడే దురాలోచనకు తావీయవద్దు. మీ తల్లి మీ చెల్లి మీ బిడ్డ మీ భార్య ఆమెను గౌరవించండి.
8) వ్యభిచారం దరిదాపులకు పోకండి. అది చాలా హేయమైనది, పరమచెడ్డదారి. ఒక స్త్రీకి ఒక పురుషునికి మధ్య అక్రమ సంబధం అనేది పరమ నీచ కార్యం. నిషేధించబడటంతోపాటు వ్యభిచారానికి దారి తీసే ద్వారాలన్నింటినీ సమాజంలో మూసివేయాలి. ) ఇస్లాంలో వ్యభిచారం చాలా పెద్ద నేరం. వివాహితుడైన పురుషుడు లేక వివాహిత స్త్రీ గనక ఈ పాపానికి ఒడిగడితే అలాంటివారు ముస్లిం సమాజంలో మనుగడ సాగించలేరు. అలాంటి వారిని ఒక్క ఖడ్గపు వేటుతో కూడా చంపకూడదు. పైగా అలాంటివారిని రాళ్లు రువ్వి నిర్దాక్షిణ్యంగా చంపాలి. ఎందుకంటే ఆ దృశ్యం సమాజంలోని సభ్యులకు ఒక గుణపాఠం కావాలి. 'వ్యభిచారం చేయకూడదు' అని చెప్పలేదు. 'వ్యభిచారం దరిదాపులకు కూడా పోకూడదు' అని అనబడింది. దీన్నిబట్టి అవగతమయ్యేదేమిటంటే వ్యభిచారానికి దారితీసే విషయాలన్నింటికీ దూరంగా ఉండాలి. ఉదాహరణకు: పరాయి స్త్రీని చూడటం, ఆమెతో కలసి తిరిగే, కబుర్లు చెప్పే ప్రయత్నం చేయటం, అలాగే స్త్రీలు విచ్చలవిడిగా బయటతిరగటం, తమకు రక్షణలేని చోట్ల తమవారు లేకుండా వెళ్లడం మంచిది కాదు. ఎందుకంటే చెడు చూపు వ్యభిచారానికి తొలిమెట్టు వంటిది.
9) న్యాయసమ్మతంగా తప్ప దేవుడు నిషేధించిన ఏ ప్రాణినీ హతమార్చకండి. ఎవరైనా అన్యాయంగా హతమార్చ బడితే అతని వారసులకు మేము బదులు తీర్చుకునే అధికారమిచ్చాం. అయితే వారసుడు (హంతకుడ్ని) వధించడంలో హద్దు మీరకూడదు. అప్పుడే అతనికి సహాయం చేయబడుతుంది. మానవ ప్రాణం పవిత్రమైనది. ఏ వ్యక్తికీ తన్ను చంపుకునే హక్కుగానీ, ఇతరుల ప్రాణాలు తీసే హక్కు గానీ లేదు. ఒకవేళ ఎవరికయినా మరణ చండన విధించాలన్నా న్యాయ (ధర్మ) బద్ధంగా మాత్రమే విధించాలి.
న్యాయబద్ధంగా చంపటం అంటే ఖిసాస్ (ప్రతీకార న్యాయం) రూపంలో చంపటం అని అర్థం. మానవ సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం హంతకునికి శిక్ష పడటం అవసరం. హతుని వారసులకు న్యాయం చేకూరటం కూడా అవసరమే. అలాగే వివాహితులై ఉండి అక్రమ లైంగిక సంబంధం ఏర్పరచుకున్న వారికి కూడా కఠిన శిక్ష వినిపించబడింది.
హతుని వారసులకు అధికారం ఇవ్వబడింది. ఇంతకీ ఏమిటీ ఆ అధికారం? అంటే రాజ్యాధికారి షరీయతుననుసరించి తీర్పు వినిపించిన తరువాత హతుని వారసుడు తాను తలచుకుంటే హంతకునిపై ప్రతీకారం తీర్చుకోగలడు. లేదా దియత్ (రక్తపరిహారం) పుచ్చుకుని ఊరుకోగలడు. లేదా హంతకునికి క్షమాభిక్ష పెట్టగలడు. ఒకవేళ ప్రతీకారం తీర్చుకోవాలన్నదే హతుని వారసుల అభిమతం అయివుంటే వారు ఈ విషయంలో హద్దు మీరకూడదు. అంటే ఒక ప్రాణానికి బదులుగా ఇద్దరు లేక అంతకన్నా ఎక్కువ మందిని చంపకూడదు. హంతకుణ్ణి చిత్రవధ చేయకూడదు. హతుని వారసుడు సహాయం పొందినవాడుగా ఖరారు చేయబడ్డాడు. అంటే అతన్ని ఆదుకోవలసిందిగా రాజ్యాధికారులకు తాకీదు చేయబడింది. అందుకుగాను హతుని వారసుడు కృతజ్ఞుడై ఉండాలే తప్ప అన్యాయానికి, అక్రమాలకు పాల్పడటం భావ్యం కాదు.
10) అనాథ పిల్లలు యుక్తవయస్సుకు చేరుకునే వరకు న్యాయసమ్మతంగా తప్ప వారి సొమ్ము దరిదాపులకు వెళ్ళకండి. (వాగ్దానం) ఒప్పందం నెరవేర్చండి. (వాగ్దానం) ఒప్పందం గురించి మీరు తప్పనిసరిగా (దేవుని ముందు) సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది .తండ్రి లేని బిడ్డలు పెరిగిపెద్దవారై, తమ కాళ్లపై నిలబడే వరకూ వారి ఆస్తి పాస్తులను రక్షించాలి. బాగు పరిచే ఉద్దేశ్యంతో తప్ప వారి సంపదను పెట్టుబడిగా పెట్టరాదు. అన్యాయంగా ఒక ప్రాణిని చంపరాదని చెప్పటంతోపాటు, ఒకరి సొమ్మును అన్యా యంగా కబళించరాదని ప్రబోధించటం గమనార్హం. అనాథల ఆస్తి విషయంలోనైతే మరింత న్యాయంగా మసలుకోవాలి. అనాథలు యుక్త వయస్సుకు చేరుకునే వరకూ వారి ఆస్తిని కాపాడాలి. వీలైతే వారి ఆస్తిని మరింతగా పెంచాలి. అర్ధం పర్ధం లేకుండా ఖర్చుపెట్టి వారి ఆస్తికి నష్టం చేకూర్చకూడదు.
11) (వాగ్దానం) ఒప్పందం నెరవేర్చండి. (వాగ్దానం) ఒప్పందం గురించి మీరు తప్పనిసరిగా (దేవుని ముందు) సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. ఒప్పందాలు వ్యక్తుల మధ్య జరిగినా, జాతుల మధ్య జరిగినా చిత్తశుద్ధితో నెరవేర్చాలి. ఒప్పందాలను ఉల్లంఘించిన పక్షంలో దేవుడు నిలదీస్తాడు. . ఇక్కడ వాగ్దానం రెండు రకాలు. ఒకటి మనిషి తాను అల్లాహ్కు చేసిన బాస. రెండు : మనిషి సాటి మనిషికి చేసిన వాగ్దానం. ఈ రెండు రకాల వాగ్దానాలనూ నెరవేర్చటం చాలా అవసరం. వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే అల్లాహ్ సమక్షంలో సమాధానం ఇవ్వవలసి ఉంటుంది.
12) సరైన పాత్రతో పూర్తిగా కొలచి ఇవ్వండి. తూచవలసివస్తే సరైన త్రాసుతో తూచి ఇవ్వండి. ఇదే సరైన పద్ధతి. ఫలితంరీత్యా కూడా ఈపద్ధతే మంచిది. కొలతలు, తూనికల్లో న్యాయంగా వ్యవహరించాలి. లావాదేవీలలో మోసానికి పాల్పడకూడదు. అంటే పుణ్యం రీత్యా మేలైనది. పైగా ఇలా ప్రవర్తించటం వలన ప్రజలలో నమ్మకం ఏర్పడుతుంది. వర్తకంలో పరపతి పెరుగుతుంది. అందుకే వ్యాపార లావాదేవీలలో నిజాయితీగా వ్యవహరించటం చాలా అవసరం. అంటే తమకు తెలియని విషయాలలో అనవసర జోక్యం కల్పించుకోవటం, కూపీలు లాగటం, అతిగా అనుమానించటం ఎంతమాత్రం తగదు. అలాగే తెలియని విషయాలపై అధిక ప్రసంగం చేయటం, వాటిని ఆచరణలో పెట్టడం కూడా సమంజసం కాదు.
13) మీకు తెలియనిదాని వెంటపడకండి. కళ్ళు, చెవులు, హృదయం వగైరా సమస్త అవయవాల్ని గురించి (దేవునికి) సమాధానం చెప్పుకోవలసిఉంటుంది. మీకు తెలియని విషయాల వెంటపడి, కూపీలు లాగే యత్నాలు చేయకండి. మీ చెవులు, కళ్ల విషయంలో మీరు దేవుని సమక్షంలో ప్రశ్నించబడతారు. మీ మనోమస్తిష్కాలలో పుట్టే ఆలోచనల గురించి ప్రశ్నించబడతారు. జాగ్రత్త! అక్కరకు రాని విషయాల వెనుకపడి మీ శక్తియుక్తులను దుర్వినియోగం చేశారంటే రేపు అల్లాహ్ సన్నిధిలో పట్టుబడతారు. నువ్వు విన్నావా? అని చెవిని, నువ్వు కన్నావా? అని కళ్ళను, నువ్వు తెలుసుకున్నావా? అని హృదయాన్ని నిలదీసి అడగటం జరుగుతుంది. ఎందుకంటే విషయ పరిజ్ఞానం ఈ మూడింటితోనే ముడిపడి ఉంటుంది. ప్రళయదినాన అల్లాహ్ ఈ శరీరావయవాలకు మాట్లాడే శక్తిని ఇస్తాడు.
14) భూమిపై నిక్కుతూ, నీల్గుతూ నడవకండి. (ఈ అహంకారంతో) మీరు భూమిని చీల్చి వేయలేరు. పర్వతాల ఎత్తుకు ఎదగనూ లేరు. భూమిపై పొగరుబోతుల్లా విర్ర వీగుతూ నడవకండి. మీ ప్రతాపంతో మీరు భూమిని చీల్చనూ లేరు. గర్వాతిశయంతో పర్వతాల ఎత్తుకు చేరుకోనూ లేరు. తమలోని మహత్తు గొప్పదని ఎంచి, తమ సత్తాకు తామే మత్తెక్కి, కళ్ళు పైకెక్కి, ఎత్తలేని బరువునెత్తి, కించిత్ అయినా కడప లేక విసుగెత్తి, ఎత్తయిన శిఖరాల నుంచి పడి చిత్తతయిన ప్రముఖులు ప్రపంచ చరిత్ర ఎత్తి చూస్తే చాలా మందే అగుపడతారు. గర్వం అంటే అహంకారం, దర్పం, దురభిమానం; డబ్బు, విద్య, అధికారం వంటి వాటి వల్ల కలిగే మితిమీరిన ఆత్మవిశ్వాసం లేదా గర్వంతో తనను తాను గొప్పగా భావించుకోవడం, ఇతరులను తక్కువ చేసి చూడటం. ఇది తనను తాను పూజించుకోవడమేనని, న్యాయంగా దేవునికి మాత్రమే చెందాల్సిన స్థానంలో నిలబడటమని కూడా అంటారు.
నిక్కుతూ, నీల్గుతూ నడవటం అల్లాహ్కు సుతరామూ ఇష్టం లేదు. ఈ గర్వాహంకారం మూలంగానే శ్రీమంతుడైన ఖారూన్ తన సిరిసంపదల సమేతంగా నేలలో కూర్చివేయ బడ్డాడు (అల్ ఖసస్-81). ఒక హదీసులో ఇలా ఉంది: "ఒక వ్యక్తి రెండేసి దుప్పట్లు ధరించి, విర్రవీగుతూ నడవసాగాడు. ఫలితంగా అతడు నేలలో కూర్చివేయబడ్డాడు. ప్రళయదినం వరకూ అతడు కూర్చివేయబడుతూనే ఉంటాడు" (సహీహ్ ముస్లిం -కితాబుల్ లిబాస్), అల్లాహ్కు దాసుల అణకువ, వినమ్రత ఎంతో ఇష్టం.
గర్వం, అహం మన ఎదుగుదలకు అడ్డుకట్ట వేస్తాయి. అవి మానవ సంబంధాలను దూరం చేస్తాయి. అహంకారాన్ని వదిలించుకోవడానికి కొన్ని చక్కని మార్గాలు: జీవితాన్ని అర్థం చేసుకోండి – మనం పొందినది అంతా తాత్కాలికమే. అది మన శ్రమకన్నా, అల్లాహ్ కృప కటాక్షానికి సంబంధించినదిగా భావించాలి. మన సంపద, ప్రతిష్ట, పదవి అన్నీ తాత్కాలికమే, ఈ నిజాన్ని గుర్తుపెట్టుకోండి. “నీ నైపుణ్యం, ధనం, అధికారం నీకు గర్వం తేవచ్చు , కానీ నీ వినయం నీకు గౌరవం తెస్తుంది!”
చివరి మాట: సూరహ్ బనీ ఇస్రాయీల్ లోని 23వ ఆయతు మొదలు 37వ ఆయతు వరకు చెప్పబడిన విషయాల గురించి తెలియజేస్తూ అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు; ఇవన్నీ దుష్కార్యాలు. మీ ప్రభువు దృష్టిలో ఎంతో హేయమైనవి. ఇవి వివేకంతో కూడిన విషయాలు. వీటిని నీ ప్రభువు నీ హృదయఫలకంపై అవతరింప జేశాడు. అంటే ప్రస్తావించబడిన విషయాలలో ఏవైతే చెడ్డవో వాటి జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే అల్లాహ్ వాటిని ఇష్టపడడు. పైగా ఇవన్నీ ప్రగతి పథంలో ప్రతిబంధకాలు అనడం ఎటువంటి సందేహం లేదు.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు