Sunday, March 30, 2014

ఉజైర్‌ (అ)




(వందేళ్ళు నిద్రపోయిన మనిషి) (500-400 క్రీ.పూ)

అల్లాహ్‌ (ఉజైర్‌తో) అన్నాడు, ''నువ్వు నూరేళ్ళు ఈ స్థితిలో పడి ఉన్నావు. నీ అన్నపానీయాల వైపు చూడు , అవి ఏ మాత్రం చెడిపోలేదు. మరి నీ గాడిదను కూడా చూసుకో...మేము (గాడిద) ఎముకలను ఏ విధంగా లేపి, వాటిపై మాంసం నింపుతామో!''   (ఖుర్‌ఆన్‌- 2: 259) 
  ఉజైర్‌ (తి) తన తోటలోకి ప్రవేశించి అక్కడి ప్రకృతి సౌందర్యానికి మ్రాన్పడి అలాగే కాసేపు నిలబడి పోయారు. పచ్చగా కళ కళలాడే చెట్లు, వాటిపై ఒక కొమ్మ మీద నుంచి మరో కొమ్మపైకి కిలకిలారావాలతో ఎగిరే పక్షులు, విసన కర్రల్లాంటి చెట్ల ఆకుల నుంచి వీస్తున్న స్వచ్ఛమైన పిల్ల తెమ్మరలు ఆస్వాదిస్తూ తన చేతిలో ఉన్న బుట్టను క్రింద పెట్టారు. అలా చాలా సేపు నిలబడిపోయారు. చెట్ల కొమ్మలు నోరూరించే పండ్ల భారంతో క్రిందికి వంగిపోయి ఉన్నాయి. ఆయన తన బుట్టను తీసుకుని అందులో రకరకాల పండ్లు కోసుకున్నారు. ఆ బుట్టను తన గాడిద వీపున కట్టారు. దానిపై కూర్చోని వెళ్ళిపోయారు.
   దారిలో కూడా ప్రకృతి సౌందర్యం గురించి, ప్రకృతిలోని రమణీయత గురించి ఆలోచించి ఆశ్చర్యపోసాగారు. గాడిద దారి తప్పి తనను ఎటో తీసుకుపోవటాన్ని ఆయన గుర్తించలేదు. ఆలోచనలో నుంచి బయటపడి చూసేసరికి ఆయన ఒక పాడుబడిన ఊరిలో ఉన్నారు. నేలపై మానవుల కంకాళాలు, జంతువుల అస్థి పంజరాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వారంతా గతించిన కాలాల ప్రజలని, వారి చిహ్నాలు చిందంవందరగా పడి ఉన్నాయని గ్రహించారు.
   ఆయన గాడిదపై నుండి క్రిందికి దిగారు. గాడిదపై ఉన్న బరువును క్రిందికి దించి, ఒక కూలిపోయిన గోడకు ఆనుకుని కూర్చున్నారు. ఆ ఊరి ప్రజలకు ఏమయ్యిందో అని ఆలోచించసాగారు. ఆయనకు మరణానంతర జీవితం గురించి ఆలోచన వచ్చింది. మరణించినవారు మళ్ళీ ఎలా బ్రతికించబడతారు? అన్న ఆలోచన ఆయన మనసులో ముసురుకుంది. ఆలోచనల్లో మునిగి అలాగే కునికిపాట్లు పడుతూ నిద్రలోకి జారిపోయారు.
  అలా రోజులు గడిచిపోయాయి, నెలలు గతించాయి. సంవత్సరాలు కాల గర్భంలో కలిసిపోయాయి. ఉజైర్‌ (అ) నిద్రలోనే ఉన్నారు. అల్లాహ్‌ తన ప్రవక్తలతో వ్యవహరించే తీరు విభిన్నంగా ఉంటుంది. సాధారణ విశ్వాసికి ఆధ్యాత్మిక విశ్వాసానికి సంబంధించిన అనుభూతి లభించకపోయినా అతను తన విధులను నిర్వర్తించవలసి ఉంటుంది. కాని దేవుని సందేశహరులైన  ప్రవక్తలకు వారి విధుల నిర్వహణలో, దేవుని సందేశం ప్రజలకు అందజేయడంలో పటిష్టమైన సంకల్పం అవసరం.   అందుకు   గాను జీవితానికి సంబంధించిన లోతయిన వాస్తవాలను తెలుసుకోవలసిన అవసరం కూడా వారికి ఉంటుంది. అందుకే ప్రవక్తల వద్దకు దైవ దూతలు వచ్చేవారు. స్వర్గ నరకాలు, భూమ్యాకాశాలు, మరణానంతర జీవితం వగైరా వాస్తవాలను వారికి చూపించడం జరిగేది.
మెలకువ
ఉజైర్‌ (అ) తన సుదీర్ఘ నిద్ర నుంచి మేల్కొన్నారు. అల్లాహ్‌ ఆదేశానుసారం ఆయన నిద్ర పూర్తయింది. ఆయన నిద్రపోయినప్పుడు  ఎలా ఉన్నారో నిద్ర లేచినప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఒక దైవ దూత ఆయన ముందు ప్రత్యక్ష మయ్యాడు. ఉజైర్‌తో దైవ దూత, ''ఎంత కాలం నిద్రపోయావని భావిస్తున్నావు?'' అని ప్రశ్నించాడు. ఉజైర్‌ జవాబిస్తూ, ''నేను ఒక రోజులో చాలా భాగం నిద్ర పోయి ఉంటాను'' అన్నారు. దైవదూత ఆయన్ని చూస్తూ, ''కాదు, నువ్వు వంద సంవత్సరాలు నిద్రపోయావు. చూడు! నీ పండ్లు అప్పుడు ఎంత తాజాగా ఉన్నాయో ఇప్పుడు కూడా అంతే తాజాగా ఉన్నాయి. నీ త్రాగు నీరు కూడా చాలా స్వచ్ఛంగా ఉంది. కాని నీ గాడిదను చూడు, కేవలం దాని అస్థిపంజరం మాత్రమే మిగిలి ఉంది... అల్లాహ్‌ మహత్యాన్ని చూడు...మరణించిన వారిని మళ్ళీ ఆయన ఎలా బ్రతికిస్తాడో అర్థం చేసుకో...దీన్ని నీ ప్రభువు తరఫు నుంచి నిదర్శనంగా భావించు. నీ మనస్సులో ఉన్న అనుమానాలన్నీ తొలగించుకో'' అన్నాడు.
    ఉజైర్‌ (అ) చూస్తుండగానే గాడిద అస్థి పంజరంపై మాంసం కండరాలు చోటు చేసుకున్నాయి. గాడిద మళ్ళీ సజీవంగా లేచి నిలబడింది. ఆయన ఆశ్చర్యంగా,  ''అల్లాహ్‌   ఏమైనా చేయగల శక్తి గలవాడని నేనిప్పుడు దృఢంగా నమ్ముతున్నాను'' అన్నారు.
  అంతరించిన గతం
ఉజైర్‌కు తెలిసిన ప్రాంతాలన్నీ పూర్తిగా మారిపోయాయి. తన ఇంటిని వెదకడానికి చాలా సమయం పట్టింది. చివరకు ఇంటికి చేరుకుంటే అక్కడ ఆయనకు ఒక వృద్ధ మహిళ కనబడింది. ఆమెకు కళ్ళు కనబడటం లేదు. కాని ఆమె జ్ఞాపక శక్తి చాలా బలంగా ఉంది. ఉజైర్‌ (అ) ఆమెను గుర్తించారు. తాను ఇల్లు వదలి వచ్చినప్పుడు ఆమె తన ఇంట్లో పని చేసే చిన్న పిల్ల.  ఆయన ఆమెతో ''ఇది ఉజైర్‌ ఇల్లేనా'' అని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇస్తూ ''అవును'' అంది. ఆమె దుఃఖంతో, ''ఉజైర్‌ ఇల్లు వదలి వెళ్ళిపోయి చాలా సంవత్సరాలై పోయాయి. ఆ తర్వాత ఎవరికీ ఆయన ఎక్కడికెళ్ళిందీ తెలియరాలేదు. ఆయన గురించి తెలిసిన వాళ్ళు చాలా మంది చనిపోయారు. చాలా కాలంగా ఆయన పేరు ప్రస్తావించిన వాళ్ళు కూడా లేరు'' అంది. ఉజైర్‌ (తి) ఆమెతో, ''నేనే ఉజైర్‌ని. అల్లాహ్‌ అభీష్టం వల్ల నేను చాలా కాలం నిద్రపోయాను. అల్లాహ్‌ా నన్ను వంద సంవత్సరాల తర్వాత నిద్ర లేపాడు'' అన్నారు.
  ఈ మాటలు విన్న ఆ వృద్ధ మహిళ చాలా ఆశ్చర్యపోయింది. కాసేపు ఏమీ మాట్లాడ లేదు.   తర్వాత,    ''ఉజైర్‌ (అ) గొప్ప ధర్మాత్ముడు. అల్లాహ్‌ ఆయన ప్రార్థనలను వినేవాడు. ఆయన రోగుల స్వస్థత కోసం ప్రార్థించిన ప్రతి సారీ వారికి ఆరోగ్యం చేకూరేది. కాబట్టి, నువ్వు ఉజైర్‌వే అయితే నా ఆరోగ్యం కోసం, నా కంటి చూపు కోసం అల్లాహ్‌ను ప్రార్థించు'' అని అడిగింది. 
   ఉజైర్‌ (అ) అల్లాహ్‌ను వేడుకున్నారు. అల్లాహ్‌ ఆయన ప్రార్థనలను ఆలకించాడు. ఆ వృద్ధ  మహిళకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరింది. ఆమె కంటి చూపు మళ్ళీ వచ్చింది. ఆమె ఆయనకు ధన్యవాదాలు చెప్పి ఈ వార్త అందరికీ చెప్పడానికి తక్షణమే బయటకు వెళ్ళింది. ఉజైర్‌ పిల్లలు, మనుమల పిల్లలు అందరూ పరుగున వచ్చారు. యువకునిగా కనబడుతున్న ఉజైర్‌ని చూసి ఆయన తమకు తాతగారని నమ్మలేకపోయారు. ''ఇది నిజమా!'' అని గుసుగుసలాడుకోసాగారు. ప్రస్తుతం ముసలి వాడైపోయిన ఉజైర్‌ కొడుకు ఒకడు ''నా తండ్రికి భుజంపై  ఒక    పుట్టు     మచ్చ ఉండేది. మా అందరికీ ఆ పుట్టు మచ్చ గురించి బాగా తెలుసు. మీరు ఆయనే అయితే ఆ పుట్టు మచ్చను చూపించండి'' అని ప్రశ్నించాడు. ఉజైర్‌ తన భుజంపై ఉన్న పుట్టు మచ్చను చూపించారు. అయినా వారికి సంతృప్తి కలగలేదు. మరో కుమారుడు, ''జెరుసలేమ్‌ను బుఖ్తనస్సర్‌ ఆక్రమించుకుని తౌరాత్‌ గ్రంథాలన్నింటినీ ధ్వంసం చేసినప్పటి నుంచి తౌరాత్‌ కంఠస్థం చేసినవాళ్ళు చాల తక్కువ మంది మిగిలారు. అలా తౌరాత్‌ కంఠస్థం చేసినవారిలో మా తండ్రిగారు కూడా ఒకరు. మీరు ఆయనే అయితే తౌరాత్‌ వినిపించండి'' అనడిగాడు. ఉజైర్‌ తౌరాత్‌ మొత్తం పఠించి విన్పించారు. ఆయన స్వరానికి వారు మంత్రముగ్దులై విన్నారు. నిజంగా ఉజైర్‌ (తి) తిరిగి వచ్చారని వారికి అప్పటికి నమ్మకం కలిగింది. అందరూ ఆయన్ని ప్రేమతో కౌగలించుకున్నారు. ఆనంద భాష్పాలు రాల్చారు.
  ఆ పిదప యూదులు, ''అల్ల్లాహ్‌ ఉజైర్‌ను మళ్ళీ బ్రతికించాడు. కాబట్టి ఆయన తప్పక అల్ల్లాహ్‌ా కుమారుడై ఉండాలి''  అనడం ప్రారంభించారు.   (చదవండి దివ్య ఖుర్‌ఆన్‌-9: 30. 2: 259)
గ్రహించవలసిన పాఠం
సాధారణంగా మనుషులు కళ్ళకు కనబడే వాటిని పట్టించుకోకుండా తమ స్వంత ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు. ఉజైర్‌ తిరిగి రావడం అల్ల్లాహ్‌ చూపించిన మహత్యంగా గ్రహించే బదులు యూదులు ఆయన్ను దేవుని కుమారునిగా పిలువడం ప్రారంభించారు.     ('ఖుర్‌ఆన్‌ కథామాలిక' - సౌజన్యంతో)

                 

అరుణోదయం అవుతేనేగాని... సూర్యోదయం అవదు

సయ్యిద్ అబ్డుస్సలాం ఉమ్రీ

  భూమండలం నియంతల, నిరంకుశ వాదుల పాదాల కింద ఎంతగా నలిగి పోకూడదో అంతగానూ నలిగిపోయాక, మానవ జాతి ఎంతగా బానిస అయిపోరాదో అంతగానూ అయిపోయాక, బ్రతుకు ఎంతగా దుర్భరం అవకూడదో అంతగానూ అయిపోయాక, మానవ రక్తం ఎంతగా పారకూడదో అంత గానూ పారాక, భవిష్యత్తు ఎంతగా అంధకార బంధురం అవకూడదో అంతగానూ అయిపో యాక, స్వేచ్ఛా పూవజిజూ విప్పారింది ఓ పవిత్రాత్మ. పుడమిని పావనం గావించేందుకు సిద్ధమయింది ఓ మానవాత్మ. మనుజ జాతి మనుగడకు మెరుగులు దిద్దేందుకు సమాయత్త మయింది ఓ మహితాత్మ. దేశ దుస్థితిని సంస్కరించేందుకు, దళితుల దుర్గతిని సుగతిగా మార్చేందుకు దేహం దాల్చింది ఓ మహాత్మ. అచేతనావస్థలో కొట్టుమిట్టాడుతున్న కొడిగట్టిన దీపం వంటి సమాజంలో చేతనా దీపాలు వెలిగించేందుకు కంకణం కట్టింది ఓ ప్రవక్తాత్మ. ఆ మహిమాన్వి తాత్మయే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స). భావికి బాట వేసిన ముహమ్మద్‌ (స) వారథి గతానికి, వర్తమానానికి, భావితారలకు వెలుగుబాటయింది. మానవ జాతి సంస్కరణకూ, ఆదర్శ సమాజ ఆవిష్కరణకూ, లోకోద్ధరణకూ, సంపూర్ణ స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు ప్రప్రథమమైనది, పునాది వంటిది దైవభీతి - తౌహీద్‌ అన్నారు ఆ ప్రవక్త (స). మనిషి ఇహ పర సాఫల్యానికీ, ముక్తికీ - మోక్షానికీ, స్వర్గానికీ -  తౌహీద్‌కీ (దేవుని ఏకత్వానికీ) మధ్య గల అవినాభావ సంబంధం ఎన్నటికీ చెరిగిపోనిది. దేశ ప్రజల, పరి పాలకుల, పుణ్యాత్ముల పట్ల అభిమానం పెంచు కోవటం తప్పు కాదు. కానీ దైవాన్నీ, దైవాను గ్రహాలనూ మరచి, షిర్క్‌కు పాల్పడి, తౌహీద్‌ను విడనాడితే ఆ జాతి గతి సుగతి కాదు, దుర్గతే అన్నారు ఆ మహా మనీషి.
   
పిల్లలకు బాల్య థ నుండే తౌహీద్‌ విశిష్ఠతను బోధిస్తూ ఉంటే వచ్చే ఫలితాలు బహుళం. దైవభీతి ద్వారా జాతి ఆచరణ సక్రమంగా ఉంటుంది.  నీతి   సంపద   వృద్ధి చెందుతుంది. మాటలో, బాటలో సారూప్యత ఏర్పడుతుంది. దేశ పౌరుల్లోని ప్రజ్ఞాపాటవాలు   ప్రగతి   పథాన    వెచ్చించ బడతాయి. స్వచ్ఛమయిన సహజ భావాల పురోభివృద్ధికి మార్గం సుగమం అవుతుంది. భావ దారిద్య్రం నుండి బయటపడి, భావ దాస్యపు సంకెళ్ళను త్రెంచే ధైర్య సాహసాలు అబ్బుతాయి. వర్గ, వర్ణ, జాతి, కుల, భాష, ప్రాంత విభేదాలు తగ్గి విశాల దృక్పథం అలవడుతుంది. దైవ దాసులు అందరూ సమానులు అన్న భావన పరిఢవిల్లుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఏకముఖంగా అందించగల ఏకేశ్వరోపాసన-తౌహీద్‌-ను విస్మరించడం  క్షంతవ్యంకాని అలసత్వమే కాదు,  క్షమించ రాని పాపం కూడా. '70 తల్లులకన్నా అధిక ప్రేమ గలవాడు అల్లాహ్‌ా. మరి అట్టి కరుణా మయుణ్ణి విస్మరించడం అంటే ఎంతటి ఘోరపాపమో ఆలోచించండి' అని జాతిని జాగృత పర్చారు జగత్ప్రవక్త ముహమ్మద్‌ (స).
 
  లోకోద్ధరణకు, శాంతికి పాటు పడాల్సిన బుద్ధి జీవులే బానిసత్వాన్ని ఇష్టపడి స్వేచ్ఛను, స్వాతంత్య్రాన్ని నిర్లక్ష్యం చేశారు.   'బానిసత్వాన్ని  ప్రేమించేవారు, చిల్లర దేవుళ్లను, రాళ్ళను, రప్పలను, అన్య ప్రతిమలను ఆరాధించటం నిత్యం కానవచ్చే దృశ్యం. 'మనకు మాత్రం తౌహీదే ప్రాణం' అని చాటడమే కాక, ప్రజల్లో స్ఫూర్తిని నింపి, చైతన్యాన్ని రగిలించి సత్య సమర యోధులుగా వారిని తీర్చిదిద్దారు.' మనిషి నిద్రావస్థ నుండి మేల్కోవాలి. అసత్యాన్ని ఎదిరించాలి. బూజు పట్టిన వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించాలి. తమస్సుకి వ్యతిరేకంగా తిరగబడాలి' అని ప్రేరేపించారు. ఈ తర్ఫీదు ఎందుకో తెలుసా? అసత్యాధిక్యతా ప్రవృత్తి అతి చెడ్డది. అది గనక జూలు విదిల్చిందంటే దానికిక యుక్తాయుక్తాల విచక్షణ ఉండదు. ఒకనాటి 70 వేల పసికందుల్ని ఇట్టే అవలీలగా హతమార్చెేంతటి దుష్టతరమైనది. అందుకే సత్యాన్వేషి, సత్య ప్రియుడు తనను తాను రక్షించుకోక తప్పదు అని కర్తవ్యబోధ చేసి, విజయ ఢంకా మ్రోగించారు ప్రవక్త ముహమ్మద్‌ (స).
 
ఆయన చేపట్టిన ఉద్యమంలో నీగ్రో బానిసయిన బిలాల్‌ ఉన్నాడు. పారశీక దేశస్థుడైన సల్మాన్‌ ఫార్సీ ఉన్నాడు. రోము దేశస్థుడైన సుహైబ్‌ రూమీ ఉన్నాడు. అరబ్బు ధీరోదాత్తుడైన అలీ ఉన్నాడు. వీర జవాను అయిన ఉమరూ ఉన్నాడు. మొక్కవోని ముసఅబూ ఉన్నాడు. ఓపికలో అందెవేసిన అబూ బకరూ ఉన్నాడు. ఉక్కు వనిత సుమయ్యా ఉంది. ఆదర్శ మహిళ అస్మా ఉంది. అరుణకాంత ఆయిషా ఉంది. పేదల పెన్నిధి జైనబ్‌ కూడా ఉంది. స్వర్గ స్త్రీల నాయకురాలు ఫాతిమా ఉంది- వీరి గురించి ఖుర్‌ఆన్‌ ఇచ్చిన సాక్ష్యం ఒకటి చాలు. అది మానవ జాతి మర్యాదకు మచ్చుతునక. స్త్రీ జాతి కీర్తికి కలికితురాయి.
 
అయితే అభూత కల్పనలను దైవ గ్రంథాలలో జొప్పించి, వాటి మాతృకలను మటుమాయం చేసి, వాటి అర్థాలను. తాత్పర్యాలను వక్రీ కరించి, వాటినే వ్యాపింపజేస్తూ సంఘానికి, సమాజానికి, దేశానికి, ప్రపంచానికి తీరని అపచారం చేయడం అన్నది ఆనాడే కాదు, ఈనాడు కూడా జరుగుతోంది.
  చరిత్రను శాస్త్రాన్నే కాదు, ఏకంగా తౌహీదునే తగులబెట్టడానికి 'ఉజైర్‌, యేసు' చాటున  గ్రంథవహుల్లోని కొందరు ఛాందసులు వేసుకున్న పథకం దైవ గ్రంథాలన్నింటిలోనూ సమానమైన తౌహీద్‌ భావనను మట్టు పెట్టి, సకల విశిష్ఠతలు, సమస్త విశేషాలు ఒక్క షిర్క్‌కే కట్టబెట్టి, ధర్మాన్ని, నీతి శాస్త్రాన్ని వంచకులకు ముట్టజెప్పడానికి సాగించిన మంతనాల బండారమంతా ఈ 'మోజునే' నిరూపిస్తున్నది. 'ఉజైర్‌, యేసు' అలాంటి ఇతరులు - దేవుళ్ళు, దైవాంశ సంభూతులు, దేవుని కుమారులు అనడానికి ఎలాంటి చారిత్రక, గ్రంథ పరమైన ఆధారాలు లేనప్పటికీ. 'త్రినిటి'  అన్న పదమే సువార్తల్లో ఎంత దేవులాడినా దొరకనప్పటికీ. 'ఆయన వాక్యమై ఉండెను, వాక్యం దేవుని వద్దనుండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను' అని కుట్రలు, కురాహకాలు పన్నేందుకు సైతం బరి తెగించారు. పైగా మేధకందని, పామరులకే కాదు, పండితులకు సయితం అంతుబట్టని, అర్థమవని ఆ సిద్ధాంతాల పంచన, ఆ విశ్వాసాల పట్టున అహంకారంతో, తలబిరుసుతనంతో ప్రవర్తిస్తున్నారు, తద్వారానే లోకశాంతి సాధ్యం అని బల్ల గుద్ది మరీ వాదిస్తున్నారు.
 
 హితం కోరేదే మతమై ఉండాలి. మతం అన్నది ఇహంలో, పరంలో, సర్వత్రా మనిషి మోక్షానికి పూబాట వేసేదిగా ఉండాలని, పేదల బ్రతుకుల్ని బాగుచేసేదిగా, పీడిత ప్రజల సాధక  బాధకాల్ని పట్టించుకునేదిగా, వారి జీవితాలను ప్రగత పథాన నడిపించేదిగా ఉండాలని ఆయన (స) చెప్పిన మాటలు నాటికీ, నేటికీ, ఏనాటికీ సప్త సముద్రాల ఆవలి గట్టు వరకఎ అనుసరించదగ్గవే.

 దైవగ్రంథాలన్నింటినీ కాచివడబోసి, వాటిలోని సారాన్ని, సత్యాన్ని సంపూర్ణాకారంలో లోకానికి అందజేసిన అపురూప గ్రంథం, అంతిమ దైవ బహుమానం ఖుర్‌ఆన్‌. అది నిజాల్ని నిగ్గు తేల్చి మరి ఉన్నవి ఉన్నట్లుగా ఎలాంటి జంకూగొంకూ లేకుండా ప్రకటించింది. వర్ణం, వంశం, అందం, భాష, ప్రాంతం, జాతి, వర్గం వల్ల గొప్పతనం రానేరాదనీ, గుణయోగ్యత, దైవభీతి వల్లనే గొప్పదనం వస్తుందని ఘంటాపథంగా చెప్పింది.
 
ఇదే సందేశాన్ని, జీవన సత్యాన్ని ప్రజలకు తెలియపర్చేందుకు వచ్చిన యావన్మంది ప్రవక్తలు 'జనం తమ మూల ధనం' అని భావించారు. నాతికి వలువ, నీతికి విలువ ముఖ్యమని చాటిన వీరు 'మనీ'కి విలువ ఇవ్వలేదని చెప్పటానికి వారి ఆదర్శ జీవితాలే సాక్షి! వారు ఎంత సేపటికీ ప్రజల యోగ క్షేమాల్ని, ముక్తి మోక్షాల్ని ఆశించారేగానీ, తాము వెనుకేసు కున్నదేమీ లేదు. 'ప్రవక్తలు దేన్నీ వారసత్వ సొత్తుగా వదలి వెళ్ళరు - ఒక ధర్మ విద్యను తప్ప' అన్నది వారన్న మాటే. ఈ కారణంగానే దైవం పట్ల భయం భక్తి, ప్రజల పట్ల అనురక్తి వారందరిలోనూ ఒకే స్థాయిలో దర్శన మిస్తుంది.
 అయితే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారికి గల ప్రత్యేకత ఏమిటంటే- దైవ ప్రవక్తలందరి జీవితాల్లో గల విశేష దృక్కోణాలన్నీ ఆయనలో మూర్తీభవించి అందంగా, అతి మనోహరంగా ప్రతిబింబిస్తూ కన్పిస్తాయి. ఆయన కేవలం ఒక ప్రవక్త మాత్రమే కాదు - నీతిమంతుడైన ఒక వ్యాపారి, నిజాయితీపరుడైన ఒక ఉద్యోగి, దయా హృది గల ఒక యజమాని, అవిరళం శ్రమించే ఒక కార్మికుడు, శత్రువులకు సైతం న్యాయం చేసే ఒక న్యాయాధిపతి. ధర్మ సంస్థాపనార్థం ధన, మాన, ప్రాణాలొడ్డి పోరాడే ఒక సైనికుడు, ఆయన రాజ్యాలను జయించటానికి వచ్చిన రాజు కాదు, హృదయాలను జయించడానికి అరుదెంచిన అరుణోదయ కిరణం! దైవ ప్రవక్త!! అంతిమ దైవ ప్రవక్త!!! మనిషిని మానవునిగా మలచగ వచ్చిన మానవ మహోపకారి!!!!
 
ఒక్కసారిగా ఇన్ని లక్షణాలు మూర్తీభవించిన ప్రవక్తోత్తములు ఈ జగాన ఒక్క ముహమ్మద్‌ (స) వారే అనడంలో ఎలాంటి సందేహం లేదు.  ఈ బహుముఖ శేముషి ఆయనకెలా ప్రాప్తమయింది? దివ్యావిష్కృతామృత జీవ జలంనుంచి, పరమోన్నత ప్రభువైన   అల్ల్లాహ్‌  జ్ఞాన  శక్తి నుంచి. 'అన సయ్యిదు ఉలిది ఆదమ్‌, వలా ఫఖర్‌' (నేను ఆదం సంతతి మొత్తానికి నాయకుణ్ణి, ఇది గర్వాతిశయంతో చెప్పే మాట కాదు) అన్న పలుకు ఆయన నోట జాలు వారినదే. 'నేను ఇబ్రాహీమ్‌ (స) ప్రార్థనా ఫలాన్ని, ఈసా (అ) సువార్త రూపాన్న'ని కూడా ఆయన అనేక సార్లు చెప్పారు.
 
అయితే - బుద్ధి తికమక పడిన వారు ఈ ప్రవచనాలకు పెడర్థాలు తీసి  నేటి ఆధునికంలో ఆ మహా మహుని గురించి చేసే దుష్ప్రచారం జోరుగానే సాగుతున్నది. 'మనిషి తనకు తెలియని దానికి శత్రువ'న్నట్టు ఆ మహితాత్ముని జీవితం, ఆదర్శమెరుగని ప్రపంచం ఆయన్ను శత్రువుగానే చిత్రీకరిస్తున్నది. దాన్నే నిజం అని నమ్మబలుకుతున్నది. ఇట్టి దయనీయ స్థితిలో సైతం దైవాదేశాలకు, దైవ ప్రవక్తల ప్రవచనాలకు విలువిచ్చేవాళ్ళు, వాటి వేగాన్ని, లాభాన్ని కొలిచేవాళ్ళు, వాటిలో దాగివున్న ముత్యాలను, పగడాలను వెలికి తీసి లోకానికి అంద జేసేవాళ్ళు లేకపోలేదు. వారు ఎక్కువ సంఖ్యలో కాకపోయినా, తక్కువ సంఖ్యలో ఉన్నారన్నది అసత్యవాదుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించే సత్యం. 'కడుపు నిండిన వారి స్థితి వేరు, కడుపు పండిన వారి స్థితి వేరు, కడుపు మండిన వారి దుస్థితి చాలా వేరు' అన్నట్టు, సత్యం తెలిసిన వారి గతి వేరు, సత్యం పాటించేవారి స్థితి వేరు, సత్యాన్ని తృణీకరించిన వారి దుర్గతి చాలా వేరు. నేడీ ఆధునిక యుగంలో సైతం లోకం కాంతికి కళ్ళు తెవాలంటే...సత్సమాజ సంస్థాపన జరగాలంటే ...ప్రవక్త (స) వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని, లోతుగా పరిశీలన జరిపి, ఆయన ప్రవచనాలను బాగా జీర్ణం చేసుకుని కార్చారణకు ఉపక్రమించటం తప్ప మార్గాంతరం లేదు. ఇదే నేడు విశ్వ జనులందరి పాలిట తరుణోపాయం. వేయి సూర్యులు ఉదయించు గాక, వేయి చంద్రులు ఉదయించుగాక, మహా ప్రవక్త (స) వారి మహితోక్తుల కాంతి ద్వారా తప్ప మనో చీకట్లు, మనుషుల మధ్య దూరాలు తొలగవు. సత్యశోధన అనే ఈ అరుణోదయం అవనిదే 'లోక శాంతి' అనే సూర్యోదయం అవదు. మరి జనులు ఇరుకు బుద్ధులు పెంచుకుని ఇరకాటంలోనే కొట్టుమిట్టాడుతారో, సార్వజనీన భావాన్ని వృద్ధి పరచుకుని లోక శాంతినే సాధించుకుంటారో వారే నిర్ణయించుకోవాలి.        
   

Wednesday, March 5, 2014

మహా గొప్ప మానసిక శాస్త్రవేత్త ముహమ్మద్‌ (స)



 వ్యక్తుల పరువుప్రతిష్టలు, సమాజంలో వారికున్న గౌరవోన్నతలను బట్టి వారితో వ్యవహరించాలి. ప్రతి వ్యక్తికీ సముచితమైన స్థానం ఇవ్వాలి. ఒక గౌరవనీయుణ్ణి అతని స్థాయికంటే దిగజార్చడం, ఒక నీచుణ్ణి పదవి పీఠాలపై ఎక్కించడం అనేది అనేక రకమైన అపసవ్య తలకు, అపశృతులకు, అనర్థాలకు దారి తీస్తుంది. ఈ కారణంగానే దైవ ప్రవక్త (స) వ్యక్తులతో సంభాషించడంలోగానీ, వ్యాపార లావా దేవీలు చేసేటప్పుడుగాని ఎదుటి వ్యక్తి స్థాయి, స్థోమతను, మనో భావాన్ని, ఆత్మాభిమానాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ప్రవర్తించేవారు. తన చుట్టూ ఉన్న అనుచర గణంలో ప్రతి ఒక్కరిలోని బలగాలు, బల హీనతల మీద ఆయన దృష్టి ఉండేది. ప్రతి వ్యవహారంలోనూ ఎదుటి వ్యక్తి మనోభావాన్ని పరిగణలోకి తీసుకుని మరి మసలుకునేవారు. ఓ సందర్భంలో స్వయంగా ఆయన (స) ఇలా సెలవిచ్చారు: ''ప్రజలతో వారి స్థాయిని బట్టి వ్యవహరించండి''. (అబూ దావూద్‌)

  ఆయన (స) తాను తీర్పు ఇవ్వగోరే వ్యక్తుల పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించేవారు మహనీయ ముహమ్మద్‌ (స). వారికి ఏదైనా బోధిం చాలనుకున్నప్పుడు వారి ఆర్థిక, బాహ్య, ఆధ్యాత్మిక, నైతిక, విద్యాపర మైన ప్రకర్షను దృష్టిలో పెట్టుకుని మరీ హితోపదేశం చేసేవారు. ఓ వ్యక్తి వచ్చి 'సత్క్రియల్లో మహోత్కృష్టమైనదేది?' అని ప్రశ్నించగా - ''ధర్మ పోరాటం (జిహాద్‌)'' అని బదులిచ్చారు. అదే ప్రశ్న మరో వ్యక్తి వచ్చి అడిగినప్పుడు-''నమాజు'' అని సెలవిచ్చారు. ఇంకో వ్యక్తి వచ్చి అడిగినప్పుడు-''ఉత్తమ నడవడిక'' అన్నారు. పైకి పరస్పరం విరుద్ధంగా కనబడుతున్న ఈ సమాధానాలు నిశిత దృష్టితో గనక ఆలోచిస్తే అలాంటి వైరుధ్యం వీటిలో లేదని తెలుస్తుంది. ఒక వ్యక్తి అయిదు పూటల ప్రార్థనలు, రమజాను ఉపవాసాలు, జకాత్‌, హజ్‌ మొదలగు విధులను చక్కగా నిర్వర్తిస్తున్నాడు. కానీ 'ధర్మపోరాటం-జిహాద్‌' అంటే అతనికి ఒక విధమైనటువంటి ఇబ్బంది. కనుక అతన్ని 'జిహాద్‌' మహా కార్యం అన్నారు. మరో వ్యక్తి సత్కర్మలన్నీ బాగానే చేస్తున్నాడు. కాని నమాజు పట్ల అలసత్వం, నిర్లక్ష్య ధోరణి కలిగి ఉన్నాడు గనక 'నమాజ్‌' ఉత్కృష్ట కార్యం అన్నారు. ఇంకో వ్యక్తి దైవానికి సంబంధించిన విష యాల్లో బాగున్నాడు; కాని దాసుల విషయంలో, వారి హక్కుల విష యంలో మహా దారుణంగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి  'ఉత్తమ నడవడిక' అని హితవు పలికారు. అవును-, వివేకికి, అవివేకికి మధ్య గల తేడా ఒక్కటే. వివేకి ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని మరి చెబు తాడు. అవివేకి తనకు కావలసింది మాత్రమే ప్రజలకు చెబుతాడు.
  ఒక వ్యక్తి దైవ ప్రవక్త (స) వారి పవిత్ర సన్నిధికి వచ్చి-''నేను (ధర్మం కోసం) ప్రస్థానం (హిజ్రత్‌) చేెస్తాననీ, జిహాద్‌ (ధర్మయుద్ధం)లో పాల్గొం టానని మీతో ప్రమాణం చేసి చెబుతున్నాను. ప్రతిగా  అల్లాహ్‌ తరఫు నుండి ప్రతిఫలాన్ని  ఆశిస్తున్నాను'' అన్నాడు. అది విని మహనీయ ముహమ్మద్‌ (స) ఆ వ్యక్తితో-''నీ తల్లిదండ్రులలో ఏ ఒక్కరైనా బ్రతికి ఉన్నారా?'' అనడిగారు. 'అవును, ఇద్దరూ బ్రతికే ఉన్నారు' అని సమా ధానమిచ్చాడా వ్యక్తి. ''మరైతే నిజంగా నువ్వు, అల్లాహ్‌ా నీకు మంచి ప్రతిఫలాన్ని ఇవ్వాలని అభిలషిస్తున్నావా?'' అని మళ్ళీ ప్రశ్నించారు ప్రవక్త మహనీయులు (స). 'అవును' అన్నాడతను.
అప్పుడాయన ''అలాగైతే నువ్వు నీ తల్లిదండ్రుల దగ్గరికి తిరిగి వెళ్లిపో. వారిద్దరినీ బాగా చూసుకో'' అని చెప్పి పంపించారు. మరో హదీసులో ''నువ్వు నీ తల్లిదండ్రుల సేవలోనే పరిశ్రమిస్తూ ఉండు. అదే నీపాలిట జిహాద్‌'' అని ఉంటే, ఇంకో ఉల్లేఖనంలో ''నువ్వెలాగైతే వారిని ఏడి పించి వచ్చావో, వెళ్ళి అలానే వారిని నవ్వించు'' అని ఉంది.  (బుఖారీ, ముస్లిం)
  అంటే, వచ్చిన ఆ వ్యక్తికి ఇతర ధర్మ కార్యాల పట్ల శ్రద్ధ ఉండేది కాని, తల్లిదండ్రుల ఎడల శ్రద్ధ ఉండేది కాదు. ఈ కారణంగానే ''నీ జిహాద్‌ నీ తల్లిదండ్రుల సేవ'' అని సెలవిచ్చి పంపారు ప్రవక్త మహనీ యులు (స). సుబ్హానల్లాహ్‌!
 
మరో అద్భుత సంఘటన గురించి తెలుసుకుందాం రండి! ఓ వ్యక్తి దైవ ప్రవక్త (స) వారి పవిత్ర సన్నిధికి వచ్చి-'యా రాసూలల్లాహ్‌ా! నాలో లేని అవలక్షణమంటూ ఏది లేదు. జూదం, చోరీ, వ్యభిచారం, అబద్ధ మాడటం-అన్నీ ఉన్నాయి. (సకల అవలక్షణాల పుట్టననుకోండి). అయితే వీటన్నింటిని ఒకేసారి ఉన్నపళంగా మానుకోవాలంటే నా వల్ల కాని పని. తమరు మన్నిస్తారంటే ఏదో ఒక అవలక్షణాన్ని వదులుకోవ డానికి సిద్ధంగా ఉన్నాను' అని చెప్పుకొచ్చాడు. అతను చెప్నిదంతా శ్రద్ధగా విన్న ప్రవక్త మహనీయ (స) ''సరే-నీవు ఎప్పటికీ అబద్ధమాడ నని ప్రమాణం చేస్తావా?'' అనడిగారు. అందుకావ్యక్తి- '(ఓస్‌ ఇంతేనా, అదెంత పని) యా రసూలల్లాహ్‌ా! ఈ క్షణం నుంచి జీవితంలో ఎన్నడూ అసత్యం పలుకనని మనస్ఫూర్తిగా ఒట్టేసి చెబుతున్నాన'న్నాడు. తర్వాత ఆ వ్యక్తి తనలో తాను ఉబ్బితబ్బిబ్బవుతూ -ఆహా! ఎంత భాగ్యం!! దైవ ప్రవక్త (స) ఎంత తేలికైన విషయాన్ని వదలమన్నారు' అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
 
రాత్రయింది-దొంగతనం చేయాలన్న ఆలోచన ఒకసారి వస్తే, మద్యం సేవించాలన్న ఆలోచన మరోసారి, మగువ ఒడిలో సేద తీరా లన్న ఆలోచన ఇంకోసారి, జూదం, మట్కా ఆడాలన్న ఆలోచన ఒకసారి అతన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. అయితే చెడు ఆలోచన వచ్చిన ప్రతిసారి ప్రవక్త మహనీయులు (స) వారితో చేసుకున్న ఒడంబడిక అతనికి గుర్తొచ్చేదీ. అదే క్షణంలో ఆ నేరం తాలూకు శిక్ష కూడా అతని మనో తెరపై కదలాడేది. ఒకవేళ అబద్ధం చెబుదాములే అనుకున్నా ప్రవక్త మహనీయుల (స) వారి సన్నిధిలో అది సాధ్యపడదు. అలా ఆ వ్యక్తి ఒక్కో వ్యసనాన్ని, పాపాన్ని పరిత్యజిస్తూ ఉదయం   అయ్యేకల్లా  పరమ   పునీతుడై పోయాడు. (ఒక్క రాత్రి వీటన్నిం టకి దూరంగా ఉండగలిగిన నేను ఇకమీదట అన్ని రాత్రులు కూడా వీటన్నింటికీ దూరంగా జీవించగలనన్న ఆత్మ విస్వాసం అతనికి ఏర్ప డింది.) కొన్ని రోజుల తర్వాత దైవ ప్రవక్త (స) వారి సన్నిధికి వచ్చిన అతని యోగక్షే మాల్ని అడిగారు ప్రవక్త మహనీయులు (స). సమాధానంగా అతను-'యా రసూలల్లాహ్‌ా! 'అబద్ధం ఆడను' అన్న చిన్న మాట నాలోని అవలక్షణాలన్నింటిని తొలగించేసింది' అని సంబర పడిపొతూ చెప్పాడు.
 
చుట్టూ ఉన్న ఒనరుల పట్ల నాయకుడైన ప్రతి ఒక్కడికి అవగాహన ఉండాలి. ఒన రులు అంటే-,గనుల్లో దొరికే బొగ్గో, వజ్ర మో, అడవిలో దొరికే కలపో, శ్రీచందనమో లేదా ధనం మాత్రమే కాదు. మన స్థాయి, మన పరివారం సామర్థ్యాలు, మన చుట్టూ ఉండే వ్యక్తుల టాలెంట్‌ ఇవన్నీ మానవ గనికి సంబంధించిన ఒనరులే. ఒకవేళ నాయకుడు తన సహచర బృందం యొక్క స్థాయి, సామర్థ్యాలను సరిగ్గా అంచనా వేయకపోతే, వారిలోని ప్రతిభాపాటవాలను, పాండిత ప్రకర్షను గుర్తించకపోతే వారి శక్తీ స్థోమతల్ని పసిగట్టిన ఇతరులు వారిని ఎగ రేసుకుపోతారు.

అలాగే వారిలో గల బలహీనతలను సయి తం గుర్తెరిగి వాటిని బలగాలుగా తీర్చి దిద్దాలి. ఒక్కో వ్యక్తి ఒక్కో పని ఇష్టంతో చేస్తాడు, మరో పని పట్ల అశ్రద్ధ కనబర్చ వచ్చు. అలాంటప్పుడు అతనిలో ఆ పని పట్ల శ్రద్ధను పెంచాలి. ఆ పనిని ఎంతో చాక చక్యంగా తను చేయగలడని ధైర్యమివ్వాలి. ఒక పనికి ఒక వ్యక్తిని నియమించినప్పుడు అతన్ను నమ్మాలి. అనుమానం ఉన్న వ్యక్తిని నియమించకూడదు. నియమిస్తే అనుమా నించకూడదు. తన సహచర బృందాన్ని తన అక్కున చేర్చుకోవడం సమర్థ నాయకుడి లక్ష ణం. వారిలోని ప్రతిభాపాటవాలను పిండేసి, వారి శ్రమ శక్తిని గుంజేసి, ఎంతగా వాడుకో వాలో అంతగానూ వాడేసి తరువాత వదిలే యడం అసమర్థ నాయకుడి లక్షణం. సహ చరులొచ్చి సలహా అడిగినప్పుడు సమర్థుడి అభిప్రాయం వినడానికి సర్వసాధారణంగానే అన్పిస్తుంది. కానీ అది ఎలాంటి చిక్కు లేకుం డా సమస్యను సలువులగా పరిష్కరించి ఫలి తాన్ని అనుభవించేలా చేస్తుంది. ఇదే విష యాన్ని మనం పై ఉదాహరణలలో చూడ గలం.