Thursday, March 31, 2022

మేడిపండు నాగరికత మనకొద్దు (ఏప్రిల్ ఫూల్ ఓ వెకిలి చేష్ట)


ప్రపంచ ముఖచిత్రం రోజురోజుకీ మారిపోతూ  ఉంది. నేటి మన యువతరం ఎక్కువగా ఏదో ఆందోళన, భయం, కంగారు, మానసిక ఒత్తిడితో సతమతమవుతూ ఉంది. ఏమి చేయాలో తోచక సిగరెట్లు, మద్యపానం, మాదకద్రవ్యాలపై ఆధారపడటమో, నిస్పృహకు లోనై తమనితాము వంచించుకొని, ఇతరులను మానసిక క్షోభకు గురి చేయడమో చేస్తున్నారు. ఇలాంటి చెడు అలవాట్లకు జతగా చేరిన మరో మూర్ఖ ఆచారమే 'ఏప్రిల్ ఫూల్'!


పాతదైనంత మాత్రాన ప్రతీదీ పనికిరానిది కాదు. కొత్తదైనంత మాత్రాన ప్రతీదీ గొప్పది కాదు. పాత కొత్తల మేలు కలయికే జీవితంలో అనుసరించవలసిన అసలు మార్గం. సమయం సందర్భాన్ని బట్టి ఉచితానుచితాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు తమ ఆలోచనలో వైఖరిలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నించాలి. ఎందుకంటే- మార్పు చైతన్యానికి చిహ్నం! చైతన్యం జీవానికి చిహ్నం!!

ఫూల్స్ డే అనగా ఏప్రిల్ ఒకటవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా సరదాగా జరుపుకునే ఒక పండగ. ఈ సందర్భంగా ఒకరినొకరు ఆటపట్టించుకోవడం, గాలి వార్తలు ప్రచారం చెయ్యడం దీని ప్రత్యేకత. దీని బాధితులని ఏప్రిల్ ఫూల్స్ గా వ్యవహరించడం పరిపాటి. కొన్ని వార్తా పత్రికలు, మ్యాగజీన్లు కూడా ఒక్కోసారి అసత్య కథనాలను ప్రచారం చేస్తూ ఉంటాయి. మళ్ళీ మరుసటి రోజు ఎక్కడో చిన్న అక్షరాలతో వివరణ ఇస్తుంటారు. 19 వ శతాబ్దం నుంచి బాగా ప్రాచుర్యం లోకి వచ్చినా ఫూల్స్ డే ఏ దేశంలోనూ సెలవు దినం కాదు.

ఏప్రిల్ ఒకటవ తేది - 'కువైట్ టైమ్స్' లో పతాక శీర్షికతో వచ్చిన వార్త.... ఆ వార్తకు కువైట్ లోని సత్పౌరులందరూ కదిలిపోయారు.
బ్రాందీ, బీరు, విస్కి తదితర మద్యపానాలకు ప్రభుత్వం పర్మిట్ ఇచ్చిందని ఈ పత్రిక ప్రచురించింది. కాకపోతే లోపలి పేజీల్లో ఎక్కడో చెప్పబడింది . “ఏప్రిల్ ఫూల్!' అని. అయితే పరిహాసానికి ఇలాంటి వార్తలే కావాలా!? ఇలాంటి పనికిమాలిన వార్తలు  ప్రచురించిన  ప్రతి పత్రిక యాజమాన్యం, సంపాదక వర్గం ఆలోచనలు ఎంత ప్రమాదకరమైన దిశలో పయనిస్తున్నాయో ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన తరుణం ఇది.

అలాగే విన్న ప్రతి మాటలోని నిజానిజాలు తెలుసుకోకుండా ఇతరులకు చెప్పేయటం, లేక దాన్ని నిజమని తలపోయడం మనకు ఏవిధంగానూ శోభించదు. ఎందుకంటే-'మనిషి అబద్ధాలకోరు' అని చెప్పడానికి విన్న ప్రతి మాటను (ఉచితానుచితాలు తెలుసుకోకుండా) ప్రచారం చెయ్యడం ఒక్కటి చాలు' అన్నారు అంతిమ ప్రవక్త ముహమ్మద్ (స). 'అబద్దం చెడు గుణాలన్నిటికీ మూలం' అన్నారు వెనుకటికి పెద్దలు. అబద్ధం చెప్పే ఈ దురలవాటుని ప్రపంచ మతాలన్నీ తప్పు పట్టాయి. బుద్ధి వివేకాలు సైతం ఈ మాటను సమర్ధిస్తాయి. అదే సత్యసంధతను తీసుకోండి. అది మానవ ప్రగతికి, లోకాభివృద్ధికి ఆయువు పట్టులాంటిది.

సత్యం లోకంలో జరిగే మేళ్ళన్నింటికి సరోవరం. అది దైవ దౌత్యపు ఉత్పత్తి స్థానం. దైవ భీతికి చిహ్నం. సత్పురుషులు సేద తీరే ఆలయం. సత్యసంధతే గనక లేకపోతే నేడు మనకు అందుబాటులో ఉన్న మంచి సూత్రాలన్నీ కాలం చెల్లిన సిద్ధాంతాలుగా మిగిలిపోయి ఉండేవి. ఈ కారణంగానే ఇస్లాం ధర్మ శాస్త్రం-ప్రతి భక్తుడు సత్యసంధతను తన ఆభరణంగా స్వీకరించి, నీతి, నిజాయితీగా బ్రతికేందుకు కృషి చేయాలని వక్కాణిస్తోంది. అబద్ధం, అపహాస్యం, అపనింద, అపవాదాలకు ఆమడ దూరంలో ఉండాలని హితవు చేస్తోంది. ఎందుకంటే- సత్యసంధత మంచి వైపు తీసుకెళుతుంది. సత్కార్యం స్వర్గానికి గొనిపోతుంది. ఇక 'స్వర్గం' అంటారా! అది ప్రతి భక్తుడి యొక్క సత్కార్యాలకు ప్రతిఫలంగా ప్రాప్తించే శాంతి నిలయం!! దారుస్సలాం!!!

మహా ప్రవక్త (స) వారికి సైతం అబద్ధాల కోరంటే మహా అసహ్యం. కాపట్య లక్షణాల్లోని ఓ లక్షణంగా అబద్ధాన్ని పేర్కొన్నారు అబద్ధం- అది అవిధేయత వైపు తీసుకెళు తుంది. అవిధేయత నరకానికి గొనిపోతుంది.నరకం మహా భయంకర నివాసం. విశ్వాసి అయిన ప్రతి వ్యక్తి దాన్నుండి దేవుని శరణు కోరుకుంటాడు. దాన్నుండి శాయశక్తులా దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు. ఇక ఆ సత్య స్వరూపుడు చేసే హితవును కాస్త గమనించండి! “విశ్వాస భాగ్యం పొందిన ప్రజలారా! అల్లాహు భయపడండి. సత్యవంతులకు తోడ్పడండి'. (తౌబా: 119)

కాపట్య లక్షణాల్లోని ఓ లక్షణంగా అబద్దాన్ని పేర్కొన్నారు. ప్రవక్త ముహమ్మద్ (స). అవి: (1) కపటి- అతనికి ఏదైనా వస్తువు అప్పగిస్తే
ద్రోహానికి పాల్పడతాడు. (2) నోరు తెరిస్తే అబద్దం చెబుతాడు. (3) మాట ఇచ్చి తప్పుతాడు. (4) గొడవకు దిగితే (పచ్చి బూతులు తిడుతూ)
నోరు పారేసుకుంటాడు.' (ముస్లిం)

అయితే నేడు అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే- పాశ్చాత్య మోజులో పడి, గాడి తప్పి ప్రవర్తిస్తోంది మన యువతరం. మానవ జీవితాల్లో వెగటును నింపి, మానవతను ఛిన్నాభిన్నం చేసి, జీవితాల్లో శాంతి తృప్తి అన్నవి లేకుండా చేసిన పాశ్చాత్య విష సంస్కృతి నేటి మన యువతరానికి ప్రోగ్రసివ్ గా,నాగరికతగా తోచడం కడు శోచనీయం! పాశ్చాత్య సంస్కృతి నుండి దిగుమతి చేసుకున్న మరో ఫూల్ ఆచారమే 'ఏప్రిల్ ఫూల్'!

ఈ వెర్రి పోకడ కారణంగా ఎంత మంది ప్రజలు మనోక్షోభకు గురయ్యారు? ఎంత మంది మానమర్యాదలు మంటగలిశాయి? ఎన్ని ఆర్థిక నష్టాలు జరిగాయి? ఎందరి జీవితాలు ఈ పెనుభూతానికి బలయ్యాయి? పైపై దృష్టిగలవారికి విడమరచి చెప్పినా ఇది
బోధపడదు. ఇలా చేసే వారి వైఖరిని ప్రవక్త (స) తీవ్రంగా ఖండించారు. “ప్రజల్ని నవ్వించేందుకు అబద్దమాడే వ్యక్తి నాశనంగాను, నాశనంగాను” అని గర్షించారు. హజ్రత్ ఉమర్ (ర.జి) గారు ఇలా అభిప్రాయ పడ్డారు: 'విశ్వాస శిఖరానికి చేరుకోవాలంటే మాట వరుసకైనా, అబద్దం అనకూడదు. హద్దు మీరిన పరిహాసం వల్ల మనిషి ప్రతిష్ఠ దెబ్బ తింటుంది. ఇతరుల్ని అపహాస్యం పాలుజేసి నవ్వుకునే వ్యక్తి కన్నా- తన పరలోక జీవితాన్ని నాశనం చేసుకునేవాడు మరొకడుండడు.ఇక ప్రియ ప్రవక్త(స) వారి విషయానికొస్తే అప్పుడప్పుడు మహాప్రవక్త(స) వారి మాటల్లో హాస్యం తొణికిసలాడేది అన్న మాట నిజమే. అయితే ఆయన(స) చెప్పే ప్రతి మాటలోనూ సత్యం ఉట్టిపడుతూండేది. తరచూ ఆయన(స) “నేను హాస్యం చేసినా సత్యమే పలుకుతాను" అనేవారు. పోతే శిక్ష అంటారా! మేరాజ్ సందర్భాన ప్రవక్త(స) చూసిన అనేక దృశ్యాల్లోని ఒక దృశ్యానికి వివరణ చెబుతూ దైవదూతలు ఇలా అభిప్రాయపడ్డారు: “మేము సమీపించిన మూడవ వ్యక్తి -అతని దవడను, ముక్కు రంధ్రాన్ని, కంటిని, మెడ వెనుక భాగం వరకూ చీలేయబడుతూ ఉంది. అతడు ఎవరంటే- ఉదయం తన ఇంటి నుండి బయలుదేరినప్పటి నుంచి అబద్ధాలు చెబుతూ (తిరుగుతూ) ఉండేవాడు. అతడు చెప్పిన అబద్ధాలు (లోకం ) నలుదిక్కులా (ఆకాశం అంచులదాక) వ్యాపించేవి.” (బుఖారీ)

ఇతరులు మనల్ని ఆట పట్టించటాన్ని, అవహేళన చేయటాన్ని మనం ఎలాగైతే ఇష్టపడమో, మనం ఇతరుల్ని అపహాస్యం చేయడం , ఆట పట్టించడం, ర్యాగింగ్ చేయడం వారికీ సుతరామూ ఇష్టం ఉండదు. తన కోసం దేన్నయితే ఇష్టపడతాడో తన సోదరుడి కోసం కూడా దాన్నే ఇష్టపడిన వాడే నిజాయితీగల విశ్వాసి అని ప్రవక్త(స) చెప్పే వున్నారు. అంతగా నవ్వాలనే అనుకుంటే కాలే కడుపుల మంటను పిడికెడు అన్నంతో చల్లార్చి నవ్వండి. బట్టలు లేక అర్ధనగ్న శరీరాలతో చితికి పోయిన బ్రతుకులకు నిండు బట్టలు తొడిగించి నవ్వండి. తల దాచుకోవటానికి పూరి గుడిసె అయినా లేక ఫుట్ పాత్ లపై పడి అల్లాడే అభాగ్యులకు ఆశ్రయం కల్పించి నవ్వండి. అప్పుడు మీ సంతోషానికి పుణ్యమూ లభిస్తుంది, మీ ఆనందానికి ఓ అర్థమూ ఉంటుంది. అంతే గాని పాశ్చాత్య నాగరికత మోజులో పడి మీ వ్యక్తిత్వాన్ని నాశనం చేసుకోకండి. ఏఫ్రిల్ ఫస్ట్ లాంటి ఫూల్స్ ఆచారాలకి దూరంగా ఉండండి. దైవశిక్షకు భయపడండి. పగ ద్వేషాలను రూపుమాపి సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పండి. ఇలా గనక మీరు చేస్తే ఇటు మనుషులూ సంతోషిస్తారు. అటు దేవుడూ  మెచ్చుకుంటాడు. మార్పు అవసరమే. మారేందుకు సిద్ధమవ్వండి. గతం గతః. మంచి భవిష్యత్తుకు బాట వేయవలసిన అవసరం, సమయం ఆసన్నమయ్యాయి అని గుర్తించండి, చివరి మాటగా ఆ మాధవుడి మాటను స్వీకరించండి“మీకు తెలియని విషయం వెంట పడకండి. నిశ్చయంగా కళ్ళూ, చెవులూ, మనస్సూఅన్నింటి (ప్రతి ఇంద్రియం) విషయంలోనూ విచారణ జరుగుతుంది.” (బనీ ఇస్రాయీల్: 34)




Thursday, March 24, 2022

పవిత్ర మాసం రమజాన్ పిల్లల దృష్టిలో

పవిత్ర మాసం రమజాన్ పిల్లల దృష్టిలో  



ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వివిధ పండుగలు జరుపుకుంటారు. ఈ పండుగలన్నింటికీ వాటి స్వంత ప్రాముఖ్యత ఉంది. అదే విధంగా, రంజాన్ మాసం ఇస్లాంలో అత్యంత పవిత్రమైన నెల. నెలవంక చూసి., అందరి హృదయాల్లో ఆనందాన్ని నింపుతూ, రంజాన్ ముబారక్ చెబుతూ. ఉపవాసం సహరీ చేయడం ద్వారా ప్రారంభమవుతుంది. ఫజ్ర్ యొక్క అజాన్ తర్వాత, మేము త్రాగడం మరియు తినడం మానేస్తాము. ప్రార్థన చేయడానికి మసీదు వైపువెళతాము. మేము పవిత్ర ఖురాన్ మొదలైనవాటిని చదవడం ద్వారా సర్వశక్తిమంతుడైన అల్లాను ఆరాధిస్తాము. మగ్రెబ్ యొక్క అజాన్ వద్ద, మేము ఖర్జూరం మరియు నీటిని పొందడం ద్వారా ఉపవాసాన్ని విరమిస్తాము మరియు ఇది కొనసాగుతుంది.



 ఈ నెలలో చంద్ర మానం  ప్రకారం 29 లేదా 30 రోజులు ఉపవాసం ఉంటుంది. ఈ రోజులను  అష్రా అని 3 భాగాలుగా విభజించారు. మొదటి అష్రాలో 10 రోజులు ఉంటాయి. ఇవి రహ్మత్ లేదా దయ యొక్క రోజులు. మనమందరం సర్వశక్తిమంతుడైన అల్లాహ్  నుండి దయ కోరుకుంటాము. పవిత్ర ఖురాన్ చదవడం ప్రధాన పని. 2వ అష్రా మగ్‌ఫిరత్ లేదా క్షమాపణ, ఇందులో 10 రోజులు కూడా ఉంటాయి, ఇందులో మనం సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నుండి మన పాపాలను క్షమించమని అడుగుతాము. 3వ అష్రా నజాత్ లేదా నరకం నుండి రక్షణ 9 లేదా 10 రోజులను కలిగి ఉంటుంది. ఈ రోజుల్లో మేము  రాత్రిపూట నిద్రలేచి, పవిత్ర ఖురాన్ చదవడం ద్వారా, ఇషా ప్రార్థన తర్వాత సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌కు తహజ్జుద్ సమర్పించడం ద్వారా మన సర్వశక్తిమంతుడైన అల్లాను ఆరాధిస్తాము. 2 నుండి 8 రకాతులుగా ఉంటుంది. 3 రకాతుల విత్ర్ తో కలిపి 11 లేదా ఎక్కువగా కూడా ఉంటుంది. దీనిని  "రాత్రి ప్రార్థన" అని కూడా అంటారు. 

లైలతుల్ ఖద్ర్ 
 ప్రవక్త ముహమ్మద్ (స) వారిపై  సర్వశక్తిమంతుడైన అల్లాహ్  తరపున  జిబ్రయీల్ (అ) ద్వారా మొదటిసారిగా  ఖురాన్ గ్రంథం  అవతరింపబడిన రాత్రి. మేము దీనిని చరిత్రలో అత్యంత ముఖ్యమైన సంఘటనగా పరిగణిస్తాము మరియు ఖురాన్, ఈ  రాత్రి వెయ్యి నెలల కంటే గొప్పదని చెబుతుంది (97:3), మరియు ఈ రాత్రి ధైవదూతలు భూమికి దిగుతారు . ఈ  రాత్రి చివరి దశకంలో - ముఖ్యంగా  21, 23, 25, 27 లేదా 29న ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 

రమజాన్  చివరి దశకంలో ముస్లింలు ఏం చేయాలి?
రాత్రి ప్రార్థనలు (కియామ్, రాత్రి ప్రార్థన)
ప్రార్థనలు చేయడం (దువా)
ఎతికాఫ్ / ఆరాధన  నిమిత్తం ప్రాపంచిక సుఖాలను త్యజించడం.
ఖురాన్ చదవడం.
రాత్రుల్లో చిన్నా పెద్దా శుభకార్యాలు.

ఆ తర్వాత  ఈద్ వస్తుంది. ఈ రోజు పిల్లలు, పెద్దలు మరియు వృద్ధులు కలిసి ఈద్ జరుపుకుంటారు మరియు పిల్లలకు ఈదీ  ఇస్తారు. ఈద్ రోజున రుచికరమైన వంటకాలు  తయారుచేస్తారు. మసీదులో ప్రార్థనలు చేసిన తర్వాత మేము బంధువుల, స్నేహితుల,  ఇష్టులైన ఇరుగుపొరుగు వారి  ఇళ్లకు వెళతాము. ఈద్‌లో చాలా ఆనందం ఉంటుంది.  మేము మా ప్రతి బంధువుల ఇంటికి వెళ్లి అభినందనలు మరియు ఈద్ శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఈద్ రోజున, ముస్లిం కుటుంబాలే కాకుండా, ఇతర మతాల వారు కూడా మా  ఈద్‌ సంబరాలలో పాల్గొంటారు.


Saturday, March 19, 2022

హింసను మానుకోవాలి అహింసకు పూనుకోవాలి /Violence must be avoided and non-v...



మీరు ప్రపంచంలో చూడాలనుకునే మార్పు, ముంది మీ నుండి మొదలవ్వాలి.
నేటి నీ చేతలు రేపటి నీ భవిష్యత్తుని నిర్ణయిస్తాయి
మీరు చేసే పనికి ఫలితమేమిటో మీకు ముందుగా తెలియకపోవచ్చు, కానీ మీరు ఏమీ చేయకపోతే, ఫలితాలు ఎప్పటికీ చూడలేరు.
మీరు మానవత్వంపై విశ్వాసం కోల్పోకూడదు. మానవత్వం ఒక మహాసముద్రం; సముద్రం లోని కొన్ని చుక్కలు కలుషితమైనంత మాత్రాన, సముద్రం కలుషితమైపోదు.
మీ మాటలు ఎల్లప్పుడు ఉన్నతంగా ఉండాలి. ఎందుకంటే మీ మాటలు మీ చేతల్లో ప్రతిబింబిస్తాయి.
నా అనుమతి లేకుండా ఎవరూ నన్ను బాధించలేరు.
మనిషి ఆశలు తీరడానికి భూవిపై దారి ఉందేమో కానీ, దురాశకు తీరడానికి దారి లేదు/ఉండదు…
శారీరక సామర్థ్యం నుండి బలం రాదు. అది లొంగని సంకల్పం నుండి వస్తుంది.
నిన్న. రేపు . జీవితంలో మన చేతిలో లేనివి, మనం మార్చలేని రెండు రోజులు.
మీ ఆలోచనలు ఎల్లప్పుడు ఉన్నతంగా ఉండాలి. ఎందుకంటే మీ ఆలోచనలు మీ మాటల్లో ప్రతిబింబిస్తాయి.
మీరు ధైర్యంగా ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరూ భయ పెట్టలేరు
బలహీనులు ఎప్పటికీ క్షమించలేరు. క్షమ అనేది బలవంతుల లక్షణం.
ప్రేమ, అధికార వాంఛను అధిగమించిన రోజున, ప్రపంచానికి శాంతి తెలుస్తుంది.
మీలో బలహీనత భయాన్ని పెంచుతుంది. ఆ భయం మీలో మీకే తెలియని అపనమ్మకాన్ని పెంచుతుంది.
మొదట వారు మిమ్మల్ని విస్మరిస్తారు, తరువాత మిమ్మల్ని చూసి నవ్వుతారు, తరువాత వారు మీతో పోరాడుతారు, చివరిగా మీరు గెలుస్తారు.
మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి గల ఉత్తమ మార్గం, ఇతరుల సేవలో మిమ్మల్ని మీరు కోల్పోవడం
అపజయాలు తప్పులు కావు, అవి విజాయానికి పాఠాలు.
కష్టాలు అనుభవించాక వచ్చే విజయాలు ఎంతో తృప్తినిస్తాయి.
విజయాన్ని చూసి మురిసిపోవద్దు, అది తొలి అడుగు మాత్రమే, గమ్యం కాదు.
నీ విజయానికి అడ్డుపడేది, నీలోని ప్రతికూల ఆలోచనలే. క్రింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో  ఎప్పటికీ విజయం సాధించలేవు.
కిందపడ్డా ప్రయత్నం కొనసాగిస్తే విజయం నీ సొంతమౌతుంది.
అభ్యాసం సృజనాత్మకతను ఇస్తుంది, సృజనాత్మకత ఆలోచనకు దారితీస్తుంది, ఆలోచన జ్ఞానాన్ని అందిస్తుంది, జ్ఞానం మిమ్మల్ని గొప్పగా చేస్తుంది.
మీ లక్ష్యాన్ని విజయవంతం చేయడానికి, మీ లక్ష్యం పట్ల మీకు ఒకే మనస్సు గల భక్తి ఉండాలి.
విజయవంతమైన కథలు చదవడం వలన, మీకు సందేశం మాత్రమే వస్తుంది. ఒకసారి వైఫల్యమైన కథలను చదివి చూడండి, విజయం సాధించడానికి మీకు గొప్ప స్ఫూర్తి లభిస్తుంది.
జీవితంలో ఎన్ని హెచ్చు తగ్గులు వచ్చినా, మీ ఆలోచనలే మీ మూలధనంగా ముందుకు సాగాలి.


విద్యావేత్తలు, విద్యార్థులలో విచారణ, సృజనాత్మకత, వ్యవస్థాపక మరియు నైతిక నాయకత్వ స్ఫూర్తిని పెంపొందేలా ప్రోత్సహించి వారికి ఆదర్శంగా నిలవాలి.

మీ మొదటి విజయం తర్వాత విశ్రాంతి తీసుకోకండి.  ఎందుకంటే,  మీరు రెండవ సారి విఫలమైతే, మీ మొదటి విజయం కేవలం అదృష్టం అని హేళన చేయడానికి ఎన్నో పెదవులు వేచి చూస్తుంటాయి.

మీ కల నిజం కావాలంటే ముందు మీరు ఉన్నతమైన కలగనాలి. దానికై శ్రమించాలి.

మీరు నిద్రలో చూసేది కాదు కల అంటే. మిమ్మల్ని నిద్రపోకుండా చేసేది కల.

జీవితంలో గొప్ప విజయాలు పొందాలంటే ఇబ్బందులు పడక తప్పదు.

గొప్ప గొప్ప మేధావులును చూడాలంటే, ఒకసారి తరగతి గదిలోని చివరి వరసలో వెతికి చూడు…

మీరు సూర్యుడిలా ప్రకాశించాలనుకుంటే, ముందు అంతటి వేడిని మీలో నింపుకోవాలి.

కింద పాకుతూ ఎంతకాలం బ్రతుకుతారు. మీకున్న రెక్కలతో పైకి లేచే ప్రయత్నం చేయండి.

ప్రతి బాధ ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. ప్రతి పాఠం ఒక వ్యక్తిని మారుస్తుంది.

మీరు చేసే తప్పులే మీకు ఉత్తమ గురువులు. అవి నేర్పే పాఠాలే మీరు నేర్చుకోవలసిన జీవిత పాఠాలు.

ఒకరిని ఓడించడం చాలా సులభం, కానీ ఒకరి మనసు గెలవడం చాలా కష్టం.

కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతావు. అధికంగా మాట్లాడితే ప్రశాంతతని కోల్పోతావు. అనవసరంగా మాట్లాడితే అర్ధాన్ని కోల్పోతావు. అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతావు. అబద్ధాలను మాట్లాడితే పేరును కోల్పోతావు. ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తావు.
మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతీ ఆశయాన్ని స్వీకరించండి. బలహీన పరిచే ప్రతీ ఆలోచనను తిరస్కరించండి.
మనిషి ఉన్నతుడా కదా అన్నది అతడి విజయాల్ని బట్టి కాదు, ప్రవర్తనను బట్టి అంచనా వేయాలి.

వినయం లేని విద్యా, సుగుణం లేని రూపం, ఉపయోగం కాని ధనం, శౌర్యం లేని ఆయుధం, ఆకలిలేని భోజనం, పరోపకారం చేయని జీవితం వ్యర్ధం.
ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తుంది. ఒక్క క్షణం అసహనం జీవితాన్నే నాశనం చేస్తుంది. 

Thursday, March 17, 2022

అనురాగాన్ని పెంచుదాం! అనుమానాన్ని త్రుంచుదాం!!

అనురాగాన్ని  పెంచుదాం!  అనుమానాన్ని త్రుంచుదాం!!


కనువిప్పు కలిగించే ఓ పిట్ట కథ 

అనగనగా ఓ రాజుగారు ఉండేవారు. ఆయన అద్భుతమైన, అందమైన కోటలెన్నింటిలో నిర్మించాడు. కానీ ఎందుకనో ఆయనకు తనివి తీరలేదు. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఓ చిత్రమైన మహలుని నిర్మించాలనుకున్నాడు. శిల్పులందరూ వచ్చి తలా ఓ నమూనాను చూపించారు కానీ ఏవీ రాజుగారికి నచ్చలేదు. చివరికి ఓ శిల్పి చూపించిన అద్దాలగది నమూనా ఆయనకు నచ్చింది. పని కానియ్యమన్నాడు.



శిల్పి చూపించిన అద్దాల గది, అలాంటి ఇలాంటి గది కాదు. ఆ గదిలోకి ఎవరన్నా ప్రవేశిస్తే వారిని ప్రతిబింబించేలా గదిలో అన్నివైపులా అద్దాలే! గది పైకప్పు, కింద గచ్చు కూడా అద్దాలతోనే తయారుచేశాడు. కంట్లో నలుసు కూడా కనిపించేంత స్పష్టంగా ఉన్నాయా అద్దాలు. లోపలికి ప్రవేశించిన మనిషికి తాను ఎక్కడ నిల్చున్నాడో కూడా తెలియనంతగా నలుదిశలా కమ్ముకుని ఉన్నాయి ఆ అద్దాలు. అంతేకాదు! ఆ అద్దాల గదిలోని శబ్దాలు కూడా ఎంతో స్పష్టంగా ప్రతిధ్వనించేవి. రాజుగారు నిర్మించిన ఈ కొత్త మహలు గురించి రాజ్యమంతా తెలిసిపోయింది. అందులోకి తొంగిచూసే అదృష్టం తమకి ఎప్పుడు వస్తుందా అని ప్రజలు తెగ ఎదురుచూడసాగారు.

ఓ రాత్రి అనుకోకుండా రాజుగారి కుక్క అందులోకి ప్రవేశించింది. లోపలికి అడుగుపెట్టగానే దానికి మతి పోయింది. తనలాంటి వందలాది కుక్కలు తనని చుట్టుముట్టి ఉన్నాయి. ఈ మహలులో రాజుగారి చెంతన ఉండే అర్హత తన ఒక్కదానికే ఉందనుకుందది. ఆ కుక్కలను భయపెట్టడానికి ఒక్కసారిగా తన వాడి పళ్లను చూపించింది. చిత్రం! అవి కూడా అలాగే తనని భయపెట్టేందుకు కోరలు చూపించాయి. యుద్ధానికి సిద్ధం అన్నట్లుగా ఒక్కసారి గట్టిగా మొరిగింది కుక్క! దానికి నాలుగువైపుల నుంచీ భీకరంగా శబ్దాలు ప్రతిధ్వనించాయి. ఇక తన చుట్టూ ఉన్న కుక్కలతో పోరాటం చేయక తప్పలేదు. గాల్లోకి ఎగిరెగిరి పడుతూ, లేని శత్రువులను ఉన్నారనుకుని అద్దాల మీద పడుతూ నానా భీభత్సం సృష్టించింది.

ఉదయాన్నే అద్దాల గదిలోకి వచ్చిన భటులకి ఆ కుక్క నిర్జీవంగా కనిపించింది. రాత్రంతా తన ప్రతిబింబాలతో పోరాటం చేసిన ఆ కుక్క ఓడిపోయింది. మన మనసు కూడా అద్దాల గదిలాంటిదే! భయాలు నిజమవకుండానే వాటితో తలపడుతూ ఉంటాము. లేనిపోని అనుమానాలతో మనమీద మనమే పోరాటం చేస్తూ ఉంటాము! కానీ అందులో గెలుపుకి అవకాశం లేదు. ఉండేదల్లా ఓటమే!

అనురాగ గోపురాన్ని కాపాడే కొన్ని సూత్రాలు 
వివాహ బంధం బలంగా ఉండాలంటే అనురాగం చూపించుకోవడం తప్పనిసరి. మనం బలంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం, నీళ్లు క్రమంగా తీసుకోవడం ఎంత ప్రాముఖ్యమో, వివాహ బంధాన్ని పోషించి బలపర్చుకోవడానికి క్రమంగా అనురాగం చూపించుకోవడం కూడా అంతే ప్రాముఖ్యం. పెళ్లయి దశాబ్దాలు గడిచినా, వివాహ భాగస్వామికి తనమీద ఎంతో ప్రేమ, శ్రద్ధ ఉన్నాయనే భరోసా భార్యకు/భర్తకు అవసరం.

నిజమైన ప్రేమలో స్వార్థం ఉండదు. నిజమైన ప్రేమ ఎదుటివ్యక్తి సంతోషాన్ని కోరుకుంటుంది. సాధారణంగా, భర్తల కన్నా భార్యలు ఎక్కువగా అనురాగాన్ని కోరుకుంటారు. భర్తకు భార్య మీద చాలా ప్రేమ ఉండవచ్చు. కానీ ఆ ప్రేమను కేవలం ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, లేదా లైంగిక సంబంధానికి ముందు మాత్రమే చూపిస్తే, అసలు తన భర్తకు నిజంగా తనమీద శ్రద్ధ ఉందా అనే అనుమానం భార్యకు రావచ్చు. కాబట్టి ప్రతీరోజు వీలైనప్పుడల్లా అనురాగం చూపిస్తూ ఉండడం మంచిది. 

మాటల్లో అనురాగం చూపించండి. “ఐ లవ్‌ యు,” “నువ్వు నాకు దొరికిన వరం” లాంటి చిన్నచిన్న మాటలు కూడా మీకు తనంటే ఎంత ఇష్టమో మీ భార్యకు చూపిస్తాయి.  “హృదయం నిండా ఏముంటే నోరు అదే మాట్లాడుతుంది.”​ ఓ ప్రాచీన నానుడి. మీ అనురాగాన్ని మాటలకే పరిమితం చేయాల్సిన అవసరం లేదు. మీరు తనను ఎంతగా ప్రేమిస్తున్నారో రాసి చెప్పండి, లేదా ఈ-మెయిల్‌, మెసేజ్‌ పంపండి.

 చేతల్లో అనురాగం చూపించండి. కౌగిలించుకోవడం, గిల్లికజ్జాలాడటం , లేదా ఊరికే చేతులు పట్టుకోవడం లాంటివి మీరు నిజంగా తనను ప్రేమిస్తున్నారు కాబట్టే “ఐ లవ్‌ యు” చెప్పారని మీ భార్యకు తెలియజేస్తాయి. మృదువుగా తాకడం, ప్రేమతో చూడడం, అప్పుడప్పుడు బహుమతులు ఇవ్వడం ఇవన్నీ నిజమైన శ్రద్ధ ఉందని చూపిస్తాయి. అంతేకాదు, తనకు సహాయం చేయడానికి మీరు బ్యాగులు మోయడం, తలుపు తీసి ఉంచడం, గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం, లేదా వంట చేయడం లాంటివి కూడా చేయవచ్చు. చాలా సందర్భాల్లో, ఈ పనులు చేయడం ద్వారా మీరు తనకు సహాయం చేయడమే కాదు, మీ అనురాగాన్ని చేతల్లో చూపిస్తారు! అంటే 
మనం మన ప్రేమను మాటల్లో మాత్రమే కాదు చేతల్లో చూపించాలి.పెళ్లికాక ముందు పరిచయమైన కొత్తలో తనమీద ఎంత శ్రద్ధ చూపించేవాళ్లో ఇప్పుడూ అంతే శ్రద్ధ చూపించడానికి ప్రయత్నించండి.  

మీ భర్త/భార్య కోసం సమయం కేటాయించండి. మీరిద్దరు కలిసి సమయం గడపడం వల్ల మీ వివాహ బంధం బలపడుతుంది, అంతేకాదు తనతో సమయం గడపడం మీకు ఇష్టమని మీ భర్తకు/భార్యకు తెలుస్తుంది. నిజమే, మీకు పిల్లలుంటే లేదా ప్రతీరోజు చాలా విషయాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటే, మీరిద్దరు కలిసి ఎక్కువ సమయం గడపలేకపోవచ్చు. అలాంటప్పుడు కేవలం మీరిద్దరు కలిసి కాసేపు వాకింగ్‌ చేసేలా ఏర్పాటు చేసుకున్నా మంచిదే.

మీ భర్త/భార్య అవసరాలు తెలుసుకోండి. అనురాగం కోరుకునే విషయంలో ఒక్కో వ్యక్తి అవసరాలు ఒక్కోలా ఉంటాయి. మీరు తనమీద ఎలా అనురాగం చూపించాలని మీ వివాహజత కోరుకుంటున్నారో, మీరు ఇంకా ఎక్కువ అనురాగం చూపించాల్సిన అవసరం ఉందేమో ఒకరితో ఒకరు మాట్లాడి తెలుసుకోండి. తర్వాత, తను కోరినట్టు చేయడానికి కృషిచేయండి. వివాహ బంధం బలంగా ఉండాలంటే అనురాగం చూపించడం తప్పనిసరి అని గుర్తుంచుకోండి. మీ వివాహజతను మీ మీద అనురాగం చూపించమని అడిగే బదులు, ‘నా భర్త/భార్య నా మీద ఇంకా ఎక్కువ అనురాగం చూపించాలంటే నేనేం చేయాలి?’ అని ఆలోచించండి.


ఆలుమగల అనురాగ గోపురానికి గొడ్డలిపెట్టు అనుమానం

విశ్వాసులారా! మితిమీరిన అనుమానాలకు పోకండి. కొన్ని అనుమానాలు (మీకు) పాపాలుగా పరిణమించవచ్చు. (ప్రజల) రహస్య విషయాల వెనుక పడకండి. మీలో ఎవరూ ఇతరుల్ని పరోక్షంగా నిందించకూడదు. మీలో ఎవరైనా మీ మృతసోదరుని మాంసం తినడానికి ఇష్టపడతారా? (ఇష్టపడరు.) చూశారా, మీరే దాన్ని అసహ్యించు కుంటారు. దేవునికి భయపడండి. దేవుడు ఎంతో క్షమాశీలి, దయామయుడు. (హుజురాత్ - 12)

ప్రతీ మనిషికి అనుమానం కలగడం సహజం . "అనుమానం పెనుభూతం ". అనుమానం వున్న మనిషి ఏ  ప్రయత్నము చేయలేడు ,విజయాన్ని సాధించలేడు ,అన్యాయాన్ని ఎదుర్కోలేడు.అనుమానం నివారణ చేసుకోవడం ముఖ్యం .లేకపోతే మనిషి అనుమానంతో కృంగి ,కృశించి చివరకు అంతమౌతాడు .



కొందరికి ప్రతీది అనుమానించడం పుట్టుకతోనే వస్తుంది .పెద్దలన్నారు "పుట్టుకతో వచ్చింది పుడకలతో పోతుందా " అని .ఇలాంటివారు భార్యా పిల్లలను ,బంధువులను ,స్నేహితులను ,సమాజాన్ని అనుమానిస్తూవుంటారు . అదే మనకు అందరిలో మంచిని చూడడం  అలవాటైతే, ప్రపంచంలో మన  అంత బలవంతులు  ఇంకొకరు ఉండరు.

అనుమానం రెండు విధాలు. 1) వూహాజనితమైన అనుమానం .  2)నిర్ధారణతో కలిగే అనుమానం .

1) వూహాజనితమైన అనుమానం -మనసులో మనిషి ఊహించుకొని ,తన ఊహలు ఆధార మైనా , నిరాధారమైనవా చూడడు .ఇది కలగగానే అనుమానించడం మొదలుపెడతాడు .ఎవరైనా అతనికి ఆధారాలతో చెబితే అప్పుడు అనుమానం పటాపంచలై సాధారణ వ్యక్తి అవుతాడు .

 2) నిర్ధారణలతో కలిగే అనుమానం -మనిషి తాను    మార్గంలో వెళుతున్నప్పుడు   క్రూర   జంతువులు ,దొంగలు ఆ మార్గంలో వున్నాయని ఇతరులతో  తెలుసుకొని తాను  గమ్యం చేరలేనని నిర్ధారణతో అనుమానిస్తాడు .                

 మనోవ్యాధికి మందు లేనట్టే మనిషి ఆలోచనలు సరైనవి కావని చెప్పినా వినరు చూశారూ, వారు మనోవ్యాధితో భాదపడుతన్నట్టు లెక్క  . ఈ పిచ్చి ఎంతగా ముదురుతుందంటే ... ఉన్నావా, అసలున్నావా? అని దైవాన్నే అనుమానిస్తాడు మనిషి.     

ఆలుమగలు కలతలు లేకుండా కలకాలం కలిసుండాలంటే ఒకరిపై ఒకరికి నమ్మకం అవసరం. నేటి కాలంలో చిన్న కారణానికే దంపతులు పరస్పరం విశ్వాసం కోల్పొయి దారుణాలకు తెగబడుతున్నారు. ప్రేమ అంటే  మళ్ళి మళ్ళి కావాలనిపించేదిగా ఉండాలి కాని అనుమానం అనే భూతంలో మన ప్రేమ నలిగిపోయి మానవ బంధాల మీదే విరక్తి వచ్చేదిగా మిగిలి పోకూడదు.

కొందరికి కొంత కాలం తర్వాత తమ  మీద తమకే అనుమానం పెరిగి అది తాము పెంచుకున్న మొక్కలను నరుక్కునే స్థితికి తీసుకు వెళ్ళేంత వరకు వస్తుంది ... ఈ అనుమానం భూతానికి ఆడ మగ తేడా లేదు ఎవరినైనా ఆవహిస్తుంది కాస్త చోటు ఇస్తే చాలు అల్లుకుపోతుంది... దాన్ని వదిలించు కోవడం చాలా కష్టం ... ఎంత చదువుకున్న వాళ్ళయినా దీనికి దాసోహమై పోతున్నారు... ఎన్ని వసంతాలు కలసి బ్రతికిన భార్యా భర్తలలో సయితం  చిన్న అనుమానం చాలు ఆ బంధం విచ్చిన్నమై పోవడానికి.... కలసి  పంచుకున్న సంతోషాలు కాని బాధలు కాని మర్చిపోయి తెగతెంపుల వరకు వచ్చేస్తున్న బంధాలు ఎన్నో.. ఎన్నెన్నో!

దాంపత్య జీవితం   - - అది నమ్మకం అనే బీజంతో ఎదిగే మహా వృక్షం. దాంపత్య జీవితం - అది కేవలం అనుమానం అన్న విష వైరస్‌తో పుటుక్కుమని తెగిపోయే పచ్చి దారం.  కాబట్టి ఆలుమగలు తాము, కట్టుకునే అనురాగ గోపురంలో  విష వాయువులు ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే రాను రాను అవి పెనుభూతాలుగా మారి ఏకంగా ఇద్దరి జీవితాల్ని మింగేసే ప్రమాదముంది. భార్యాభర్తల మధ్య అన్యోన్నత, అనురాగం మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లాలంటే వారు షరీయతు సూచించిన హద్దులను గౌరవిస్తూ ఎవరి పరిమితుల్లో వారుండాలి. ఒకవైపు వేరుగా బ్రతకలేము అని చెబుతూనే భార్య మీద భర్త, భర్త మీద భార్య ఫిర్యాదు చేస్తూ తిరగటం నిరర్థకం, నిర్హేతుకం. ఒకరిలో ఉన్న లోపాలను ఇంకొకరు పెద్ద మనస్సుతో మన్నించాలి. ఏదేని విషయంలో మనిషి తీవ్ర సందిగ్ధానికి లోనైనప్పుడు ఖుర్‌ఆన్‌ వచనాల, ప్రవక్త (స) వారి ప్రవచనాల వెలుగులో పరిష్కారం చూపే పండితులను, వివేచనాపరులను,  స్థితప్రజ్ఞులను సంప్రదించటం ఎంతో ఉత్తమం. ఆ మేరకు ఉపయోగపడే దైవ ప్రవక్త (స) వారి రెండు ప్రవచనాలను ఇక్కడ పొందుపరుస్తున్నాము. 

ఓ పల్లెటూరి వ్యక్తి దైవ పవ్రక్త (స) వారి సన్నిధికి వచ్చి - ''యా రసూలల్లాహ్‌! నేను తెల్లన, నా భార్య తెల్లన. కాని మాకిద్దరికి పుట్టిన పిల్లాడు నల్లన'' అని భార్య మీద తనకున్న అనుమానాన్ని వ్యక్తపర్చాడు. అది విన్న ఆదర్శ పవ్రక్త (స) ''రెండు ఎరన్రి ఒంటెలకు బూడిద రంగు ఒంటె పుట్టడం నీవు గమనించి ఉంటావు కదా! అది ఎలా సాధ్యం అయ్యిందంటావు?'' అని ఎదురు పశ్న్ర వేశారు. అందుకా వ్యక్తి ''బహుశా వాటి తాతముత్తాతలలో ఎవరి పోలికయినా వచ్చి ఉంటుంద''ని సమాధానమిచ్చాడు. ''అదే విధంగా నీ కొడుక్కి కూడా నీ వంశస్థుల్లోని ఎవరి రంగయినా వచ్చి ఉంటుంది'' అని దైవ పవ్రక్త (స) సెలవిచ్చారు. (ముస్లిం)

   హజత్ర్‌ ఆయిషా (ర) కథనం - ఒక రోజు దైవ పవ్రక్త (స) సంతోషాతిశయంతో నా దగ్గరకు వచ్చారు. ఆయన ముఖారవిందం పక్రాశిస్తూ ఉంది. నన్నుద్దేశ్యించి ఆయన ఇలా అన్నారు: ''నీకు తెలుసా! ముజజ్జిజ్‌ ముద్‌లజీ ఇప్పుడే జైద్‌ బిన్‌ హారిసా మరియు ఉసామా (ర)ను చూసి ''ఈ కాళ్ళు పరస్పరం పోలికలు గలవి'' అని అన్నారు (బుఖారీ, ముస్లిం) 

  అంటే - ఆ సమయంలో వారిరువురి ముఖాలపై దుప్పటి ఉంది. పాదాలు మాత్రం కన్పిస్తున్నాయి. కేవలం పాదాలు చూసి ముఖ సాముద్రిక విద్యలో నిష్ణాతుడైన ముద్లిజ్‌ తెగకు చెందిన ముజజ్జిజ్‌ నిదురిస్తున్న వారిద్దరూ ఒకే  వంశ వృక్షానికి చెందినవారని చెప్పడం మహా ప్రవక్త (స) వారికి ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే అప్పటికే ఉసామా బిన్‌ జైద్‌ (ర) నలుపు రంగుపై కొంత మంది చెవులు కోసుకుంటున్నారు. ఉసామా గారి తండ్రి జైద్‌ బిన్‌ హారిసా (ర) తెల్లగా ఉండటం వారి సంశయానికి అసలు కారణం. ప్రస్తుతం రక్త పరీక్ష  వల్ల ఈ పని సులువైపోయినప్పటికీ ఆ సౌకర్యం లేని, దాని గురించి తెలియని ప్రదేశాల్లో నివసించే ప్రజలకు ఇందులో అనేక నిదర్శనాలున్నాయి.     

అనుమాన రహితులే ,ప్రపంచంలో కృషి చేసి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు ,మహనీయులవుతారు , మహాత్ములౌతారు.  కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కాస్త అహాలను వీడి అనుమానాలను వదలి అపార్ధాలు మరచి కొద్దిగా అనుకూలంగా మెలిగితే ఎన్నో బంధాలు విడాకుల పాలు కాకుండా ఉంటాయి ... ఇద్దరిలో ఎవరికైనా కావాల్సింది కాస్త ఓదార్పు ... మరికాస్త నమ్మకం... నమ్మకం లేని చోట ప్రేమ అస్సలు ఉండదు... ఉందని అనుకుంటే అది పొరబాటే అవుతుంది... ప్రేమ ఉందని చెప్పినా అది నటనే... ఇన్నాళ్ళ కాపురం తరువాత నటన ఎంత వరకు అవసరమో ఒక్కసారి ఆలోచించుకుంటే ఏ ఒక్కరైనా మీతో పాటు నడిచే మీ భార్య/భర్త తో పాటు పిల్లలు కూడా అదృష్టవంతులు అవుతారు....  నమ్మకం లో నుండి వచ్చే ప్రేమ శాశ్వతం... అనుమానంలో పుట్టిన ప్రేమ అబద్దం.... మరి ఈ అనుమాన భూతానికి పరిష్కారం ఏంటో ఎవరికి వారు ఆత్మ సమీక్ష చేసుకోవాలి.

విశ్వాసులారా! పురుషులు తోటిపురుషుల్ని హేళన చేయకూడదు. వీరికంటే వారే మంచివారై ఉండవచ్చు. అలాగే స్త్రీలు తోటిస్త్రీలను గేలి చేయకూడదు. వీరికంటే వారే మంచివారై ఉండవచ్చు. మీరు ఒకరి తప్పులు మరొకరు ఎత్తిచూపుకుంటూ పరస్పరం బురద చల్లుకోకండి. తప్పుడు పేర్లతో పిలుచుకోకండి. విశ్వాసభాగ్యం పొందిన తర్వాత చెడ్డపేరు తెచ్చుకోవడం చాలా తప్పు. ఈ వైఖరి మానుకోని వారే దుర్మార్గులు.  (హుజురాత్ -11) 


కనువిప్పు కలిగించే ఓ పిట్ట కథ 

అనగనగా ఓ రాజుగారు ఉండేవారు. ఆయన అద్భుతమైన, అందమైన కోటలెన్నింటిలో నిర్మించాడు. కానీ ఎందుకనో ఆయనకు తనివి తీరలేదు. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఓ చిత్రమైన మహలుని నిర్మించాలనుకున్నాడు. శిల్పులందరూ వచ్చి తలా ఓ నమూనాను చూపించారు కానీ ఏవీ రాజుగారికి నచ్చలేదు. చివరికి ఓ శిల్పి చూపించిన అద్దాలగది నమూనా ఆయనకు నచ్చింది. పని కానియ్యమన్నాడు.

శిల్పి చూపించిన అద్దాల గది, అలాంటి ఇలాంటి గది కాదు. ఆ గదిలోకి ఎవరన్నా ప్రవేశిస్తే వారిని ప్రతిబింబించేలా గదిలో అన్నివైపులా అద్దాలే! గది పైకప్పు, కింద గచ్చు కూడా అద్దాలతోనే తయారుచేశాడు. కంట్లో నలుసు కూడా కనిపించేంత స్పష్టంగా ఉన్నాయా అద్దాలు. లోపలికి ప్రవేశించిన మనిషికి తాను ఎక్కడ నిల్చున్నాడో కూడా తెలియనంతగా నలుదిశలా కమ్ముకుని ఉన్నాయి ఆ అద్దాలు. అంతేకాదు! ఆ అద్దాల గదిలోని శబ్దాలు కూడా ఎంతో స్పష్టంగా ప్రతిధ్వనించేవి. రాజుగారు నిర్మించిన ఈ కొత్త మహలు గురించి రాజ్యమంతా తెలిసిపోయింది. అందులోకి తొంగిచూసే అదృష్టం తమకి ఎప్పుడు వస్తుందా అని ప్రజలు తెగ ఎదురుచూడసాగారు.

ఓ రాత్రి అనుకోకుండా రాజుగారి కుక్క అందులోకి ప్రవేశించింది. లోపలికి అడుగుపెట్టగానే దానికి మతి పోయింది. తనలాంటి వందలాది కుక్కలు తనని చుట్టుముట్టి ఉన్నాయి. ఈ మహలులో రాజుగారి చెంతన ఉండే అర్హత తన ఒక్కదానికే ఉందనుకుందది. ఆ కుక్కలను భయపెట్టడానికి ఒక్కసారిగా తన వాడి పళ్లను చూపించింది. చిత్రం! అవి కూడా అలాగే తనని భయపెట్టేందుకు కోరలు చూపించాయి. యుద్ధానికి సిద్ధం అన్నట్లుగా ఒక్కసారి గట్టిగా మొరిగింది కుక్క! దానికి నాలుగువైపుల నుంచీ భీకరంగా శబ్దాలు ప్రతిధ్వనించాయి. ఇక తన చుట్టూ ఉన్న కుక్కలతో పోరాటం చేయక తప్పలేదు. గాల్లోకి ఎగిరెగిరి పడుతూ, లేని శత్రువులను ఉన్నారనుకుని అద్దాల మీద పడుతూ నానా భీభత్సం సృష్టించింది.

ఉదయాన్నే అద్దాల గదిలోకి వచ్చిన భటులకి ఆ కుక్క నిర్జీవంగా కనిపించింది. రాత్రంతా తన ప్రతిబింబాలతో పోరాటం చేసిన ఆ కుక్క ఓడిపోయింది. మన మనసు కూడా అద్దాల గదిలాంటిదే! భయాలు నిజమవకుండానే వాటితో తలపడుతూ ఉంటాము. లేనిపోని అనుమానాలతో మనమీద మనమే పోరాటం చేస్తూ ఉంటాము! కానీ అందులో గెలుపుకి అవకాశం లేదు. ఉండేదల్లా ఓటమే!

 

 

 

   

Monday, March 14, 2022

చేసిన నిర్వాకం చాలు

- శాంతి ప్రియ



సభ్యత గొంతు నొక్కేసి 
సంస్కార ఊపిరి ఆపేసి 
మానం ఉరి తీసేసి 
మర్యాద మంట గలిపేసి 
చేసిన నిర్వాకం చాలు - నీవు చేసిన నిర్వాకం చాలు

విశృంఖల  విష సంస్కృతి పెంచేసి 
పాశ్చాత్య ఫ్యాషన్ ముసుగేసి 
అందాల పోటీలో వివస్త్రను చేసి 
అతివలు అభిమానం అమ్మేసి 
ప్రజ్ఞ ప్రక్కనబెట్టి అందం అర్హతగా చేసి 
సిగ్గూ సిరిని వదిలేసి 
లజ్ఞా మానం తగలేసి 
చేసిన నిర్వాకం చాలు -నీవు చేసిన నిర్వాకం చాలు

ధనస్వామ్యాన్ని జన సామాన్యంపై నెట్టేసి
అపవిత్ర ప్రవృత్తికి నాంది వేసి 
ధనాన్ని దైవంగా చేసి 
కూలి బ్రతుకుల్ని కూల్చేసి 
కూడు గూడు అన్నీ లాగేసి 
నీతి గొంతు నొక్కేసి 
న్యాయం ఊపిరి తీసేసి 
చేసిన నిర్వాకం చాలు -నీవు చేసిన నిర్వాకం చాలు

Tuesday, March 8, 2022

జలం మూలం ఇదం జగత్!

జగతికి జీవం జలమే... జగతికి బలమూ  జలమే .. అందరికీ జీవనాధారం జలమే.   ప్రతి నీటి చుక్క అమృతతుల్యం. మనుషులకే కాదు, పశుపక్ష్యాదులకు, మొక్కలకు జీవకోటి సమస్తానికి నీరు ప్రాణాధారం. అసలు జీవి ఆవిర్భావం జరిగిందే నీటిలో. ఇవాళ భూగ్రహమంతా విస్తరించిన కోట్లాది జీవరాశుల మూలం నీటిలో ఉంది. అందుకే జీవరాశుల (జంతువులు, మొక్కలు) శరీరాల్లో 60 నుండి 65 శాతం నీరే ఉంటుంది. అంతెందుకు, మొత్తం భూమి ఉపరితలాన్ని 71 శాతం నీళ్లే కప్పివేస్తున్నాయి. అంతరిక్షం నుండి చూస్తే నీలి వర్ణంలో కనపడే భూమిని బ్లూ ప్లానెట్‌ (నీలి గ్రహం) అంటారు. భూమి అస్తిత్వం, ప్రాణుల ఉనికి నీరు వలన, నీరు తోటి అని చెప్తే అతిశయోక్తి కాదు.  ఖురాన్ లో ఇలా ఉంది: 
భూమ్యాకాశాలు కలసిఉన్నప్పుడు మేము వాటిని విడదీయడాన్ని వారు చూడ లేదా? అలాగే ప్రతిప్రాణిని మేము నీటితో సృజించిన విషయాన్ని వీరు గమనించ లేదా? మరి వారు (మాయీ సృష్టి చాతుర్యాన్ని) ఎందుకు విశ్వసించరు? (అంబియా - 30)



    నీళ్ళ కోసం డబ్బును నీళ్ళలా ఖర్చు పెట్టినా గొంతు తడవని రోజులు మరెంతో దూరంలో లేవు. నేడు కన్నీటి కష్టాలుగా చెప్పుకోబడుతున్నవన్నీ రేపు నీటి కష్టాలుగా మారతాయి. ఈనాడు 20 రూపాయలకు కొనే లీటర్ వాటర్ కొన్నేండ్ల తర్వాత 200లకు అమ్ముడు పోతుందంటే ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. జలం అనే ఈ మహా ప్రసాదాన్ని కాపాడుకోకపోతే జన జీవనం అస్తవ్యస్థం కావడం ఖాయం! 


 “ధనం మూలం ఇదం జగత్' నేడు సర్వత్రా వినడుతున్న మాట. 'జలం మూలం ఇదం జగత్!' భవిష్యత్తులో వినబడే మాట. భూగర్భ జలాలను యుక్తాయుక్తాలను ఆలోచించకుండా తోడేస్తూ భావి తరాల వారికి నీటి చుక్క దొరకకుండా చేస్తున్నాం. మన దేశంలో 1951 నాటికి ఒక మనిషికి సగటున రోజుకు 14 వేల 180 లీటర్ల భూగర్భ జలం అందుబాటులో ఉండేది. 1991 నాటికి అది సగానికి పడిపోయింది. ప్రస్తుతం పరిస్థితి ఇంకా దిగజారి ఒక మనిషికి కేవలం 5 వేల 120 లీటర్ల భూగర్భ జలం మాత్రమే అందుబాటులో ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే 2025 నాటికి ఒక మనిషికి కేవలం 3వేల 545 లీటర్లు, 2050 నాటికి 3 వేల భూగర్భ జలం మాత్రమే మిగులుతుంది. దీనికి తోడు దేశంలోని రిజర్వా యర్లలోని నీటి నిల్వలు కూడా భారీగా తగ్గుతున్నాయి.

దేశంలో 91 రిజర్వాయర్లలో నీటి నిల్వలు 22 శాతం మేర తగ్గాయి. అటు భూగర్భ జలాలు తగ్గడానికి, ఇటు రిజర్వాయర్లలోని నీటి నిల్వలు తగ్గడానకి కారణం ముమ్మాటికీ మనిషే-మనమే. నీటి సంపద అత్యంత విలువయిన సంపద. దాన్ని కాపాడుకోవాల్సి బాధ్యత మనందరిది. మనిషికి ప్రకృతి ఒనరుల్లో వాయువు తర్వాత నీటి అవసరమే అధికం. నీరు లేకుండా ఏ ప్రాణి బతకజాలదు. 
పరిశుభ్రమైన జలాలను పరిరక్షించు కోవడంలో మనకు ఏమాత్రం శ్రద్ధ ఉండకపోవడం ఎంతో బాధాకరం. ఒక్క మనదేశంలోనే కాదు, ప్రపంచమంతటా రానురాను జీవజలాలు కరువవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జలసంక్షోభం ముంచు కొస్తోందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. నీటిని పొదుపుగా వాడుకోవడం, నీటి వనరులను సంరక్షించుకోవడం, ప్రకృతిని, పచ్చదనాన్ని, పర్యావరణాన్ని కాపాడుకోవడం వంటివన్నీ కేవలం నినాదప్రాయంగానే మిగులుతున్నాయి. అందులోనూ సర్వశక్తి సమన్వితుడైన మానవుడు జలవనరులను కాపాడుకోలేకపోవడమే కాక, వాటిని చేజేతులా విషతుల్యం చేస్తూ, తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్న చందంగా.. ఎంతోకాలంగా తన జీవితయాత్రను అభద్రతగానే సాగిస్తుండడం ఎంతైనా విచారకరం.
ఓ కవి అన్నట్టు - 
గొంతు ఎండిపోయే పేగు మండిపోయే
గంగతల్లి జాడ లేదని
నీటి పైన ఆశే  నీరుగారి పోయే
రాత మారు దారి లేదని
దాహం ఆరుతుందా
పైరు పండుతుందా
ధారాలైన కంటి నీటితో


   ఉన్న మంచినీటిని మనం పొదుపుగా వాడకపోగా కలుషితం కూడా చేస్తున్నాం. ప్రపంచంలో 500కు పైగా మంచినీటి నదులు కలుషితమైపోయాయి. ప్రపంచంలో భారీ యుద్ధాల్లో చనిపోయిన వారి కన్నా, కలుషిత నీటి వల్ల మరణించిన వారే ఎక్కువ. ఏడాదికి 40 లక్షల మంది కలుషిత నీరు తాగి చనిపోతున్నారు. 

ఖురాన్ మనల్ని జాగురూక పరుస్తోంది:   “పోనీ, మీరు త్రాగే మంచి నీరు గురించి ఎన్నడయినా ఆలోచించారా? దాన్ని మేఘాల నుండి మీరు కురిపి స్తున్నారా? లేక దానిని కురిపించేది మేమా? మేమే గనక తలచుకుంటే దానిని చేదు నీరుగా మార్చేయగలం. మరలాంటప్పుడు మీరు కృతజ్ఞతగా ఎందుకు మసలుకోరు”. (దివ్యఖుర్ఆన్- 56: 68-70) 

కృతజ్ఞత అంటే వర ప్రదాతను గుర్తించి, ఆయన చెప్పినట్టు జీవిస్తూ వరాన్ని కాపాడుకోవడమేగా! ఒకవేళ మనం దేవుని మాటను ఖాతరు చెయ్యక ఇష్టారాజ్యంగా బతికితే ఏం జరుగుతుందో కూడా ఖుర్ఆన్ పూస గుచ్చినట్లు చెబుతుంది: “వారిని ఇలా అడుగు: “చూడండి మీరు త్రాగే ఈ నీరు గనక భూమిలో ఇంకిపోతే, మీ కొరకు నీటి ఊటను తెచ్చేదెవరో చెప్పండి!"(అల్ ముల్క్ 30) 


 ‘ఉప్పొంగే నదుల జీవజలాలు.. ఉప్పు సముద్రం పాలు’ అని  ఒక కవి అన్నట్లుగా మంచినీటి వనరులను, జీవ జలాలను సంరక్షించేందుకు మన దేశంలో ఎంతోకాలం నుంచి ఆశించినస్థాయిలో పటిష్టమైన ప్రణాళికలు లేకపోవడంతో వర్షపు నీరంతా వ్యర్ధమైపోతోంది. ఎప్పటికప్పుడు జలవనరు లను సంరక్షించుకోవాలని మనకు మనం అనుకుంటు న్నామే తప్ప, ఆచరణలో ఆ కార్యక్రమాలన్నీ నామ మాత్రంగానే ఉంటున్నాయి. అడవులను సంరక్షించు కోవాలి. మొక్కలను విస్తారంగా నాటుతూ పరిరక్షిం చాలి. వృక్ష సంపదను కాపాడుకోవాలి. జలసంక్షోభం రాకుండా చూసుకోవాలి. ఇవన్నీ ఎంతో బృహత్తరమైన కార్యక్రమాలే. అయినా, రకరకాల పథకాలతో లక్షల కోట్లు ఖర్చుపెడుతున్న ప్రభుత్వాలు అన్నిటికన్నా ముఖ్యమైన జలవనరుల పట్ల నిర్లిప్తంగానే ఉంటుం డడం సముచితం కాదు. 


నీటి కాలుష్యం: 
నదీజలాలను ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవాలి. నీటిని పొదుపు చేసుకోవాలి. విచ్చలవిడి నీటి వాడకాలను అదుపు చేసుకోవాలి. ప్రతి నీటి బొట్టూ ఎంతో విలువైనదని గ్రహించాలి. జల సంరక్షణను కేవలం మాటల్లో కాక అదొక పవిత్రమైన బాధ్యతగా  భావించాలి. అందుకు పాలకులతో పాటు ప్రజలంతా సంసిద్ధమవ్వాలి. . ఊరు వాడా అంతా ఏకమై ఎక్కడికక్కడ జలాలను, జలవనరులను సంరక్షించుకోవాలి. ఆ దిశగా ప్రభుత్వాలు, మేధావులు.. ప్రజలు అందరూ కలసి కదిలితేనే ‘జల సంరక్షణ' సాధ్యమవుతుంది. మన తరానికే కాక, భావితరాలకు కూడా మనం మార్గదర్శకమైనట్లుంటుంది.

ఖుర్ఆన్ స్వర్గాన్ని వర్ణిస్తూ ఇలా అంటుంది: “భయభక్తులు గలవారి కోసం వాగ్దానం చెయ్యబడిన స్వర్ణ విశిష్టత ఇలా ఉంటుంది. దుర్వాసనకు (కాలుష్యానికి) తావు లేని స్వచ్చమయిన నీటి కాలువలు అందులో ఉంటాయి”. (ముహమ్మద్; 15) స్వచ్చమయిన నీరు దేవుని మహదానుగ్రహం అన్న విషయం ఈ ఆయతు ద్వారా మనకు బోధ పడుతుంది. ఈ కారణంగా ప్రవక్త (స) నీటిని కాపాడే పలు సూచనలు చేశారు.

“నిల్వ ఉన్న నీటిలో మూత్ర విసర్జన చెయ్యకూడదు" అని (ముస్లిం) ఓ చోట అంటే, “ప్రవహించే నీటిలో మూత్ర విసర్జన చెయ్యరాదు" అని మరో చోట హెచ్చరించారు. (ముస్లిం) తద్వారా జలం కాలుష్య వాతన పడి ప్రాణ హాని కలిగిస్తుంది గనక. “నీరు లభించని పక్షంలో తయమ్ముమ్ చేసుకోండి. కానీ నీరు దొరికితే స్నానం చెయ్యండి, అందులో శుభం ఉంది" అని ఓ చోట సెలవిస్తే, “నువ్వు ప్రవహించే నది ఒడ్డున ఉన్నా నీటిని వృధా చెయ్యకు" అని వేరోక సందర్భంలో అన్నారు. “దానాల్లోకెల్లా జల దానం మహోత్కృష్టం” అని ఓ సందర్భంలో చెబితే, “మనిషి నిత్యావ సరాలను సాటి మనిషి నుండి ఆపి ఉంచడం దైవ అభిశాపానికి గురి చేస్తుంది" అని వేరొక సందర్భంలో సెలవిచ్చారు.

 “దాహంతో నాలుక పిడచ గడ్డుకు పోయిన ఓ కుక్క దాహాన్ని తీర్చినందుకు పచ్చి వ్యభిచారిణి ని దేవుడు క్షమించి వదిలేశాడని" ఓ సారి చెబితే, 'కనీసం నీళ్ళు కూడా ఇవ్వకుండా ఓ పిల్లిని చంపేసిన పాపాని ఓ భక్తురాలిని శిక్షించాడు' అని వేకసారి తెలియజేశారు. అంతే కాదు మనిషి చేసే జల దానం అతని మరణానంతరం సయితం అతని పుణ్యానిచ్చే సాధనంగా ఉంటుంది అని శుభవార్తను కూడా అందజేశారు: “మనిషి మరణించాక అతని పుణ్యాన్ని చ్చే మార్గాలు ఏడు. 1) తాను నేర్పిన ప్రయోజనకర విద్య. 2) తాను ఏర్ప రచిన ఏరు లేదా కాలువ. 3) తాను త్రవ్వించిన బావి. 4) తాను నాటిన వృక్షం. 5) మస్జిద్ నిర్మాణం. 6) పుస్తక ప్రచురణం. 7) సజ్జన సంతానం". (బైహఖీ) 

ఈ ప్రవచనంలోని ఏడు సాధనాల్లో మూడు పర్వావరణానికి సంబంధించినవయితే, రెండు నీటికి సంబంధించినవి. ఖురఆన్ ప్రకారం జల రహిత స్వర్గాన్ని మనం ఊహించ లేము. “సంచరించే సమస్త ప్రాణులను అల్లాహ్ నీటితో సృజించాడు" (అన్నూర్: 45) అని ఖుర్ఆన్ అంటుంటే, అలాంటి కోటానుకోట్ల ప్రాణులతో నిండిన ప్రపంచం జల రహితంగా ఉండగలదా? 

జలో రక్షితే రక్షితః! 

ప్రవక్త ముహమ్మద్ (స) ఒక గ్లాసు నీళ్ళతో వుజూ చేసేవారు. మూడు లీటర్ల నీళ్ళతో స్నానం ముగించేవారు. (బుఖారీ)
ఓ సారి సఅద్(ర) గారిని వుజూ చేస్తూ చూసిన ఆయన “సఅద్! ఏమిటీ వృధా?" అని ప్రశ్నించారు. 'ఏమిటి, వుజూలో కూడా వృధా ఉంటుందా?” అని ఆయన సందేహం వెలిబుచ్చగా - "అవును,ఒకవేళ నువ్వు నది ఒడ్డున వుజూ చేసినా సరే” అని సమాధానమిచ్చారు. (ముస్నద్ అహ్మద్)

 నీటిని పొదుపు చేస్తే సమాజానికి మేలు చేసినట్లే. ప్రకృతి ఇచ్చిన సంపద, వరం నీరు. అంత విలువైన నీటిని వృథా చేయటం ఒక విధంగా పాపం. నీరు సమృద్ధిగా ఉంటే సాగు బాగుంటుంది. కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు , ధాన్యం బాగా పండుతాయి. అందరికీ పని, ఆహారం దొరుకుతాయి. డబ్బు సంపాదిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే నీటి ఉపయోగాలెన్నో. నీటికి సహజ వనరులైన చెరువులను, సరస్సులను, నదులను మనం సంరక్షించుకోవాలి. వ్యర్థాల నిర్వహణలో లోపాలు, పెరుగుతున్న రసాయన ఎరువుల, కల్తీ పురుగు మందుల వాడకంతో భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి.


ప్రవక్త (స) నది ఒడ్డున కూర్చుని వుజూ చేయాల్సి వస్తే ఓ పాత్రలో నీళ్ళు తీసుకుని మితంగా వుజూ చేసి మిగతా నీటిని మళ్ళీ నదిలో పడేసే వారు. చివరిగా - వుజూలో అవయవాలను,ఒక్కోసారి, రెండేసి సార్లు, మూడేసి సార్లు కడగొచ్చు అన్న వెసులుబాటు సయితం నీటిని కాపాడే ఉద్దేశ్యంతోనే అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మూడు సార్లకన్నా ఎక్కువ సార్లు వుజూ అవయవాల్ని కడగడాన్ని వృధాగా పేర్కొన్నారు ప్రవక్త (స). 

ప్రకృతి అంటే సప్లై, డిమాండ్‌ నియమాల ప్రకారం మార్కెట్లో అమ్మడానికి ఉత్పత్తి చేసే సరుకు కాదు. వినియోగదారుల ఇష్టాఇష్టాలకు అనుగుణంగా వ్యవస్థీకృతమైన మార్కెట్‌ కాదు. ప్రకృతి ప్రైవేట్‌ ఆస్తి కూడా కాదు, కాకూడదు. ప్రకృతి వనరుల నిర్వహణ, వినియోగం, పంపిణీ సూత్రబద్ధంగా ప్రభుత్వ నియంత్రణలో ఉండాలి. అది ప్రజల ప్రస్తుత అవసరాలు తీర్చడం మాత్రమే కాదు, ఆవరణ వ్యవస్థ విధ్వంసం కాని సుస్థిరాభివృద్ధి భవిష్యత్‌ తరాల మనుగడ, అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకున్నదై ఉండాలి. పర్యావరణం ఆర్థిక వ్యవస్థ యొక్క ఉత్పత్తి స్థితిగా పరిగణించవచ్చు, కానీ సరుకుల చలామణీ ప్రవాహంలో దాన్ని భాగం చేయలేం. ప్రకృతితో మనకున్న సంబంధాన్ని అమానుషమైన లాభనష్టాల దృక్పథం నిర్దేశించకూడదు. అటువంటి ఏ ప్రయత్నమైనా ఘోరవిపత్తుకు దారితీస్తుంది.

నీటి నిర్వహణను తమ చేతుల్లోకి తీసుకొని (నీటి శుద్ధి చేయడం, నాణ్యమైన నీటిని సరఫరా చేయడం, ఆనకట్టలు కట్టడం) ప్రైవేటు కంపెనీలు చేస్తున్నది సంరక్షణ కాదు, దోపిడి అన్న విషయం ప్రతిచోటా రుజువవుతున్నది. ఇవి నీటి మీద సహజసిద్ధమైన మానవ హక్కుల్ని రద్దు చేస్తాయి. పంటలు ఎండిపోయి, జనం దాహంతో అల్లాడుతుంటే అవి ఇష్టానుసారంగా నీటిని తోడేసి అమ్ముకుంటాయి. ఏ నిబంధనలూ పాటించకుండా భూగర్భ జలాలను దోపిడి చేస్తాయి. 

తరిగిపోతున్న పచ్చదనం, విస్తరిస్తున్న ఎడారులు, ఒట్టిపోతున్న భూగర్భం, కేవలం దాహంతో మరణిస్తున్న కోట్లాది పశుపక్ష్యాదులు, మొక్కలు ఈ భూమ్మీద అత్యంత మేధోసంపన్న మనవజాతిని నిలదీస్తున్నాయి. వేరెవ్వరికన్నా ఎక్కువగా ప్రకృతి సూత్రాలు అర్థం చేసుకునే, భూమి గుండె సవ్వడిని చెవి ఒగ్గి వినగలిగే, ఆకాశం నుండి మేఘాలు చెప్పే ఊసులు ఆలకించే మానిషిని ఈ విపత్తు వెనక కారణం అడుగుతున్నాయి. మనిషే దీనికి కారణమా? మానవులు తమకు ఆవాసమైన భూమినే నాశనం చేస్తున్నారా? అవును. అయితే మనిషి తన మితిమీరిన తెలివితేటలతో చేయగలిగేది విధ్వంసమేనా? కాదు. మానవులు మనసు పెడితే ధ్వంసమైన భూభాగాలను పునర్నిర్మాణం చేయగలరు. ఉమ్మడి శ్రమతో ఎడారిలో నందనవనాలు పూయించగలరు. 

ఇంతటి విధ్వంసానికి కారణం సహజ మానవ నైజం కాదు. మరి ఏమిటి? అందరికీ చెందిన ఉమ్మడి ప్రకృతి వనరులను కబ్జా చేసుకొని తమ గుత్తాధిపత్యాన్ని నెలకొల్పి సంపదను పోగుచేసుకొన్న పిడికెడు మంది మొత్తం మానవజాతిని పరాయీకరించి, తోటి మనుషులనూ, ప్రకృతినీ కొల్లగొడుతున్నారు. ఉమ్మడి అనుభవంలో ఉన్న భూమిపై కొంతమంది యాజమాన్య హక్కును పొందినట్లుగానే ఇప్పుడు అందరికీ చెందిన నీటిని తమ సొంతం చేసుకొని మార్కెట్‌లో సరుకుగా అమ్ముకుంటున్నారు. కాబట్టి నీరు మనకు ఆహారం. నీరే మనకు ఆధారం.  ప్రకృతితో ఇకనైనా పరిహాసాలు ఆపేసి, ప్రకృతి వనరులను అతి పవిత్రంగా చూసుకోవటం నేటి మన తక్షణ కర్తవ్యం.






Friday, March 4, 2022