ముజాహిద్ ఖాన్ ఉమ్రీ
విమర్శించే హక్కుభావ ప్రకటనా స్వాతంత్య్రంతోనే విమర్శనా స్వాతంత్య్రం కూడా ముడిపడి ఉంది. ఇస్లాం సద్విమర్శను అనుమతించటమే గాక దాన్ని ప్రోత్సహించింది కూడా. దుర్మార్గుడైన రాజ్యాధికారి ఎదుట నిలబడి ఉన్నదున్నట్టు చెప్పటం 'జిహాద్' కన్నా గొప్ప విషయమని మహాప్రవక్త(స) వక్కాణించారు. నిర్మాణాత్మక మయిన విమర్శను ఖుర్ఆన్ హదీసులు 'నహీ అనిల్ మున్కర్' (చెడుల నిర్మూలనా యత్నం) గా అభివర్ణించాయి. ''మీ సోదరుడు దుర్మార్గుడైనా, బాధితుడైనా సరే మీరతనికి సాయపడండి'' అని మహాప్రవక్త (స) బోధించారు. ఇది ఆయన సహచరులకు వింతగా తోచింది. 'దైవప్రవక్తా! తమరు ఇప్పటి వరకూ బాధితులను ఆదుకోమని చెబుతూ వచ్చారు. అంత వరకూ బాగానే ఉంది. కాని ఒక దుర్మార్గునికి సాయం చేసేదెలా?' అని వారు సందేహపడగా, ''దుర్మార్గుడు దుర్మార్గానికి ఒడిగట్టకుండా ఆపండి. అదే వాడికి మీరు చేసే సాయం'' అని ఆయన(స) విపులీకరించారు.
ఎదుటి వ్యక్తి నుంచి హక్కును రాబట్టేటప్పుడు ఒక్కోసారి హక్కు దారుని నోట పరుష వాక్కులు వెలువడతాయి. అలాంటి సందర్భాలలో హక్కు ఇవ్వవలసినవారు అత్యంత ఓర్పుతో వ్యవహరించాలి. వ్యవహారం తన కాడికి వచ్చినప్పుడు దైవప్రవక్త(స) సయితం అత్యంత ఓర్పుతో, విజ్ఞతతో మసలుకునేవారు. ఒకసారి ఆయన(స) ఒక యూద వ్యక్తికి కొంత పైకం బాకీ పడ్డారు. ఆ యూదుడు వచ్చి బాకీ తీర్చమని కోరటమేగాక, దురుసుగా కూడా ప్రవర్తించాడు. అక్కడ ఉన్న ఆయన ప్రియసహచరులకు అతని ధోరణి నచ్చలేదు. వారంతా ఆ యూద వ్యక్తిని మందలించబోయారు. వెంటనే మహాప్రవక్త(స) తన సహచరులను వారించారు. హక్కు దారునికి హక్కు అడిగే స్వేచ్ఛ ఉందనీ, ఈ మాత్రానికి మీరంతగా ఆగ్రహం చెందవలసిన అవసరం లేదనీ తాకీదు చేసారు.
ఈ రకమయిన శిక్షణ పొందిన సహచరులలో మంచీ-చెడులను పరీక్షించే దక్షత పెంపొందుతుంది. అదే జరిగింది కూడా. మహాప్రవక్త ప్రియ శిష్యులు (రజి) సద్విమర్శను సదా స్వాగతించేవారు. సహించేవారు. అంతేకాదు, తమ సమకాలీన అధికార మదాంధుల ఎదుట నిలబడి నిర్భయంగా, నిర్ద్వంద్వంగా తాము నిజమనుకున్న దాన్ని ప్రకటించేవారు. ఈ సందర్భంగా వారు ఎలాంటి తటపటాయింపుకు, లోనయ్యేవారు కాదు. రెండు నాల్కల ధోరణికి అసలే ఆస్కారం కల్పించేవారు కాదు. ఒకసారి హజ్రత్ ఖౌలా(రజి) అనే మహిళకు ద్వితీయ ఖలీఫా హజ్రత్ ఉమర్(రజి) ఎదురు పడ్డారు. దీన్ని బంగారు అవకాశంగా భావించి, ఆమెగారు ఖలీఫాకు సుదీర్ఘమయిన ఉపదేశం చేసింది. గట్టిగా హెచ్చరించింది కూడా. ఆమె సంభాషణా తీరుకు అక్కడున్న వారంతా నిరసన తెలిపారు. కాని ఖలీఫా మాత్రం ఎంతో ఓపిగ్గా ప్రశాంతంగా ఆమె ఉపదేశాన్ని వినటమే గాకుండా, ''ఈమె ఫిర్యాదు ఆకాశాల్లో వినబడింది. ఈమె సామాన్యురాలు కాదు అంటూ'' అక్కడున్న వారందిరినీ సముదాయించారు.
వేరొక సందర్భంలో హజ్రత్ ఉమర్(రజి) గారే ఉపన్యాసమిస్తుండగా ఒక సాధారణ పౌరుడు ఆయనకు అడ్డు తగిలాడు. తన ప్రశ్నకు సమాధానం యిచ్చే దాకా ప్రసంగించటానికి వీల్లేదని పట్టుబట్టాడు. ఇంతకీ ఆ ప్రశ్న ఏమిటంటే, యుద్ధ ప్రాప్తిగా రాజ్యానికి వచ్చిన దాంట్లోంచి తామందరికీ ఒక్కో దుప్పటి మాత్రమే పంచబడింది. కాని తమరు తొడిగిన చొక్కాకు రెండు దుప్పట్లకు సమానమైన వస్త్రం ఉంది. అదెక్కడి నుంచి వచ్చిందో సెలవిస్తారా?! అన్నాడతను. ద్వితీయ ఖలీఫా తన కుమారుని వంక సంజ్ఞ చేశారు. అప్పుడతను ముందుకు వచ్చి తన వాటాగా వచ్చిన దుప్పటిని తన తండ్రికి బహుకరించానని వివరణ ఇచ్చాడు. అప్పుడు గాని పృచ్ఛకుడు సంతృప్తి చెందలేదు. నేడు ప్రపంచంలో పరిపాలన చేసేవారిలో- విమర్శను ఇంత ఉత్తమరీతిలో సహించే ఉదాహరణ ఎక్కడయినా ఉందా?

No comments:
Post a Comment
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు