Saturday, November 1, 2014

హిజ్రీ సంవత్సరాది

      


ముహమ్మద్ అజీజుర్రహ్మాన్ 

 కాలచరిత్రలో మరో మైలు రాయికి చేరుకున్నాము. చంద్ర మాసాన్ని బట్టి  కాల విభజన జరిగిన హిజ్రీ కేలండర్‌ ప్రకారం 1430 సంవత్సరాలు పూర్తయినాయి. 1431లో అడుగు పెట్టబోతున్నాము. ఇస్లామీయ కేలండర్‌లో జుల్‌హిజ్జా మాసం చిట్ట చివరిదైతే ముహర్రమ్‌ మొట్టమొదటిది.

  ఇంతకీ హిజ్రీ శకానికి గల ప్రాముఖ్యం ఏమిటి? హిజ్రత్‌ అంటే అసలు అర్థం ఏమిటి? అన్న ప్రశ్నలు ఈ సందర్భంగా ఉదయించక మానవు. నిఘంటువు ప్రకారం 'హిజ్రత్‌' అంటే వలస, బదిలీ, ప్రస్థానం,  తరలింపు అనే అర్థాలొస్తాయి. ప్రతి మనిషీ కొన్ని ఉద్దేశ్యాల కోసం, కొన్ని లక్ష్యాల సిద్ధ్ది కోసం ఒక చోటి నుండి మరో చోటికి, ఒక దేశం నుంచి మరో దేశానికి వలస పోతాడు. కోరిన దానిని సాధిస్తూ ఉంటాడు. కాని ఇస్లామీయ పరిభాషలో 'హిజ్రత్‌' అనేది అసాధారణ విషయం. అది మానవతలో ఓ మార్పుకు, ఓ పరివర్తనకు, ఓ విప్ల్లవానికి, ఓ మేలి మలుపుకు, ఓ ఉన్నతాశయ సిద్ధికి ఉద్దేశించినది.

  చెడు నుంచి మంచి వైపునకు, చెడు భావాల నుంచి సవ్యమైన భావాల వైపునకు, చెడు వాతావరణం నుంచి శుభప్రదమైన వాతావరణం వైపునకు, చెడు సహచర్యం నుంచి సద్వర్తనుల సహచర్యం వైపునకు, చెడు వ్యవస్థ నుంచి సత్య ప్రధానమైన వ్యవస్థ వైపునకు, రోగగ్రస్తమైన సమాజం నుంచి ఆరోగ్యవంతమైన సత్సమాజం వైపునకు, పీడనాపూరితమైన విష సంస్కృతి నుంచి స్వేచ్ఛావాయువులు పీల్చగల సువ్యవస్థ వైపునకు ప్రస్థానం చేయటమే అసలు హిజ్రత్‌. 

  అయితే ఈ 'ప్రస్థానం' అనుకున్నంత తేలిక కాదు. దీని కోసం గుండె దిటవు చేసుకోవలసి ఉంటుంది. ఇల్లూ వాకిలినీ, ఊరివారిని, ఆప్తులను, అనుబంధాలను, ఆత్మీయులను, ఆస్తిపాస్తులను, ప్రాపంచిక ప్రయోజనాలను వదలుకోవలసి ఉంటుంది. వలసపోయిన కొంగ్రొత్త ప్రదేశంలో 'ముహాజిర్‌'గా నిలదొక్కుకోవటానికి అష్టకష్టాలూ పడవలసి వస్తుంది.గుండెలకయ్యే గాయాలకు నిబ్బరంగా ఓర్చుకోవలసి ఉంటుంది. కాని ఒక విశ్వాసి దృష్టి సర్వదా దీర్ఘకాలిక ప్రయోజనాలపై నిలిచి ఉంటుంది. రానున్న 'మరో ప్రపంచం'లో తీపి ఫలాలను ఆరగించేందుకు అతను ఈ తాత్కాలిక జగతిలోని చేదు గుళికలను సంతోషంగా దిగమ్రింగుతాడు. బాధలను మనస్పూర్తిగా భరిస్తాడు.  

  14 శతాబ్దుల క్రితం అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌ (స)కు, ఆయన ప్రియ సహచరులకు సరిగ్గా ఇదే పరిస్థితి ఎదురయ్యింది. హిరా కొండపై ఉద్భవించి, సఫా కొండపై ప్రతిధ్వనించిన ఇస్లామనే అనురాగరావాన్ని నిర్ధాక్షిణ్యంగా అణచివేయటానికి దుష్టశక్తులన్నీ ఏకమయ్యాయి. సత్యామృతాన్ని  ఆస్వాదించిన దివ్యాత్ములను దివారాత్రులు పీడించి, వారి బ్రతుకులను దుర్భరం చేశాయి. ఈ పీడన నుంచి విముక్తి పొంది, ప్రాణప్రదంగా ప్రేమించే తమ జీవన సంవిధానాన్ని, సత్యధర్మాన్ని కాపాడుకోవటానికి ఆ ధన్యజీవులు మదీనాగా ప్రఖ్యాతి గాంచిన 'యస్రిబ్‌' వైపు ప్రస్థానం చేశారు. అటు పిమ్మట ఆశయప్రాప్తికై పది సంవత్సరాల పాటు అవిశ్రాంతంగా పోరాడారు. అసాధారణ త్యాగాలు చేశారు. అనుపమ రీతిలో సహన స్థయిర్యాలు చూపారు. రాత్రిళ్ళలో ప్రభువు సన్నిధిలో మోకరిల్లి ఆర్ద్రంగా సహాయాన్ని అర్థింస్తూనే పగటి వేళల్లో దైవ విరోధుల ఎదుట మొక్కవోని సాహసాన్ని ప్రదర్శించారు. పదేండ్లలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్రను సృష్టించారు. వస్తయీనూ బిస్సబ్రి వస్సలాహ్‌ా. ఇన్నల్లాహ మఅస్సాబిరీన్‌ అన్న దివ్య వచనానికి అక్షరాలా సార్థకతను చేకూర్చారు. కారుణ్య ప్రభువు ఆ మహనీయులతో ప్రసన్నుడవుగాక!

  హిజ్రీ సంవత్సరాది శుభ సందర్భంగా మనం హిజ్రత్‌లోని పరమార్థాన్ని మననం చేసుకోవాలి. అలనాడు ప్రవక్త (స) ప్రియ సహచరులు చేసిన ప్రస్థానంలోనూ - నేడు మనం చేస్తున్న ప్రస్థానంలోనూ ఉన్న వ్యత్యాసాన్ని తరచి చూడాలి.  ఎందుకంటే ఆంతర్యంలోని ఉద్దేశాలకనుగుణంగానే ఫలితాలు లభిస్తాయి. మగువను మనువాడే ఉద్దేశంతో ప్రస్థానం చేసినవారికి మగువ మాత్రమే లభిస్తుంది. 'ధన మూల మిదం జగత్‌' అంటూ హిజ్రత్‌ చేసిన వారికి ధనధాన్యాలే ప్రాప్తమవుతాయి. పదవుల కోసం ప్రస్థానం చేసినవారికి పదవులే వరిస్తాయి. అవును - ఇన్నమల్‌ ఆమాలు బిన్నియ్యాత్‌ (కర్మలకు మూలాధారాలు సంకల్పాలే). సంకల్ప నిరతిని బట్టి, సంకల్పశుద్ధిని బట్టి మాత్రమే సదాశయాలు సిద్ధిస్తాయి. ఒకవేళ ధార్మిక లక్ష్యాల ప్రాప్తితోపాటు ప్రాపంచిక ప్రయోజనాలు కూడా లభిస్తే దాన్ని దేవుని తరఫున 'అడ్వాన్సు టోకన్‌' గా భావించి గ్రహించాలి. అంతేగాని ప్రాపంచిక ప్రయోజనాలే ప్రధానం కావు. ఇవి పాక్షికమైనవి, సాపేక్షికమైనవి, సాంద్రమైనవి, అరిగిపోయేవి, నీటిలోని ఉప్పులా కరిగి పోయేవే. కడదాకా కనువిందు చేసేవి, కంటికి చలువ నిచ్చేవీ, కలకాలం నిలిచేవీ, కళకళలాడేవి ధార్మిక ప్రయోజనాలే సుమా! 

No comments:

Post a Comment

ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు