Saturday, November 1, 2014

మోక్షానికి 3 సూత్రాలు



- సయ్యిద్‌ అబ్దుస్సలామ్‌ ఉమ్రీ 

''పరిశుద్ధతను పాటించి, తన ప్రభువు నామాన్ని స్మరించి, ఆపైన నమాజు చేసిన వాడు తప్పక సాఫల్యం పొందుతాడు. కాని మీరేమో ప్రాపంచిక జీవితం  పైనే మోజు పడుతున్నారు. నిజానికి పరలోక జీవితమే మేలైనది. మిగిలి ఉండేదీను.''(ఖుర్‌ఆన్‌-  87:14-17)
             
 కొందరు ధర్మ పండితులు 'తజ్‌కియా' అంటే -ఫిత్రా దానం(జకాతె ఫిత్ర్‌) అని, వజకరస్మ రబ్బిహీ అనగా ఈద్గాలో చెప్పే తక్బీరాత్‌  (అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌, లా ఇలాహ ఇల్లల్లాహు అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌, వలిల్లాహిల్‌ హమ్ద్‌.) అని, 'ఫసల్లా' అంటే- ఈద్‌ నమాజు అని వ్యాఖ్యానించారు. అలాగే ఖద్‌ అఫ్‌లహ మన్‌ తజక్కా అంటే వుజూ అనీ వజకరస్మ రబ్బిహీ అంటే వుజూ తర్వాత చదివే దుఆ, (కలిమయె షహాదహ్‌ా) సాక్ష్యవచనం అనీ, ఫసల్లా అంటే నమాజు అని కూడా కొందరు భాష్యం చెప్పారు.

  పోతే దైవప్రవక్త(స) వుజూ అనంతరం ''అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్‌ాదహు లా షరీక లహు, లహుల్‌ ముల్కు వలహుల్‌ హమ్దు వహువ అలా కుల్లి షైయిన్‌ ఖదీర్‌'' తో పాటు ''అల్లాహుమ్మజ్‌ అల్‌నీ మినత్తవ్వాబీన వజ్‌ అల్‌నీ మినల్‌ ముతతహ్హిరీన్‌'' (ఓ అల్లాహ్‌ా! నన్ను పశ్చాత్తాప పడే వారిలోనూ, పరిశుద్ధతను పాటించే వారిలోనూ చేర్చు) అని చదవమన్నారు. అంటే పశ్చాత్తాపం (తౌబా) తో మనసును పరిశుద్ధపర్చుకోవడం, నీటితో శరీరాన్ని శుభ్రపర్చుకోవడం. ఈ రెండు పరిశుద్ధ, పరిశుభ్రత వచనాలు కలిస్తే         దాసుడు దేవుడి ముందు నిలబడటానికి అర్హుడవుతాడు అన్న మాట. (ఇబ్నుల్‌ ఖయ్యిమ్‌) 
దీనివల్ల దాసుడు నమాజు వల్ల బాహ్య సౌందర్యంతో పాటు ఆత్మ సౌందర్యాన్ని సైతం పొందుతాడు అని తెలుస్తుంది.  ఇబ్నుల్‌ ఖయ్యిమ్‌ (రహ్మ) ఇలా అన్నారు: ''సౌందర్యం సింగారం అనేది రెండు విధాలు. (1) బాహ్యపరమైనది (2) ఆత్మపరమైనది. దుస్తులు బాహ్య సింగారానికి మూలమైతే, తఖ్వా (దైవభీతి) ఆత్మ సౌందర్యానికి తార్కాణం''. అలాంటి హృదయ సౌందర్యమే స్వర్గానికి సోపానం. 

 ఇక మన విజయానికి, ఇహపరాల సాఫల్యానికి పెద్ద ఆటంకం ప్రాపంచిక వ్యామోహం. ఎవరి మదిలోనైతే ధన పిపాస, ఐహిక లాలస, తిష్టవేసి కూర్చుంటుందో వారిలో కామ, క్రోధ, మధ, మోహ, మత్సర్యాలు సహజంగానే చోటు చేసుకుంటాయి. అటువంటి వ్యక్తులు మంచి కోసం ఎలాగూ పాటుపడరు. పైగా మంచి చేసే వారి మార్గంలో ముల్లులై సూటిపోటి మాటలతో గుచ్చుతుంటారు. ధనం మనిషిని నడిపే ఇంధనం అన్నది వారి సిద్ధాంతం అయి ఉంటుంది. తన కోరికల, సరదాల పరిపూర్తికైతేనేమో మంచి సంపదనే ఖర్చుపెడతారు గానీ, దైవమార్గంలో ఖర్చుపెట్టాల్సివస్తే మాత్రం పనికిరానివి ఏరి మరీ ఖర్చు చేస్తారు. తామైతే విదేశాల్లో ఉండి వేలు సంపాదిస్తుంటారు. జకాత్‌, ఫిత్రా దానాల విషయానికొచ్చినప్పుడు తన అసలు బుద్ధి ప్రదర్శిస్తారు. ఉదాహరణకు తామున్న ప్రాంతం ప్రకారం ఫిత్రా దానం ఒక్క దీనారైతే, ఆ ఒక్క దినారును ఇండియాలో ఫిత్రాగా తీస్తే ఇంటివారందరి ఫిత్రా అయిపోతుందని, కాబట్టి తన ఫిత్రాను కూడా భారతదేశంలోనే తీయమని పురమాయిస్తారు. పైగా తమ ఈ పనికిమాలిన చేష్టను సమయస్ఫూర్తి అంటూ నలుగురిలో చెప్పుకుని మురిసిపోతారు కూడా. ఎంత విడ్డూరం! అబ్దుద్దీనార్‌లు, అబ్దుద్దిర్హమ్‌లు అంటే ఇలాంటి వారే. వారికి దీనార్‌ అంటే, దిర్హమ్‌ అంటే, డాలర్‌  అంటే, ధనం అంటే వల్లమాలిన అభిమానం. అల్లాహ్‌ ఇలా సెలవిస్తున్నాడు: ''విశ్వసించిన ప్రజలారా! మీరు సంపాదించిన ధనంలోని, మేము మీ కొరకు నేల నుండి ఉత్పత్తి చేసిన దానిలోని మేలైన భాగాన్ని దైవమార్గంలో ఖర్చుపెట్టండి. ఆయన మార్గంలో ఇవ్వడానికి పనికిరాని వస్తువులను ఏరి తీసే ప్రయత్నం చెయ్యకండి. ఒకవేళ ఆ వస్తువులనే (అలాంటి వేెతనాన్నే) ఎవరైనా మీకు ఇస్తే, వాటిని మీరు తృణీకార భావంతో తప్ప, మనసారా స్వీకరించరు కదా!'' (దివ్యఖుర్‌ఆన్‌ 2:267) 
 మరో చోట ఇలా ఉంది: ''మీరు అమితంగా ప్రేమించేవాటిని సైతం (దైవ మార్గంలో) వినియోగించనంత వరకూ మీరు సత్కార్య స్థాయికి చేరుకోలేరు.  (ఆలి ఇమ్రాన్‌ :92)

No comments:

Post a Comment

ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు