Monday, December 2, 2024
అపరాధాల అమ్మ మద్యం, మత్తు
అపరాధాల అమ్మ మద్యం, మత్తు
విశ్వాసులారా! మద్యం, జూదం, దైవేతరాలయాలు, పాచికల జోస్యం- ఇవన్నీ అసహ్యకరమైన పైశాచిక విషయాలు. వాటికి దూరంగా ఉండండి, మీ జీవితం సార్థకమవుతుంది. (అల్-మాయిదా : 90)
మత్తు వదిలితేనే భవిష్యత్తు..
మనిషి ఆనందంగా జీవించడానికి మనందరి సృష్టికర్త అల్లాహ్ ఎన్నో వనరులను సమకూర్చాడు. వాటిని సద్వినియోగం చేసుకుంటూ మానవత్వంతో మనుగడ సాగించమని ఆశీర్వదించాడు. ధర్మబద్ధంగా జీవిస్తూ, సత్యవ్రతాన్ని పాటించే సజ్జనులకు అండగా ఉంటానన్నాడు. కానీ, మనిషి అల్లాహ్ అనుగ్రహించిన స్వేచ్ఛాజీవితాన్ని దుర్వినియోగపరుస్తున్నాడు. మహోన్నత వరాలుగా లభించిన వనరులను కలుషితం చేస్తున్నాడు. అరిషడ్వర్గాలకు బానిసై ఆనందంగా గడపాల్సిన జీవితాన్ని దుఃఖమయం చేసుకుంటున్నాడు. అధర్మాన్ని అంటిపెట్టుకుని, అవినీతిని ఆసరాగా చేసుకుని ఎదగాలనుకుంటూ భంగపడుతు పడరాని పాట్లు పడుతున్నాడు. అలాంటి పడకూడని ప్రమాదాల్లో ఓ భయంకర ప్రమాదమే మద్యపానం, సారాయి సేవనం, మాదక ద్రవ్యాల వాడకం. చెడ్డ పనులు చేయకుండా మనసును నిగ్రహించుకోవాలి. అలా చేయకపోతే అలవాటుగా మారి ప్రమాదం కొని తెచ్చుకున్నట్లవుతుంది. మంచి పనుల విషయంలో మనిషి అందుకు భిన్నంగా వ్యవహరించాలి. చేయగా చేయగా మంచి పనులు అలవాటుగా మారీ జీవితాన్ని నందనవనం చేస్తాయి.
పై ఆయతులో, మత్తు పదార్ధం,మద్యం నిషిద్ధం అని క్రింది పది కారణాలతో వివరించబడింది:
1. జూదం, బహుదైవోపాసనా స్థలాలు, పాచికల ద్వారా జోస్యంతోపాటు మత్తు పదార్ధం, మద్యాన్ని ప్రస్తావించడం జరిగింది. ఈ మూడు విషయాలు హరామ్ కాబట్టి, మత్తు పదార్ధం, మద్యం కూడా హరామే.
2. మత్తు పదార్ధం, మద్యపానాన్ని రజస్ (అశుద్ధం) అని చెప్పబడింది మరియు ప్రతి అశుద్ధ వస్తువు హరామ్ - నిషిద్ధమే.
3. మత్తు పదార్ధం, మద్యం సేవించడం షైతాన్ చర్య అని చెప్పబడింది మరియు ప్రతి పైశాచిక చర్య హరామ్ - నిషిద్ధమే.
4. అల్లాహ్ మత్తు పదార్ధం, మద్యపానం నుండి దూరంగా ఉండాలని ఆదేశించాడు, కాబట్టి ఆజ్ఞాపాలన తప్పనిసరి, అవిధేయత హరామ్ - నిషిద్ధమే.
5. పరలోకం మరియు ఇహలోకం యొక్క విజయం మరియు క్షేమం, మోక్షం మత్తు పదార్ధం, మద్యపానానికి దూరంగా ఉండటంపై ఆధారపడి ఉంటుంది, కాబట్టి దానిని సేవించడం హరామ్ - నిషిద్ధమే.
6. మత్తు పదార్ధం, మద్యం మాధ్యమంగా షైతాన్ మీమధ్య విరోధం నాతుటాడు అని పేర్కొనబడింది. కాబట్టి దానికి దారి తీసే మత్తు పదార్ధం, మద్యం హరామ్ - నిషిద్ధమే.
7. మత్తు పదార్ధం, మద్యపానం కారణంగా, షైతాన్ విద్వేషబీజాలు నాటుతాడు. విద్వేషం, పగ హరామ్ - నిషిద్ధమే.
8. మత్తు పదార్ధం, మద్యం అల్లాహ్ నుండి దూరం చేస్తుంది. అల్లాహ్ను స్మరించుకోవడం మానేయడం హరామ్ - నిషిద్ధమే.
9. మత్తు పదార్ధం, మద్యం నమాజు ప్రార్థన నుండి నిరోధిస్తుంది. ప్రార్థనను నిరోధించడం హరామ్ - నిషిద్ధమే.
10- అల్లాహ్ చాలా స్పష్టంగా నిషేధాజ్ఞ జారీ చేశాడు. : "కాబట్టి మీరు మద్యం తాగడం మానేస్తారా?" అన్నాడు.
పై పది కారణాలతో మత్తు పదార్ధం, మద్యం హరామ్ - నిషిద్ధం అని తేట తెల్లం అవుతుంది. ఇక వితండవాదం చేసే మేథావులు అంటారా? తిమ్మిని బిమ్మిని చేయడం వారికి ఉగ్గుపాలతో అలవడిన వినాశకర విద్య కదా!
ఆధునిక సోకాల్డ్ పండితులు దాన్ని నిషేధాజ్ఞల జాబితాలో చేర్చకపోతే అది వారి ఖర్మ. దాని ద్వారా వారు చెప్పదలచిందేమిటీ? ఒక నీచమయిన పని, షైతాన్ చేష్ట కూడా ధర్మసమ్మతం కాగలదని వారు రుజువు చెయ్యదలుస్తున్నారా? సాఫల్యానికి దోహదపడే వస్తువులు పతనానికి కారణభూతమయ్యే వస్తువులు రెండునూ ధర్మసమ్మతమైనవేనని వారు చెప్పదలుస్తున్నారా? ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజివూన్.
సారాయి, జూదం వల్ల పొడసూపే మరిన్ని చెడుగులు యిక్కడ పేర్కొనబడ్డాయి. ఆ చెడుగులు సామాజికమైనవీ, ధార్మికమైనవీ కావచ్చు. అందుకే మద్యపానాన్ని "అపరాధాల అమ్మ"గా అభివర్ణించటం జరిగింది. అలాగే జూదం కూడా పరమ దరిద్రమైన వ్యసనం. ఈ వ్యసనానికి దాసోహమన్న వ్యక్తి ఎందుకూ పనికిరానివాడుగా మారిపోతాడు. గొప్ప గొప్ప జమీందారులు, శ్రీమంతులే దీని వాతన పడి బిచ్చగాళ్లుగా మారిపోయారు.
ఆఖరికి మీరు వీటిని ఇకనయినా మానుకుంటారా? లేదా? అని చెప్పి విశ్వాసులకు పరీక్ష పెట్టడం జరిగింది. నికార్సయిన విశ్వాసులంతా ఈ ఆయతు అవతరించగానే దేవుని అభిమతాన్ని పసిగట్టి మద్యసేవనాన్ని పరిత్యజించారు. "ఓ ప్రభూ! మేము వీటిని మానుకున్నాము" అని క్రియాత్మకంగా సమాధానమిచ్చారు.
హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రజి) కథనం:- నేను హజ్రత్ అబూ తల్హా (రజి) ఇంట్లో జనానికి సారాయి పోస్తుండేవాడ్ని. ఆ రోజుల్లో ప్రజలు ఖర్జూర సారాను త్రాగేవారు ఓ రోజు దైవప్రవక్త (సల్లం) చాటింపు వ్యక్తి ద్వారా "జనులారా! జాగ్రత్తగా వినండి, (ఈ రోజు నుండి) సారాయి నిషేధించ బడింది" అని చాటింపు వేయించారు. హజ్రత్ అబూ తల్హా (రజి) (ఈ చాటింపు విని) "వెళ్ళు, సారాయిని బయటికి తీసి కెళ్ళి పారబోయి" అని అన్నారు నాతో. నేను సారా (కుండల)ను బయటికి తీసికెళ్ళి పారబోశాను. ఆ రోజు మదీనా వీధుల్లో సారాయి (ఏరులా) ప్రవహించసాగింది. ఆ సందర్భంలో కొందరు "కడుపులో సారాయి కలిగి ఉన్నవారు నాశనమయ్యారు” అని అన్నారు. అప్పుడు దేవుడు ఈ సూక్తిని అవతరింపజేశాడు:- "సత్యాన్ని విశ్వసించి, సత్కర్మలు ఆచరించనారంభించిన వారు గతంలో తిని త్రాగిన వాటిని గురించి వారిని పట్టుకోవడం జరగదు. (అంటే అందులో అప్పుడు పాపమేమీ లేదు) అయితే ఇక నుండి నిషేధిత వస్తువులకు వారు దూరంగా ఉండాలి. విశ్వాసంలో స్థిర చిత్తులయి సత్కార్యాలు చేస్తూ ఉండాలి”. (అల్-మాయిదా:93) (సహీహ్ బుఖారీ)
మధ్య సేవనం ఒక చూపులో
పుట్టుకైనా, చావైనా కష్టమైనా, సుఖమైనా దుఖమైనా, సంతోషమైనా సంతాపమైనా , లాభమైనా నష్టమైనా, విరహమైనా, వియోగమైనా రోగమైనా, రాగమైనా ఓటైనా, వేటైనా అయినా, మాటు ఆయినా పోటు అయినా, మునిగినా తేలినా - ఘట్టం ఏదైనా మందే కదా చుట్టమయ్యేది! చివరాఖరికి 'మందు' హాసమే కదా మిగిలేది! అన్నట్టుంది నేడు అనేక మంది వ్యవహారం. చుక్క, ముక్క లేనిదే ఏ పని జరగడం లేదు. కొందరికయితే పక్క కూడా కావాలి.
ఉద్యోగం వస్తే పార్టీ... పెళ్లి కుదిరితే పార్టీ... ప్రమోషన్ వస్తే పార్టీ... నలుగురు స్నేహితులు కలిసినప్పుడల్లా పార్టీ అంటే.. ఆ పార్టీలో చుక్క, ముక్క తప్పనిసరి. వారాంతాల్లోనే కాదు, మామూలు రోజుల్లోనూ కిటకిటలాడే పబ్బులూ బార్లే అందుకు నిదర్శనం. చిన్నా పెద్దా లేదు. చేతిలో డబ్బుంటే బాలు తాగడాన్ని ఎవరూ తప్పనుకోవడం లేదు సరికదా సోషల్ స్టేటస్ గా బావిస్తున్నారు.
కొంత కాలం క్రితం వరకూ మద్యం తాగే అలవాటు ఉంటే పిల్లనివ్వడానికి జడిసేవారు. ఇప్పుడు ఆ నియమం పెట్టుకుంటే పిల్ల పెళ్లి చేయడం కష్టమే అనేటట్లుగా తయారైంది పరిస్థితి. మొదట స్నేహితులతో సరదాగా మొదలయ్యే 'ఎప్పుడైనా ఓసారి' కాస్తా కొన్నాళ్లకే 'అప్పుదప్పుడూ... అవుతుంది. ఆ తర్వాత 'వారానికోసారి' అయ్యి చివరికి ప్రతిరోజూగా మారుతుంది. మద్యం తాగడం అలవాటైనవారిలో చెప్పుకోదగ్గ శాతం వ్యసనపరులుగా మారే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. వ్యసనం దాకా వెళ్లక్కరలేదు. అసలు మద్యం తాగడమే అనారోగ్యానికి ఆహ్వానం పలకడమని వైద్యులు తేల్చి చెబుతున్నారు. ఎవరికైనా సరే, వారి జీవితంలోకి సంపద రాకముందే, వారి జీవితంలోకి క్రమశిక్షణ, బాధ్యత, నిమగ్నత రావాలి. లేకపోతే ఆ సంపదే తల భారం అవుతుంది. ప్రస్తుతం ఈ తరానికి జరుగుతున్నది అదే.
దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు; విద్యా జ్ఞానాలు అంతరించి, అజ్ఞానం పెరిగిపోతుంది. వ్యభిచారం ఎక్కువయి పోతుంది. మద్యపానం సర్వసామాన్యమౌతుంది. పురుష జనాభా తగ్గిపోయి స్త్రీజనాభా పెరుగుతుంది. చివరికి యాభైమంది స్త్రీలను కనిపెట్టుకొని ఉండేందుకు ఒకే ఒక పురుషుడు ఉంటాడు." (బుఖారి, ముస్లిం)
అశుద్ధాలకు అమ్మ మద్యం, మత్తు
హజ్రత్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (ర) గారి ఉల్లేఖనం: మీరు అపరాధాలకు అమ్మ అయిన మత్తు, మద్యానికి దూరంగా ఉండండి. మీకు పూర్వం ఓ మహా భక్తిపరులుండేవాడు. ఆటను ప్రజల నుండి వేరైన ఏకాంత ప్రార్థనలు చేస్తూ నిష్ఠ నిబద్ధతలతో జీవించేవాడు. అదే ప్రాంతం నివాసం ఉండే ఓ జార స్త్రీ ఆయన్ను మోహించింది. ఎలాగోలా ముగ్గులో దింపాలని ప్రయత్నించింది. అందు నిమిత్తం ప్రణాళిక రచించి తన సేవకుణ్ణి పంపి - సాక్ష్యానికి సంబంధించిన ఓ ధర్మకార్యం ఉంది అని కబురు పెట్టి తన ఇంటికి రావాల్సిందిగా కోరింది. ఇదేమి తెలియని ఆ భక్తిపరుడు సేవాభావంతో బయలుదేరాడు పాపం! తీరా ఆమె నివాస గృహానికి చేరుకున్నాడు. నివాస గృహంలో తాను ప్రవేశించేకొద్దీ ఒక్కో తలుపు మూసి వేయబడేది. అలా ఆ స్త్రీ ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. (మొహినిలా ముస్తాబయి కొలువుదీరి ఉంది ఆ స్త్రీ). ఆమెతోపాటు అక్కడ మద్యం పాత్ర, ఒక బాలుడు ఉన్నాడు. (వెకిలి నవ్వులు నవ్వుతూ ఇలా అంది) - నేను నిన్ను సాక్ష్యానికి సంబంధించిన ధర్మకార్యం కోసం పిలువ లేదు. చూడు వద్ద మూడే మార్గాలున్నాయి. నువ్వు నా కామ తాపాన్ని చల్లార్చాలి. లేదా ఈ బాలున్ని చంపాలి. లేదా మద్యం అయినా సేవించాలి. కాదు కూడదు, అపచారం అంటూ తప్పించుకోవాలంటే మాత్రం గుర్తుంచుకో! నేనే అరచి గోల పెట్టి నీ పరువుని బజారుకీడ్చుతాను.. ఆలోచించుకో! అంది. ఆ భక్తునిది ఏమి తోచని అయోమయ స్థితి. పరపొందు వ్యభిచారం హరామ్ - ఘోరపాపం. బాలున్ని చంపడం హరామ్ - ఘోరపాపం. మద్యం సేవించడం హరామ్ - ఘోరపాపం. ఏం చేయాలి. ఆ ... మొదటి రెండుకన్నా చివరిడి కాస్త నయం అనిపిస్తుంది అని మద్యం తాగడానికి సిద్ధమయ్యాడు. ఒక గ్లాసు రెండు గ్లాసులంటూ బాగా ముత్తెంకెంతగా తాగేశాడు. ఇక ఆ మైకంలో ఆ మహిళతో రమిచ్చాడు కూడా, ఆ బాలున్ని హత్య కూడా చేసేశాడు. కాబట్టి మత్తుని కలిగించే ప్రతి విషయం నుండి దూరం ఉండండి. అల్లాహ్ సాక్షి! చెబుతున్నా - మత్తు మొహం మరియు విశ్వాసం ఏక సమయంలో ఒక వ్యక్తి హృదయంలో ఇమడజాలవు. ఒకవేళ ఇమిడాయి అంటే, వాటిలో ఒకటి ఇంకొకటిని బయటికి గేమ్తెస్తుంది అన్నారు దైవప్రవక్త (స). (ఇబ్ను హిబ్బాన్, బైహాఖీ - స్థాయి హసన్)
ఇంతకంటే దారుణాన్ని విని ఉండరు
ఇన్ని రోజుల్లో కోర్టుకు వచ్చిన కేసుల్లో అత్యంత దారుణమైన కేసు ఇదే. ఓ తల్లి చేసిన దారుణం గురించి హామిల్టన్ కౌంటీ కోర్టు జడ్జి లెస్లీ ఫిజ్ చేసిన వ్యాఖ్యలివి. నిందితురాలు కొర్కొరన్కు 51 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు. ఇంత భారీ శిక్ష పడటానికి ఆమె చేసిన నేరం ఏంటంటే..
కొర్కొరన్ డ్రగ్స్ బానిసైంది. హెరాయిన్ తీసుకోకుంటే రోజు గడిచేదికాదు. అయితే డ్రగ్స్ కొనేందుకు ఆమె వద్ద సరిపడా డబ్బు ఉండేదికాదు. అలాగని డ్రగ్స్ అలవాటు మానులేకపోయింది. రెండేళ్ల క్రితం కొర్కొరన్ డబ్బుల కోసం తన 11 ఏళ్ల కుమార్తెను డ్రగ్ డీలర్ వద్ద కుదువ పెట్టి అప్పు తీసుకుంది. ఇంతకంటే దారుణమేంటంటే తన కూతురును అత్యాచారం చేసేందుకు డ్రగ్ డీలర్కు అనుమతిచ్చింది. ఆ నీచుడు అభంశుభం తెలియని బాలికపై దారుణానికి పాల్పడ్డాడు. ఆ అమ్మాయిని హింసించి తన వాంఛలు తీర్చుకునేవాడు. కొన్నిసార్లు ఈ దృశ్యాలను వీడియోలు తీసేవాడు. కొర్కొరన్ తన కూతురును ఇంతటితో వదిలిపెట్టలేదు. కుమార్తెకూ బలవంతంగా డ్రగ్స్ ఇచ్చేది. పాపం ఆ చిన్నారి ప్రతిసారి వాంతి చేసుకునేంది. ఐదు నెలల పాటు ఆ అమ్మాయి చిత్రహింసలు అనుభవించింది.
అన్ని తెలిసి తెలిసి యవివేక తిమిరాన / మనుజులంత వింత మధువు ద్రావి
మమత మానవతలన్ మహిలోన వీడియు / అథములౌచు మిగుల నార్చుచుండ్రి.
గత ఇరవయ్యేళ్లలో మన దేశంలో మద్యపానం చేసేవారి సంఖ్య 50 శాతం పెరిగిందట. యువత అతిగా తాగుతోందనీ, అమ్మాయిలు కూడా ఏమీ తగ్గడం లేదనీ, పదిహేనేళ్లలోపే మద్యం రుచి చూస్తున్నవారి సంఖ్య భారీగా పెరిగిందనీ అధ్యయనం చెప్పింది. ఆ తర్వాత వెలువడిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే లెక్కలు కూడా దాన్ని బలపరిచాయి. మూడో వంతు పురుషులు అలవాటుగా మద్యం పుచ్చుకుంటున్నారని తేల్చాయి.
ఎనర్జీ డ్రింక్ కాదు ఎలర్జీ డ్రింక్
మన దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో నూటికి దాదాపు 25 యాక్సిడెంట్లు మద్యం మత్తులో జరుగుతున్నవేనని సర్వేల్లో తేలింది. మద్యపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా చాలామంది మందు అలవాటు మానుకోరు. మద్యం అనారోగ్యాలకు కారణమని చెబుతూనే ప్రభుత్వాలు రకరకాల బ్రాండ్ల పేరుతో వాటిని అమ్ముతుంటాయి. అసలు మద్యం సేవిస్తే శరీరంలో ఏమి జరుగుతుందో తెలిస్తే దాని జోలికి కూడా వెళ్లరు.
మద్యం పేరు ఏదైనా శరీరంలో అది చేసే పని ఒకటే.. డబ్బున్న వాళ్ళు బార్లలో బీర్లు, బ్రాందీలు, విస్కీ, వైన్, జిన్ను అనునకుంటూ మద్యం త్రాగితే గ్రామాల్లో నివసించే వాళ్లు కాస్త ఖరీదు తక్కువలో దొరికే సారా, కల్లూ తాగుతారు. ఏం త్రాగినా శరీరంలో దాని ప్రభావం ఒకే రకంగా ఉంటుంది.
మద్యం త్రాగేవారి కాలేయం దెబ్బతిని "సిర్రోసిస్ ఆఫ్ లివర్" (Cirrhosis of Liver) అనే జబ్బు వస్తుంది. పొట్టనిండా నీరు చేరి క్రమంగా "బానపొట్ట” వస్తుంది. కాళ్ళ వాపులు వస్తాయి. మానవ శరీరంలో కాలేయం ఒకటే ఉంటుంది కాబట్టి, అది దెబ్బ తింటే మరణానికి చేరువ అవుతున్నట్టేనని గుర్తించాలి. బావిలో నీళ్ళూరినట్లు కాలేయంలో నీరు ఊరుతుంది. అన్నవాహిక, జీర్ణాశయం కలిసే దగ్గర గల రక్తనాళాలు ఉబ్బిపోయి, రక్త స్రావం కూడా జరగొచ్చు. ప్రమాదంతోనే చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.
గుండెకు బోలెడు ముప్పు…
మద్యం సేవిస్తే గుండె కండరాలు దెబ్బతిని "గుండె విశాలంగా" మారుతుంది. గుండె వైశాల్యం క్రమంగా పెరుగుతుంది. చివరకు గుండె ఆగిపోతుంది. ఈ జబ్బుని "గుండె పెరగటం" (Cardiomegaly) అంటారు. ఇది చివరికి "హార్ట్ ఫెయిల్యూర్"కు దారి తీస్తుంది.
పొట్టలో పుళ్లు…
మద్యపానంతో పొట్టలో పుళ్లు ఏర్పడతాయి. గాస్ట్రైటిస్" (Gastritis) వస్తాయి. పొట్టలో క్యాన్సర్ . క్రమంగా ఆకలి మందగిస్తుంది. అన్నవాహికలో క్యాన్సర్ తీవ్రమయ్యే కొద్దీ అన్నం మింగుడు కూడా పడదు. తర్వాత దశలో కనీసం మంచి నీళ్ళు కూడా మ్రింగుడు పడవు. ఆ సమయంలో వైద్యులు కూడా చేయగలిగింది ఏమి ఉండదు.
నరాల క్షీణత..
మద్యం సేవించడం వల్ల "నరాల బలహీనత" వస్తుంది. కాళ్ళూ, చేతులో నొప్పులూ, మంటలూ పుడ్తాయి. ఎన్ని మందులు వాడినా ఈ సమస్యలు తగ్గవు. నరాల నొప్పులు తగ్గుతాయని ఇంజెక్షన్లు వాడినా ఉపయోగం పెద్దగా ఉండదు.
తాగే వారికి మెదడు, నరాలు దెబ్బతింటాయి. మెదడులో కణాలు దెబ్బతింటాయి. జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది. నిద్రపట్టడం తగ్గిపోతుంది. త్రాగేవారికి ఆహార పదార్థాల, విటమిన్ల లోపాలు కూడా వస్తాయి. “వెర్నిక్స్ ఎన్సెఫలోపతీ", "పాలీన్యూరైటిస్" (Polyneuritis), "నికోటినిక్ యాసిడ్" లోపంతో వచ్చే “ఎస్ కెఫలోపతీ" (Encephalopathy) మొదలైన జబ్బులు వస్తాయి.
ఒకేసారి మానేసినా ప్రమాదమే…
మద్యం అలవాటు ఉన్న వారు అతిగా త్రాగినా, అకస్మాత్తుగా మానినా, ఎక్కువ చలికి గురైనా, “డెలీరియం ట్రెమన్స్” (Delirium Tremens) అనబడు మెదడు వ్యాధి వస్తుంది. ఈ రోగం వల్ల నిద్ర ఉండదు. కాళ్ళూ, చేతులూ వణుకుతుంటాయి. భయం, దృష్టి, వినికిడికి సంబంధించిన భ్రమలు వస్తుంటాయి. ఎవరో బెదిరిస్తున్నట్లు మాటలు వినపడటం, ఎవరూ పిలవకపోయినా పిలిచినట్లు, పిలిస్తే వినపడక పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. జ్ఞాపక శక్తి సన్నగిల్లిపోతుంది.
తీవ్రమైన భ్రమలు…
"ఎక్యూట్ హెలూసినోసిస్" (Acute Hallucinosis) అనే జబ్బుతో తీవ్రమైన భ్రమలు కలిగి, ఆ పరిస్థితి వారాలు మొదలుకొని నెలల తరబడి ఉండొచ్చు. ఈ సమస్య ఉంటే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు పెరుగుతాయి.
రక్తపోటు, పక్షవాతం రావడానికి త్రాగుడు కూడా ఒక కారణమని వైద్య పరిశోధనల్లో గుర్తించారు. మెదడు మీద సారా పనిచేయటంలో "ఆల్కహాలిక్ డెమెన్షియా" (Alcoholic Dementia) చివరి దశ. ఈ దశలో అన్ని పేర్లు మర్చిపోతారు. కుటుంబ సభ్యుల పేర్లు కూడా గుర్తుండవు.
మద్యపానంతో కండరాలు దెబ్బతింటాయి. “స్కెలిటల్ మయోపథీ" (Skeletal Myopathy) అనే సమస్యతో విపరీతమైన నీరసం, శారీరక శ్రమ చేయటానికి ఇష్టపడకపోవటం వంటి సమస్యలు తలెత్తుతాయి. చివరకు పనిచేసే స్థితిని కూడా కోల్పోతారు.
మద్యం తాగితే ఆ సామర్థ్యం తగ్గిపోతుంది…
మద్యపానం ఎక్కువైతే కాలేయం దెబ్బతినడం వలనా, పురుషుల సెక్సు హార్మోన్లు తయారు కావటం తగ్గిపోతుంది. పురుషులో వృషణాలు సన్నబడతాయి. మద్యపానం వల్ల సెక్స్ కోరికలు పెరిగినట్లు అనిపిస్తుంది. కానీ తాగినప్పుడు లైంగిక సామర్థ్యం బాగా తగ్గిపోతుంది. అది గమనించక చాలామంది మద్యం వల్ల పెరిగే కోరికనే సామర్థ్యంగా అపోహపడి, మరింతగా బానిస అవుతుంటారు. స్త్రీలలో వక్షోజాల పరిణామం పెరుగుతుంది. చివరకు సెక్సు సామర్థ్యం క్షీణించి వంధ్యత్వం వస్తుంది. నోరు, గొంతు, స్వరపేటిక, అన్నవాహిక, కాలేయం, ఊపిరితిత్తుల్లో, క్యాన్సర్ ఉన్నవారు సారా తాగేవారయితే వారి జీవన ప్రమాణం బాగా తగ్గిపోతుంది. బ్రతకాల్సిన దానికన్నా ముందుగా చనిపోతారు.
మద్యం... మతి పోగొడుతుంది!
తాటి యీత కల్లు, ద్రాక్ష రసంబును, సార, నీర, వైను, స్కాచు, విస్కి రమ్ము, జిన్ను, బీరు, బ్రాందీల జెప్పరే మత్తునిచ్చునట్టి మద్యమనుచు. పేరు ఏదైనా మద్యం ,మత్తు పదార్థాల వల్ల జరిగే నష్టం అంతా ఇంతా కాదు, బోలెడంత.
మద్యం తాగినప్పుడు మొదటి 20 ఎం.ఎల్. పరిమాణం మెదడులో కలిగించే రసాయన మార్పులు మరింత మద్యం తీసుకునేలా ప్రేరేపిస్తాయి. ఎందుకంటే తొలి 20 ఎం.ఎల్.తో ఉద్వేగం, హుషారుగా అనిపించడం, కాస్త దుడుకుతనం కలుగుతాయి. ఆ హుషారును కొనసాగించడానికి మద్యపానాన్ని కొనసాగిస్తారు. అయితే తొలుత చురుకుదనాన్ని కలిగించినట్లు అనిపించే మద్యం కాస్తా 80 ఎం.ఎల్. మించగానే శరీరంలో కొన్ని మార్పులు కలిగిస్తుంది. తమపై తాము నియంత్రణ కోల్పోవడం, ఒళ్లు తూలడం, ఏకాగ్రత లేకపోవడం వంటి మార్పులకు కారణమవుతుంది. ఆ తర్వాత ఆ పరిమాణం 200 ఎం.ఎల్.కు చేరితే కోపం, చిరాకు, దెబ్బలాటకు దిగడం, అరవడం వంటి దుర్లక్షణాలు చోటు చేసుకుంటాయి. దెబ్బలాటలు ముదిరినప్పుడు నేరాలకూ దారితీస్తాయి. దాదాపు 90 శాతం నేరాలు, ప్రమాదాలు, హత్యలు, ఆత్మహత్యలకు మద్యమే కారణమవుతోంది. ఇక మద్యం ఒక వ్యసనంగా మారినప్పుడు ఒక వ్యక్తి ప్రమేయం లేకుండానే తాగడం మొదలుపెడతాడు. ఓ మోతాదు దగ్గర తనను తాను నియంత్రించుకోలేడు. అందుకే మద్యం తాగడాన్ని వ్యాధిగానే డాక్టర్లు (మానసిక నిపుణులు) పరిగణిస్తారు. మద్యం లైంగిక హింస, గృహహింస, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య అగాధాన్ని పెంచుతుంది. నేరప్రవృత్తిని అధికం చేస్తుంది. నేరమనస్తత్వం (యాంటీసోషల్ పర్సనాలిటీ) ఉన్నవారిలో ఇతరుల బాధల పట్ల స్పందించే గుణం ఉండదు. అందుకే తాగినవారు నేరాల సమయంలో అంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుంటారు.
దైవ ప్రవక్త స్ (స) ఇలా జాగురూక పర్చారు: నా సముదాయంలో కొందరు తప్పకుండా వస్తారు. వారు మద్యం, మత్తు పదార్థానికి పేరు మార్చి ఏమార్చి దాని ని హలాల్ చేసుకుంటారు. (ముస్నద్ అహ్మద్)
విశ్వాసం మిమ్మల్ని వీడి పోతుంది జాగ్రత్త!
హజ్రత్ అబూ హురైరా (ర) కథనం - ప్రవక్త (స) ఇలా అన్నారు: “ ఒక మోమిన్ వ్యభిచారం చేసినప్పుడు విశ్వాస స్థితిలో ఉండడు. ఒక మోమిన్ మద్యం సేవించినప్పుడు విశ్వాస స్థితిలో ఉండడు. ఒక మోమిన్ దొంగతనం చేసినప్పుడు విశ్వాస స్థితిలో ఉండడు. (బుఖారీ, ముస్లిం) అంటే విశ్వాసం ఆ నీతిమాలిన స్థితిలో వేరయిపోతుంది.
గాయాల తోడు తాగుబోతుల కూడు
అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ ఇబ్న్ అల్-ఆస్ (ర) ఉల్లేఖన ప్రకారం, నేను అల్లాహ్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా చెప్పడం విన్నాను, “ఎవరైతే మద్యం సేవిస్తారో, అతని నమాజు నలభై రోజుల వరకు అంగీకరించబడదు. ." అప్పుడు అతను పశ్చాత్తాపపడితే, అల్లాహ్ అతని పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు. అతను మళ్లీ మద్యం సేవిస్తే, అల్లాహ్ నలభై రోజులు అతని ప్రార్థనను అంగీకరించడు. అతను తిరిగి మళ్ళి పశ్చాత్తాపపడితే, అల్లాహ్ అతని పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు. (అంతటితో ఆగక) మళ్ళీ మళ్ళీ తాగుతూ ఉంటే అల్లాహ్ కచ్చితంగా అతనికి నరకంలోని మనుషుల గాయాల తోడును తాగిస్తాడు.” (నసాయి, ఇబ్న్ మాజా)
స్వర్గ ప్రవేశం నిషిద్ధం
అబ్దుల్లా ఇబ్న్ అమ్ర్ ఇబ్న్ అల్-ఆస్ నుండి మరొక కథనం- ప్రవక్త, సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “మేలు చేసి ఎత్తిపొడుపు మాటల తూటాలతో దానగ్రహీత మనస్సు నొప్పించే వ్యక్తి స్వర్గంలోకి ప్రవేశించడు, . తల్లిదండ్రుల యెడల అవిధేయత కలిగినవాడు స్వర్గంలోకి ప్రవేశించడు. మద్యం, మత్తు పదార్థాలు సేవించేవాడు స్వర్గంలోకి ప్రవేశించడు” (నసాయీ, హదీథ్ నం. 5688)
అల్లాహ్ అభిశాపం తగులుతుంది
అబ్దుల్లా ఇబ్న్ ఉమర్ (ర) కథనం - దైవ ప్రవక్త (స) ఇలా అన్నారు: “అల్లా మద్యాన్ని, మత్తు పదార్థాలను శపించాడు.
మద్యం, మత్తు పదార్థాలు సేవించే వ్యక్తి మీద అల్లాహ్ అభిశాపం పడుతుంది.
మద్యం, మత్తు పదార్థాలు తాపించే వ్యక్తి మీద అల్లాహ్ అభిశాపం పడుతుంది.
మద్యం, మత్తు పదార్థాలు విక్రయించే వ్యక్తి మీద అల్లాహ్ అభిశాపం పడుతుంది.
మద్యం, మత్తు పదార్థాలు కొనిగొలు చేసే వ్యక్తి మీద అల్లాహ్ అభిశాపం పడుతుంది.
మద్యం, మత్తు పదార్థాలు - ద్రాక్ష,ఇతరత్రా వస్తువుల నుండి పిండే వ్యక్తి మీద అల్లాహ్ అభిశాపం పడుతుంది.
మద్యం, మత్తు పదార్థాలు తయారీదారుపై అల్లాహ్ అభిశాపం పడుతుంది.
మద్యం, మత్తు పదార్థాలు మోసుకెళ్లే వ్యక్తిపై అల్లాహ్ అభిశాపం పడుతుంది.
మద్యం, మత్తు పదార్థాలు ఎవరి కోసం మోసుకెళ్ళబడుతుందో వారిపై అల్లాహ్ అభిశాపం పడుతుంది.
(సునన్ అబి దావుద్, సంపుటి. 2, పేజీ. 161).
మనిషి మర్యాదను మంటగలిపే వెకిలి చేష్ట మద్యపాన సేవనం
హజ్రత్ అలీ (రజి) కథనం:- నా దగ్గర బద్ర్ యుద్ధ సొత్తు నుండి లభించిన ఒక ఒంటె ఉండేది. ఖుమ్స్ (యుద్ధసొత్తు) నుండి దైవప్రవక్త (సల్లం) ప్రసాదించిన మరొక ఒంటె కూడా నా దగ్గర ఉండేది. ప్రవక్త కుమార్తె హజ్రత్ ఫాతిమా (రజి)ను (వివాహమాడిన తరువాత) నా ఇంటికి పిలుచుకురావడానికి నిర్ణయించుకున్నప్పుడు, నేను బనీ ఖైనుఖా తెగకు చెందిన ఒక స్వర్ణకారునితో, అతను నా వెంట (అడవికి) వెళ్ళి అజ్జర్ గడ్డి తీసుకు రావాలని మాట్లాడుకున్నాను. అజ్జర్ గడ్డి స్వర్ణకారులకు అమ్మి ఆ డబ్బుతో నా పెళ్ళి విందు (వలీమా) చేసుకుందామని నేననుకున్నాను. ఆ సందర్భంలో నేను నా ఒంటెలకు సంబంధించిన అంబారీ, గడ్డిచిక్కం, త్రాళ్ళు తదితర సామగ్రిని సేకరించడం మొదలెట్టాను. నా ఒంటెలు రెండింటిని ఒక అన్సారీ ముస్లిం ఇంటి దగ్గర ఉంచాను. ఒంటెల సామగ్రి తీసుకొని వచ్చి చూస్తే నా ఒంటెల మూపురాలు కోయబడి ఉన్నాయి. వాటి పొట్టలు కోసి గుండెకాయలు తీసేసుకున్నారు. ఈ దృశ్యం చూసి నాకు ఏడ్పు వచ్చినంత పనయింది. ఈ పని ఎవరు చేశారని అడిగాను నేను. హజ్రత్ హమ్జా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ (రజి) అని జనం తెలియజేశారు. అప్పుడు హజ్రత్ హమ్జా (రజి) ఆ ఇంట్లో కొందరు అన్సారులతో కలసి మద్యం సేవిస్తున్నారు. నేను అక్కడ్నుంచి నేరుగా దైవప్రవక్త (సల్లం) సన్నిధికి వెళ్ళాను. ఆ సమయంలో ఆయన దగ్గర హజ్రత్ జైద్ బిన్ హారిస్ (రజి) కూర్చొని ఉన్నారు. దైవప్రవక్త (సల్లం) నా ముఖంలో కొట్టవచ్చినట్లు కన్పిస్తున్న నా మనోభావాన్ని చూసి “ఏమిటీ ఇలా తయారయ్యావు?" అని అడిగారు. “దైవప్రవక్తా! నాకీ రోజు కలిగినంత బాధ ఇదివరకెప్పుడూ కలగలేదు. హజ్రత్ హమ్జా (రజి) నా ఒంటెలపై దౌర్జన్యం చేశారు. వాటి మూపురాలు, పొట్టలు కోశారు. అక్కడ సమీపంలోనే ఒక ఇంట్లో కొందరు వ్యక్తులతో కలసి సారాయి త్రాగుతున్నారు” అని చెప్పాను నేను. దైవప్రవక్త (సల్లం) ఈ మాట వినగానే తమ దుప్పటి తెప్పించుకొని కప్పుకొని బయలుదేరారు. జైద్ బిన్ హారిస్ (రజి) కూడా ఆయన వెంట నడిచారు. దైవప్రవక్త (సల్లం) హమ్జా (రజి) ఉన్న ఇంటికి వెళ్ళి లోపలికి రావచ్చా అని అనుమతి అడిగారు. లోపల ప్రవేశించడానికి అనుమతి లభించింది. చూస్తే వారంతా మద్య సేవనంలో మునిగి ఉన్నారు. దైవప్రవక్త (సల్లం) అది చూసి హజ్రత్ హమ్జా (రజి)కు చీవాట్లు పెట్టారు. హజ్రత్ హమ్లా (రజి) కళ్ళు ఎరుపెక్కాయి. ఆయన సారా మత్తులో తూలుతూ తల పైకెత్తి దైవప్రవక్త (సల్లం) వైపు దృష్టి సారించారు. ఆయన మొదట దైవప్రవక్త (సల్లం) కాళ్ళ వైపు చూశారు. తరువాత మెల్లగా ఆయన నాభి వైపు, ఆ తరువాత ఆయన ముఖం వైపు చూశారు. ఆ తరువాత “మీరెంత? మీ విలువెంత? మీరు మా తండ్రిగారి బానిసలేగా!" అని అన్నారు. దైవప్రవక్త (సల్లం) ఈ పరిస్థితి చూసి “హమ్జా (రజి) ఇప్పుడు పూర్తి మత్తులో మునిగి ఉన్నార”ని భావించి అక్కడ్నుంచి వెనక్కి మరలి పోయారు. మేము కూడా ఆయన వెంట అక్కడ్నుంచి బయలుదేరాము. (సహీహ్ బుఖారీ)
మాట తూలితే అదృష్టం వెక్కిరిస్తుంది అంటారు. కాలు జారినా వెనక్కు తీసుకోవచ్చు కానీ, నోరు జారితే తీసుకోలేము. తన నోటి నుంచి వెలువడిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలకు హజ్రత్ అబ్బాస్ (ర) బేషరతుగా క్షమాపణలు చెప్పే ఉంటారు. . ఇంతకూ నోరు జారడం వల్ల ఆయన ఏమి సాధించినట్టు? ఇతరులను విపరీతంగా బాధించి అంతులేని మానసిక క్షోభకు కారణమైన మాటలకు, చేష్టలకు ప్రేరకం, అసలు కారణం ఆ సమయంలో ఆయన మద్యం సేవించి ఉండటమే. ఇది మద్య నిషేధం రాకముందు జరిగిన సంఘటన. . అంచేత మద్యం మత్తులో హజ్రత్ హమ్లా (రజి) వల్ల జరిగిన చేష్టలు నిలదీయదగిన విపరీత చేష్టలే, ఆయినా ప్రవక్త (స) ఆయన్ను ఏమి అనకపోవడం అనేది ఆయన ఫుల్లుగా త్రాగి మత్తులో తులతూగుతూ ఉండటమే కారణం. ఎందుకంటే ఆ సమయంలో ఏం చెప్పినా తలకెక్కదు గనక . బహుశా ఆయన హజ్రత్ అలీ (రజి)కి ఒంటెల నష్టపరిహారాన్ని చెల్లించి ఉండవచ్చు. అన్నారు ఇమామ నవవీ (రహ్మ).
మత్తులో స్వస్థత లేదు
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రబోధించినట్లు హజ్రత్ ఉమ్మె సలమా (ర.అన్హా) తెలియజేశారు : "అల్లాహ్ ఏ వస్తువునయితే మీ కొరకు నిషిద్ధంగా ఖరారు చేశాడో అందులో మీ కొరకు వ్యాధి నివారణను కలిగించే గుణాన్ని పొందు పరచలేదు.” (దీనిని బైహఖీ సేకరించారు, ఇబ్నె అబ్బాస్ దీన్ని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు)
మత్తులో పడవేసే వస్తువుల్లో 'రోగ నివారణ' లాంటి గుణాన్ని అల్లాహ్ ఏ మాత్రం పొందుపరచలేదని ఈ హదీసు స్పష్టపరుస్తోంది. కాబట్టి ఇలాంటి వస్తువులను చికిత్సగా ఉపయోగించటం కూడా అధర్మమే.
మత్తు మందు ఔషధం కాదు రోగం
హజ్రత్ వాయల్ హజ్రమీ (రజి) కథనం: తారిఖ్ బిన్ నువైద్ (రజి) దైవప్రవక్త సమక్షంలో ఔషధ నిమిత్తం తయారు చేసే మద్యం గురించి అడగ్గా "అది ఔషధం కానే కాదు, పైగా అదొక రోగం" అని ఆయన (స) సమాధాన మిచ్చారు. (దీనిని ముస్లిం, అబూ దావూద్, తదితరులు సేకరించారు) రోగానికి మందుగా మద్యాన్ని ఉపయోగించటం అధర్మం అని ఈ హదీసు చెబుతోంది. ఖుద్దుగా 'ఒక రోగం' అయిన వస్తువు రోగాన్ని ఎలా నయం చేస్తుంది?
మత్తు ఆదేశం
మత్తును కలిగించే ప్రతి వస్తువూ, 'ఖంర్ ' క్రిందికే వస్తుంది. మత్తును కలిగించే ప్రతి వస్తువూ హరామే (నిషిద్దమే)” అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఉద్బోధించినట్లు హజ్రత్ ఇబ్నె ఉమర్ (రజి) తెలిపారు. (ముస్లిం)
మత్తును కలిగించే వస్తువు ద్రవ రూపంలో వున్నా, ఘన పదార్థంగా వున్నా, ఆల్కహాలు రూపంలో ఉన్నా, మరే రూపంలో వున్నా సరే అది నిషిద్ధం అనటంలో ఎలాంటి సందేహం లేదని పై హదీసు ద్వారా అవగతమవుతున్నది.
మోతాదు ఎంత
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచించారని హజ్రత్ జాబిర్ (రజి) చెప్పారు: ఏ వస్తువు యొక్క అధిక మోతాదు మత్తునిస్తుందో, దాని అల్ప మోతాదు కూడా నిషిద్ధమే. (అహ్మద్ మరియు 'నలుగురు' దీనిని సేకరిం చారు. ఇబ్న్ హిబ్బాన్ ఈ హదీసును ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు)
ఎక్కువ మోతాదులో తీసుకున్న వస్తువు మనిషిని మత్తులో ముంచివేసినపుడు దాని తక్కువ మోతాదు కూడా నిషిద్ధమే మరి. అయితే హనఫీలు, బస్రాకు చెందిన ధర్మవేత్తల అభిప్రాయం మరోలా ఉంది. ద్రాక్ష, ఖర్జూరం తప్ప మత్తును కలిగించే స్థాయికి చేరని పానీయం ధర్మసమ్మతమేనని వీళ్లు భావిస్తున్నారు. కాని హదీసు మాత్రం వీళ్ల అభిప్రాయాన్ని త్రోసిరాజంటున్నది.
కొంచెం తాగినా ప్రమాదమేనా!
కొంచెం తాగుతున్నారా, అప్పుడప్పుడూ తాగుతున్నారా.... అన్నది విషయం కాదు. మద్యానికి ఎవరి శరీరం ఎలా? స్పందిస్తుందో తెలియదు. అందుకే తాగకుండా ఉండడానికే ప్రాధాన్యమివ్వమంటున్నాడు దాక్షన్లు. గతంలో అరవై ఏళ్లు దాటినవారిలో కప్పించే క్యాన్సర్లూ ఇతర ఆరోగ్య సమస్యలూ ఇప్పుడు ముప్ఫైల్లోనే కన్పించడానికి కారణం అదేనట.
ద్రాక్ష రసం త్రాగవచ్చా ?
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రజి) కథనం : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కోసం ఎండు ద్రాక్షపండ్లను నీళ్ల (తోలు) తిత్తిలో వేసి రసం తయారు చేయబడేది. ఆయన (సఅసం) ఆ పండ్ల రసాన్ని ఆ రోజు, మరుసటి రోజు కూడా త్రాగేవారు. మూడవ రోజు కూడా సేవిం చేవారు. మూడో రోజు పొద్దుగూకేసరికి త్రాగి, ఇతరులకు కూడా త్రాగేందుకు ఇచ్చేవారు. అప్పటికీ మిగిలిపోతే పార బోసేవారు. (ముస్లిం)
ఈ హదీసు ద్వారా తేటతెల్లమయ్యేదేమిటంటే మహాప్రవక్త (స) ద్రాక్ష రసాన్ని సేవించేవారు. అయితే ఆ రసంలో మత్తును ఇచ్చే గుణం పొడసూపితే మాత్రం దాన్ని పారబోసేవారు. ఎండు ద్రాక్షపండ్ల నుంచి తీసిన రసం మూడు రోజుల వరకూ ఎట్టి పరిస్థితిలోనూ హలాల్ (ధర్మ సమ్మతం) అని దీని మతలబు ఎంతమాత్రం కాదు. మత్తును కలిగించకుండా ఉన్నంతవరకూ ఉపయోగించవచ్చన్న అర్ధంలో దీన్ని తీసుకోవాలి.
మహాత్ములకు మత్తు మకిలి అంటించే ప్రయత్నం
మత్తు పుట్టించు ద్రాక్షారసము వాడుకను బైబిల్ అనుమతించ లేదు. కానాలోని వివాహవిందులో క్రీస్తు చేసిన ద్రాక్షారసము ద్రాక్ష పండ్ల నుండి తీయబడిన స్వచ్ఛమయిన రసము. “ద్రాక్షగెలలో క్రొత్త రసము” పైగా బైబిల్ ఇలా అంటుంది;
“ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును. మద్యము అల్లరి పుట్టించును. దాని వశమైన వారందరు జ్ఞానము లేనివారు.”
ఎవరికి శ్రమ? ఎవరికి దుఃఖము? ఎవరికి జగడములు? ఎవరికి చింత? ఎవరికి హేతువులేని గాయములు? ఎవరికి మంద దృష్టి? మందు బాబులకే ఇంకెవ్వరికి? మందు కొడితే ఎవరికీ వారే మహారాజుల్లా ఫీలవుతారు. మరి మత్తు వదిలితే.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే... అన్నట్టు కొందరు మురికి కాలువలో పడి ఉంటారు.. కొందరు ఆరుబయట అంగాంగ ప్రదర్శనలతో దర్శనిమిస్తారు. కొందరు వీధి కుక్కల సరసన చేరి ఉండటం కనబడుతుంది.
మత్తుకి బానిసయిన వ్యక్తికీ ప్రపంచంలో విధించే శిక్ష
మద్యం సేవించిన వ్యక్తి గురించి దైవప్రవక్త (సఅసం) ఈ విధంగా ప్రవచించినట్లు హజ్రత్ ముఆవియా (రజి) చెప్పారు - "అతడు మద్యం సేవిస్తే కొరడా దెబ్బలు కొట్టండి. మలి సారి కూడా త్రాగితే మళ్ళీ కొరడా దెబ్బలు కొట్టండి. మూడవసారి కూడా త్రాగితే మళ్లీ కొరడా దెబ్బలు కొట్టండి కాని నాల్గవసారి గనక మద్యం సేవిస్తే శిరచ్ఛేదనం చేయండి.” (దీనిని అహ్మద్ వివరించారు - వాక్యాలు కూడా ఆయన గారివే. 'నలుగురు' కూడా ఈ హదీసు ను ఉల్లేఖించారు. తిర్మిజీ వివరించిన తీరునుబట్టి అతన్ని వధించే విషయం రద్దు చేయబడిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని అబూ దావూద్ స్పష్టమయిన కథనంతో జుహ్రీ నుండి సంగ్రహించారు.
మత్తు పదార్థాల తయారీకి ప్రత్యేక వసువులు ఉంటాయా?
హజ్రత్ ఉమర్ (రజి) కథనం : మద్యనిషేధాజ్ఞ అవతరించింది. ఆనాడు అయిదు వస్తువులతో అది ఉత్పత్తి చేయబడేది - ద్రాక్ష, ఖర్జూరం, తేనె, గోధుమలు, యవలు. మరియు ఖమ్ అంటే బుద్ధి వివేకాలను ఆవరించే అన్ని రకాల వస్తువులు. (బుఖారీ, ముస్లిం)
సారాయి ఉత్పత్తికి దోహదపడే అయిదు వస్తువుల ప్రస్తావన ఇందులో వచ్చింది. ఆనాడు మద్యం తయారీకి సాధారణంగా ఈ పదార్థాలనే ఉపయోగించేవారు. మనిషి బుద్ధి వివేకాలను క్రమ్మివేసి, మనోమస్తిష్కాలకు మత్తును, కిక్కును ఎక్కించే వస్తువులను ఆ రోజుల్లో 'ఖమ్'గా (ఈ రోజుల్లో గుడుంబా, నాటు సారాయిలాగా) వ్యవహరించేవారు. అందుకే మద్యం ఖర్జూరపండ్ల నుండి తీసినా, ద్రాక్ష ద్వారా ఉత్పత్తి చేసినా అది నిషిద్ధం అనటంలో సందేహానికి తావులేదు.
యువతపై తీవ్ర ప్రభావాలు
యుక్త వయసు పిల్లల్లో విపరీతమైన ఉత్సాహం ఉంటుంది. పలురకాల సాహసాలు చేయాలని మనసు ఆరాటపడుతుంది. ఆది వారిని మత్తు పదార్థాల వైపు నడిపించే ప్రమాదం ఉంది. మొదట స్నేహితులతో సరదాగా ప్రారంభమై, తరవాత వ్యసనంలా మారుతుంది. చివకు జీవితాన్ని నాశనం చేస్తుంది. మత్తు పదార్థాలు తీసుకున్నాక మెదడులో డోపమైన్, సెరటోనిన్ అనే ఉత్ప్రేరకాలు విడుదలవుతాయి. వాటివల్ల హుషారుగా, ఉత్తేజంగా ఉన్నట్టు అనిపిస్తుంది. తల్లిదండ్రులు పిల్లల నడవడికను గమనిస్తూ ఉండాలి. వారు చెడుదారుల్లోకి వెళ్లకుండా వారే తగిన జాగ్రత్త వహించాలి.
తాగితే ఏమవుతుంది?
మద్యం తాగినప్పుడు రెండు రకాల ప్రభావం కన్పిస్తుంది. తాగిన వ్యక్తికి మానసికంగా కలిగే హాయి ఒక రకమైతే.. అది లోపలికి వెళ్లి శరీరంలో కలిగించే మార్పులు ఇంకో రకం. తాగేటప్పుడూ. ఆ తర్వాతా... రిలాక్స్ గా మత్తుగా ఉంటుంది. ఎవరేమనుకుంటారోననే సంకోచం లేకుండా తోచినట్లు ప్రవర్తిస్తారు. ఆ స్వేచ్ఛ వారికి అనందాన్నిస్తుంది. అది బాగుంది కదా అని ఇంకాస్త తాగితే మాట తడబడుతుంది చూపు వినికిడిలో తేడా వస్తుంది. దాంతో మనుషుల్ని వస్తువుల్ని గుర్తుపట్టలేరు. వాంతులవుతాయి, తల తిరుగుతుంది. కొంతమందికి విరేచనాలవుతాయి. రెండు రోజులపాటు తలనొప్పి వేధిస్తుంది. తరచూ మద్యం సేవించేవాళ్లు దానికి అలవాటుపడిపోతారు. దాంతో మొదట్లో ఉన్నంత కేక్ తర్వాత ఉండదు. అందుకని మోతాదు పెంచుతూ పోయి క్రమంగా దానికి బానిసలైపోతారు. తాగకుండా ఉండలేని దశకు చేరుకుంటారు. తాగి గమ్మున పడుకుంటే తెల్లారేసరికి మామూలైపోతుందనుకుంటారు. కానీ అలా జరగదు. కడుపులోకి చేరిన ఆ విషాన్ని తక్షణం. బయటకు పంపడానికి శరీరంలోని వివిధ అవయవాలు పెద్ద యుద్ధమే చేస్తాయి. మనం మరో విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు త్రాగుడు ప్రచారానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. సినిమాల్లో, వీడియోల్లో ప్రచారం చేస్తున్నారు. అది అన్ని చోట్లా ప్రత్యక్షమౌతోంది. ‘మీరు తాగకపోతే ఇంకెందుకు బ్రతుకు’ అన్నట్లుగా సమాజం భావిస్తున్నది.
కారణాలు
అభం శుభం తెలియని పసి మనసులు మత్తిల్లుతున్నాయి! ఉరకల పరుగుల యువ మెదళ్లు జోగుతున్నాయి!! మానసిక ఒత్తిళ్ల ప్రభావమో.. తోటివాళ్ల ప్రోద్బలమో.. తల్లిదండ్రుల నిర్లక్ష్యమో.. దుర్మార్గుల స్వార్ధమో.. కారణమేదైతేనేం? పిల్లలనూ యువతనూ మత్తుమేఘాలు కమ్మేసుకుంటున్నాయి. చాటుమాటు అంగళ్లు దాటుకొని పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాలకూ మాదకద్రవ్యాలు విస్తరిస్తున్నాయి. ఛాలెట్లో డ్రగ్స్, జామ కాయ కారంలో డ్రగ్స్ ….. కొందరు విద్యార్థులు వీటి కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నట్టు వెలువడుతున్న కథనాలే దీనికి నిదర్శనం. దీంతో ఎక్కడ్నుంచి ఏ మాదకద్రవ్యం తమ చిన్నారులపై విరుచుకు పడుతుందోనని తల్లిదండ్రుల గుండెలు బిక్కుబిక్కుమంటున్నాయి.
ఎందుకంటే తెలిసో తెలియకో ఒకసారి మాదకద్రవ్యాల రుచి మరిగితే, అవి వ్యసనంలా మెదళ్లకు అంటుకుపోతే.. పిల్లల భవిష్యత్తే అంధకారంలో పడిపోతుంది. మానసిక వికాసమే కాదు శారీరక ఆరోగ్యమూ కుంటుపడుతుంది. ఆలోచనా రీతులు, ఉచితానుచిత విచక్షణ, ప్రవర్తన తీరుతెన్నులను సమూలంగా మార్చేసే మాదకద్రవ్యాలు పిల్లలనే కాదు.. మొత్తం సమాజాన్నీ అతలాకుతలం చేస్తాయి. ఇప్పటికైనా మేల్కోకపోతే మన బంగారు భవిష్యత్తులు మన కళ్లముందే.. 'గమ్మత్తుగ మత్తులో చిత్తవటం ఖాయం.
మత్తు అనేక రకాలు
మద్యం మత్తును కలిగిస్తుంది. కాని కాసేపట్లో ఆ మత్తు దిగిపోతుంది. స్వార్థం కూడా మత్తును కలిగిస్తుంది. కాని అది అంత తొందరగా వదిలిపోయేది కాదు. కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే ఎక్కే మత్తు అది. అవినీతి, దోపిడి, అహంకారం అనేవి మద్యం కన్నా ఎక్కువ మత్తునిస్తాయి. ఇవి ప్రమాదకరమైనవి, భయంకరమైనవి.
ప్రపంచంలో చాలామందికి డబ్బంటే వ్యామోహం. డబ్బే ప్రపంచాన్ని నడిపించేది. డబ్బే మనిషికి మనిషికి మధ్యన అంత:స్సూత్రంలా పనిచేస్తుంది. సమాజాన్ని ముందుకు నడిపించే దిక్సూచి అదే. కాని ఆ డబ్బే ఎందరినో విడదీస్తుంది. ఎంతకైనా దిగజారేలా చేస్తుంది. కొందరు మద్యానికి బానిసలవుతారు. క్లబ్బుల్లో, మందుషాపుల్లో తాగి, జల్సాలు చేస్తూ తిరుగుతుంటారు. వాళ్ళకు కుటుంబం మీద, జీవితం మీద ఆలోచన అసలే ఉండదు. ఎప్పుడూ తాగడం, తూలడం, ఇలా.. కొందరికి డబ్బంటే వ్యామోహం. మరికొందరికి క్లబ్బంటే వ్యామోహం. కాని ఈ లోకంలో అందరికి స్వార్థమే అసలైన నిషా. స్వార్థం కోసం ఏ పనైనా చేస్తారు. ఎవరినైనా పడదోస్తారు. ఎవరి కాళ్ళైనా పట్టుకుంటారు.
లోకంలో కొందరికి పదవి మత్తు ఉంటుంది. ఆ పదవి వల్ల అధికారం వస్తుంది. ఎవరినైనా శాసించవచ్చు. తమ చెప్పు చేతల్లో పెట్టుకోవచ్చు. అందుకే అధికారం లేనిదే జీవితమే లేదన్న భావనతో బతుకుతారు. కొందరికి పెదవి మత్తు. (శృంగారం అంటే వ్యామోహం). కాని ఈ లోకంలో అందరికి యవ్వనమే గొప్ప నిషానిస్తుంది. యవ్వనంపై అందరికి వ్యామోహమే. అది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, టెలిగ్రామ్, వీడియో గేమ్స్, ఆన్లైన్ ఆప్స్ --- ఇవి కూడా మత్తు కోవకు చెందినవే.
సమాజంలో కొందరికి వధువు మత్తు, కొందరికి మధువు మత్తు. వధువు కోసం వేటలో ఉంటారు. తనకు నచ్చిన అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలి. తాను పెళ్ళి చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలో ముందే అంచనాలు వేసుకుంటారు. పెళ్ళి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలన్న ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. మరికొందరికి మధువంటే పిచ్చి. తాగుడుకి దాసోహం అంటారు. వధువు, మధువు కొందరికైతే, లోకంలో మరి కొందరికి చీకటి మత్తు. చీకటిలో చేసే పని ఏదీ ప్రపంచానికి తెలియదు. . దోపిడీ, అక్రమ రవాణా, దురాచారాలు, అసాంఘిక కార్యకలాపాలు మొదలైనవి ఏవైనా కావచ్చు. అన్నింటికి చీకటే చిరునామా. చీకట్లోనే మేడలు నిర్మించబడతాయి. కూల్చబడతాయి కూడా. అందుకే.. చీకటి భలే మత్తు గలది.
పరిష్కారం ఏమిటి?
మీకు పెరుగుతున్న పిల్లలు ఉంటే, వారిని ఆటల్లోనూ, కొండలు ఎక్కడం, ఈతకొట్టడం లాంటి శారీరక శ్రమ కలిగించే పనులను చేయించాలి. వారికి సత్గ్రంథ పఠనం, వేరే కళలు, దేనిమీదైనా ఆసక్తి కలిగేలా చూడాలి. వారు తమ తెలివితేటలు, మనోభావాలు చవిచూడకలగాలి. ఎప్పుడైతే వారు తమ చురుకుదనం, తెలివితేటలు, మనోభావాల ద్వారా వచ్చే సంతోషాన్ని ఆస్వాదిస్తారో, తమ శారీరక సుఖాల కోసం వారు వెతుక్కోవటం సహజంగానే అప్పుడు చాలా తక్కువ అవుతుంది. పిల్లలు చాలా ఆసక్తిగా అనేక ఇతర కార్యకలాపాలలో నిమగ్నం కావాలి. అప్పుడు సహజంగా వారికి మత్తు పదార్థాల అవసరం తగ్గుతుంది.
అధికశాతం ప్రపంచ దేశాలలో ఉన్న సార్వత్రిక ప్రభుత్వ పాలనా వ్యవస్థలలో ఏకగ్రీవంగా విఫలమైపోయిన “చట్టం” ఏదైనా ఉందంటే అది ఒక్క ‘మద్య నిషేధ చట్టమే’ అనటం అతిశయోక్తి కాదేమో! ప్రజాశ్రేయస్సును పెంపొందించే సాంఘిక వ్యవస్థను నిర్మించాల్సింది రాజ్యమేనని 38వ రాజ్యాంగ అధికరణ ఉద్బోధిస్తోంది. ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం రాజ్యం కర్తవ్యమని, అందుకోసం మత్తుపదార్థాల సేవనాన్ని నిరోధించాలని 47వ అధికరణ నిర్దేశిస్తోంది. ఈ విద్యుక్తధర్మాల నిర్వహణలో ప్రభుత్వాల పనితీరును తరచిచూస్తే- కడుపు చించుకుంటే కాళ్ల మీద పడినట్లవుతుంది. ముఖ్యంగా యువభారతం భవిష్యత్తుకు అతిప్రమాదకరమైన మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడంలో సర్కారీ యంత్రాంగం దారుణంగా విఫలమవుతోంది. దాంతో బడి పిల్లల నుంచి ఉన్నతోద్యోగుల వరకు చాలామంది మత్తుమందులకు బానిసలవుతున్నారు. శిక్షల భయం ఉన్నచోట తప్పు చేయడానికి ఎవరూ సాహసించరు. అటువంటి వాతావరణానికి మన దేశం మొహం వాచింది కాబట్టే అమానుష నేరగాళ్లెందరో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. జంకుగొంకు లేకుండా డ్రగ్స్ దందాలకు పాల్పడుతూ, జాతిని రోగగ్రస్తం చేస్తున్న పరమ దుర్మార్గులూ స్వేచ్ఛగా సంచరిస్తున్నారు.. పేరుకు కేసులు కడుతున్న పోలీసులు- అపరాధులకు తగిన శిక్షలు విధింపజేయడంలో చేతులెత్తేస్తున్నారు. దేశీయంగా మాదక రక్కస్ స్వైరవిహారానికి అదే ప్రధాన కారణమవుతోంది!
ప్రవక్త ముహమ్మద్ (స) ఆవిర్భవించాక 13 ఏళ్ల తరువాత గానీ మద్యాన్ని మీరు త్రాగటం మానేయ్యాలనే ఆజ్ఞ పూర్తి స్థాయిలో అవతరించలేదు. మరి ఆ పదమూడేళ్ళ కాలం దేనికంటే- ప్రజల ఆలోచన ధోరణిలో నైతికంగా మార్పును తీసుకురావటం. ఒకవేళ ముహమ్మద్ (స) ప్రవక్తగా ఎన్నికైన ప్రారంభ దినాల్లోనే మద్య నిషేధ చట్టం తీసుకొస్తే అప్పుడు కూడా అమెరికాలో జరిగిన పరిణామాల్లాంటివే సంభవించి ప్రజల తీవ్ర వ్యతిరేకతతో ఆ చట్టం ప్రారంభంలోనే ముగిసిపోయి ఉండేదేమో! అందుకే ఆ పదమూడేళ్ళ కాలంలో నిషా స్థితిలో ఉండగా నమాజ్ దరిదాపులకు వెళ్లొద్దు (4:43) అని, మద్యపానం వల్ల లాభం కంటే కీడే ఎక్కువగా ఉంది (2:219) అని పూర్తి స్థాయిలో ఖండిచకపోయినా అది దేవునికి అయిష్టమైన విషయంగా తెలియజేస్తూ ప్రజల ఆలోచనలో మార్పు అన్నది వచ్చాక, పూర్తి స్థాయిలో మద్య నిషేధ చట్టం తేవటం జరిగింది (5:90). అది త్రాగటానికి, అమ్మకానికి వీలు లేదన్నప్పుడు ప్రజలు మనస్ఫూర్తిగా ఆ చట్టాన్ని గౌరవించించారు. ఆ తరువాత జరిగింది ఏమిటంటే నిత్యం మద్యం మత్తులో తూగుతూ ఉండే ఆ జాతి పుర వీధుల్లో సారాయి ప్రవహించింది. ఆ విధంగా చరిత్రలో మద్య నిషేధం అన్న చట్టం తీసుకొచ్చి విజయవంతంగా అయిన మరియు దానిని కొనసాగిస్తున్న వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఒక్క ఇస్లాం మాత్రమే!
చక్కటి పరిష్కారం అల్లాహ్ ధ్యానం
ఎప్పటికి దిగిపోని మత్తు కలిగించే స్వార్థం, అవినీతి వంటి భయంకరమైన పదార్థాల ముందు మద్యం ఎంత? ప్రతి మనిషి తనకు తెలిసో, తెలియకో ధనం మత్తులోనో, అహం మత్తులోనో, పదవి మత్తులోనో తూలిపోతాడు. వాటిని వదిలించుకుని నిజమైన, నిస్వార్థమైన మనిషిగా ముందుకు నడవాలి. దానికి ఫలవంతమైన మార్గం అల్లాహ్ ధ్యానం.
మద్యం, జూదాల ద్వారా షైతాన్ మీమధ్య విరోధం, విద్వేష బీజాలు నాటి మిమ్మల్ని అల్లాహ్ ధ్యానం, ప్రార్థనల నుండి నిరోధించగోరుతున్నాడు. కనుక ఇకనైనా మీరు వాటిని మానుకోండి. దైవాజ్ఞలను, ఆయన ప్రవక్త హితవుల్ని పాటించండి. వాటిని పాటించకుండా ముఖం తిప్పుకుంటే మాత్రం (మీకే నష్టం), ఆదేశాన్ని యధాతథంగా అందజేయడమే మా ప్రవక్త బాధ్యత. (అల్-మాయిదా : 91-92)
మన వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా వికసింపజేసే ప్రక్రియ- అల్లాహ్ ధ్యానం. ఆందోళన, అలజడి లేని మనసును సాకారం చేసుకోవడానికి అల్లాహ్ ధ్యాన ప్రక్రియ ఉపకరిస్తుంది. సహజమైన ఆనంద స్థితిని ఆస్వాదించడానికి అల్లాహ్ ద్యాన మార్గం శ్రేష్టమైంది. వర్తమానంలో ఎలా జీవించాలో, అల్లాహ్ ప్రసాదించిన జీవితాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో అల్లాహ్ ధ్యానం నేర్పిస్తుంది. 'అల్లాహ్ జిక్ర్ ' అంటే అత్యున్నతమైన తాదాత్మ్య స్థితి. ప్రగాఢమైన అనుభూతి. ఎవరిని వారు ఉద్దరించుకోవడానికి ఉపయోగపడే కరదీపిక.
మనసు మర్కటం లాంటిది. నిరంతరం సంచరిస్తుంది. కళ్లెంలేని గుర్రంలా పరిగెడుతుంది. తెగిన గాలిపటమై స్వేచ్ఛా విహారం చేస్తుంది. అంతులేని ఆలోచనలతో, అంతుచిక్కని ఆవేదనలతో సతమతమవుతుంటుంది. అలాంటి సంచలితమైన మనసును ఒడిసిపట్టడానికి ధ్యానసాధన చేయాలి. మనసును పవిత్రం చేసి, పరిశుద్ధంగా ఆవిష్కరించేదే- ధ్యానం! అనిశ్చితికి, ఆశలకు దూరంగా వెళ్తూ, ప్రతి క్షణాన్ని లోతుగా అనుభూతి చెందడానికి ధ్యానం అపురూప మాధ్యమం. ధ్యానం ద్వారా మన శరీరమే శక్తి కేంద్రంగా భాసిస్తుంది.
అంతర్గత శక్తులన్నీ ఏకీకృతమై విలసిల్లుతాయి. శ్వాస మీద ధ్యాసను నిలపడం ద్వారా ధ్యానం సాకారమవుతుంది. గాఢమైన విశ్రాంతి స్థితిని ఆవిష్కరింపజేసుకోవడానికి ధ్యాన ప్రక్రియ ఆలంబనగా నిలుస్తుంది.
అనారోగ్యం లేని దేహం, ఒత్తిడి లేని మనసు, ప్రశాంత జీవన సంవిధానాల్ని అందరూ అభిలషిస్తారు. ఆ అభీష్టం నెరవేరాలంటే ముందు ఎవరిని వారు సంస్కరించుకోవాలి. అంతర్ముఖంగా, లోలోనికి చూస్తూ, అంతర్వాణిని వినగలగాలి. ఆంతరంగికమైన వెలుగును దర్శించాలి. సమాజం పట్ల ప్రేమాస్పద భావాల్ని పెంపొందించుకోవాలి. ఇలాంటి సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవడానికి ధ్యానం అద్భుత ఉపకరణం. ధ్యానం చేసే కొద్దీ జ్ఞానం ఉద్దీపన చెందుతుంది. జ్ఞానం వృద్ధి చెందితే, ఆత్మశక్తి బలోపేతమవుతుంది. ఆ ఆత్మవిశ్వాసంతో మనిషి ఇహపరాల విజయ కేతనాన్ని ఎగురవేయవచ్చు.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment
ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు