Tuesday, November 23, 2021

వినాశకర ఉపద్రవాలు - పండితుల ఫత్వాలు' అనే పుస్తకంలో నుండి ముఖ్యమైన ఫత్వాలు సంక్షిప్తంగా

 

 సేకరణ మరియు కూర్పు : షేఖ్ ముహమ్మద్ బిన్ హుసైన్

 పున:పరిశీలన : షేఖ్ సాలెహ్ ఫౌజాన్ అల్  ఫౌజాన్, (సుప్రీమ్ ఉలమా కౌన్సిల్ సభ్యులు)

అనువాదం: సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమరీ 

  


01) హర్తాళ్ళ గురించి ఆదేశం

ధర్నా, హర్తాళ్ళు  అవి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నా, ప్రవేటు సంస్థలకు వ్యతిరేకంగా ఉన్నా - వీటి కోసం షరీయతు పరమైన ఎలాంటి అనుమతి లేదు. ధర్నాల్లో, హర్తాళ్ళలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం వల్ల వారి న్యాయ అవసరానికి మించిన నష్టం వాటిల్లుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇమామ్ ముహమ్మద్ బిన్ సాలెహ్ అల్ ఉసైమీన్ (రహ్మతుల్లాహి అలైహ్) :

 

02) అత్మహుతి దాడుల ఆదేశం

కొందరు పేలుడు పదార్థాలు ధరించి ముస్లిమేతరుల మధ్యకు వెళ్ళి పేల్చుకుంటూ ఉంటారు. ఇది ముమ్మాటికీ ఆత్మహత్యే. ఇలా తన్ను  తాను చంపుకునే వారు శాశ్వితంగా నరకంలో ఉంటారు. ప్రవక్త (స) వారి ఈ ప్రవచనం ఆధారంగా (బుఖారీ, కితాబులిబ్,బాబు షుర్బిస్సుమ్ వద్దవా..)

 

వాస్తవంగా అతను ఇస్లాం ధర్మం కోసం ప్రాణాలు కోల్పోలేదు, అలాగే పదుల, వందల సంఖ్యలో అమాయక ప్రజల్ని పొట్టన బెట్టుకున్నాడు. ఇలాంటి విధ్వంసకర చేష్టల వల్ల ఇస్లాం ధర్మానికి ఒరిగేదంటూ ఏమీ ఉండదు పైగా ఇస్లాం వంటి సంపూర్ణ జీవన సంవిధానం సందిగ్గాల మధ్య అపార్థం పాలవుతుంది.

కాబట్టి  ఇట్టి ఏ చర్య అయినా "శాశ్వతంగా నరకానికి ఆహుతి చేసే ఆత్మహత్యతో సమానమే. (అల్లాహ్ కాపాడుగాక!) ఇలాంటి వ్యక్తి షహీద్ అనబడడు. అతని మరణం షహాదత్ మార్గం మీద జరగనే లేదు.

ఇమామ్ ముహమ్మద్ బిన్ సాలెహ్ అల్ ఉసైమీన్ (రహ్మతుల్లాహి అలైహ్)

 

03) కాఫిర్ అని చెప్పడం యొక్క ఆదేశం

ఒకర్ని అవిశ్వాసి 'కాఫిర్' అని ప్రకటించడం, పూర్తిగా షరీయతు సంబంధించిన అంశం, అలా నిర్ధారించే హక్కు కేవలం అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్త (స) కు మాత్రమే ఉంటుంది. ఒకరి ప్రతి మాటను, ప్రతి చేష్టను ఆధారంగా చేసుకొని కుఫ్ర్  ఫత్వా ఇవ్వడం, అతను ముస్లిం సంఘం నుండి వేరయిపోయాడు అనడం సమంజసం కాదు. ఒకరిని అవిశ్వాసి అని తీర్మానించే పూర్తి అధికారం అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్త (స) కుమాత్రమే ఉంటుంది. కాబట్టి మనం ఒకరిని ఇతను 'కాఫిర్' అని అనకూడదు. ఖుర్ఆన్ మరియు హదీసు స్పష్టమైన ఆధారాల వెలుగులో ఒకరిని అవిశ్వాసి అనడంలో అభ్యంతరం లేదు. ఒకరి విషయంలో కేవలం అనుమానం ఆధారంగా అలా అనేయడం గర్హనీయం. తద్వారా తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయి.

సుప్రీమ్ ఉలమా కౌన్సిల్ తీర్మానం: అల్లామా,ముహద్దిస్ షేఖ్ నాసిరుద్దీన్ అల్బానీ (రహ్మతుల్లాహి అలైహ్) :

 

ఒక వ్యక్తిని అతను చేసే నేరాలు, పాపాల ఆధారంగా కాఫిర్ అని తీర్మానించే అనుమతి లేదు, ఆవ్యక్తి హృదయ స్థితి తెలుసుంటే తప్ప.నిజంగా అతను ఉద్దేశపూర్వకంగానే అల్లాహ్ నిషేధించిన వాటిని నిషేధితాలుగా నమ్మడం లేదు అన్న నిర్ధారణ జరిగితే గానీ అలా చేయడానికి అనుమతి లేదు.

కాబట్టి, సదరు వ్యక్తి నిజంగానే అల్లాహ్ దస్తూరిని వ్యతిరేకిస్తున్నాడు అన్న నిర్ధారణ జరిగితే, అతను కాఫిర్,

ధర్మం నుండి వైదొలిగాడు అనడంలో అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇలా అనే వారిని ప్రవక్త (స) హెచ్చరించారు. " ఒక వ్యక్తి తన సోదరుణ్ణి 'ఓ కాఫిర్! అని సంభోదిస్తే, ఆ మాట ఇద్దరిలో ఒకరి విషయంలో నిజమవుతుంది." (బుఖారీ,ముస్లిం)

 

04) పండితుల్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసే ఆదేశం -

గౌరవనీయ పండితులు - షేఖ్ సాద్ బిన్ అలీఖ్, షేఖ్ ముహమ్మద్ బిన్ ఇబ్రాహీం, షేఖ్ ఉమర్ బిన్ సలీం, షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్లతీఫ్ మరియు షేఖ్ అబ్దుల్లాహ్ అల్ అంగరీ రహిమహుముల్లాహ్

చెప్పిన మాట :

 

పండితుల విషయంలో పరోక్ష నిందకు పాల్పడటం, వారి లోపాలను ఎంచే నిమిత్తం రంధ్రాన్వేషణ చేయడం, ముస్లింల మానం మర్యాదలతో చెలగాటమాడటం ప్రాణం తీసే విషంతో సమానం. భయంకరమైన రోగం, మరియు ఘోరమైన పాపం. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: " తప్పు చేయని విశ్వాసులైన పురుషులను, విశ్వాసులైన స్త్రీలను వేధించేవారు (చాలా పెద్ద) అభాండాన్ని,

స్పష్టమైన పాపభారాన్ని మోపిన వారవుతారు". (అల్ అహ్ జాబ్ : 58)

 

ఓ కవి అన్నట్టు : - మీ నాశనం గాను! వారిని తూలనాడటం మానండి. లేదా వారు పూరించి ఉన్న ఉన్నత స్థానాల్నయినా భర్తీ చేయండి (వారు చేసి ఉన్న ఘనకార్యాలను మీరు చేసి చూపించండి)

న్యాయ దృష్టిగల ఏ వ్యక్తి అయినా సరే, పై పేర్కొనబడిన ఖుర్ఆన్ వచనాలు హదీసు ప్రవచనాలు, మేధావుల మాటలు, నిపుణుల సలహాలు విన్న తర్వాత రేపు ప్రళయ దినాన అల్లాహ్ సమక్షంలో హాజరయి తాను చేసిన ప్రతి కర్మకు సంఝాయిషి ఇచ్చుకోవాల్సి ఉంటుంది అన్న స్పృహ ఉన్న ప్రతి వ్యక్తి ఇతరుల మీద దృష్టి పెట్టడం మాని, స్వీయ సంస్కరణ మీద దృష్టిని కేంద్రీకరిస్తాడు.

 

05) ముస్లిం మరియు ముస్లిమేతర దేశాల్లో బాంబు పేలుళ్ళ ఆదేశం

రియాజ్ పట్టణంలోని 'ఉల్యా' ప్రాంతంలో జరిగిన పేలుళ్ళ నేపథ్యంలో సుప్రీమ్ ఉలమా కౌన్సిల్ ఇచ్చిన తీర్పు:

 

కౌన్సిల్ తీర్మానిస్తూ చెప్పిన మాట - ఇటువంటి దాడులు మహా భయంకర నేరం,ద్రోహం, శాంతి విఘాతక చర్య.దేశ శాంతి భద్రతలను,

ధర్మం, ధనం, ప్రాణ రక్షణను విచ్ఛిన్న పరచే మహా నేరం.  ఈ రాక్షస క్రీడ - మదినిండా ఓర్పలేనితనం, అసూయ,ద్వేషం,పగ, శత్రుత్వం, మంచి అంటేనే మంట వంటి అవలక్షణాలు గల మహా పాపిష్టి, పరమ దుర్మార్గుడి పనే అయి ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటువంటి దాడులు మహా నీచమైనవి, ఘోరమైన పాపం అన్న విషయంలో ముస్లింల మధ్య ఎలాంటి భేదాభిప్రాయం లేదు. ఇవి, ఇటువంటి ఇతర చేష్టలను, నేరాలను, ఘోరాలను ఖుర్ఆన్ మరియు హదీసులు కూడా ఖండిస్తాయి అన్న విషయమూ విదితమే.

పాప భూయిష్టమైన, నేరపూరితమైన ఇటువంటి చర్యలను ఉలమా కౌన్సిల్ అధర్మంగా తీర్మానించడమే కాక, ఇటువంటి అమానవీయ,దుర్బుద్ధి, దుష్ట మార్గాలకు, సిద్ధాంతాలకు, నమ్మకాలకు అందరూ దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేసుకుంటున్నది.

మనిషి మనసు అతన్ని చెడు వైపుకే లాగుతుంది అన్నది యదార్థం. మనిషి మనసు చేతుల్లో బంధీ అయితే, అది అతన్ని వినాశకర మార్గాల మీదకు ఈడ్చుకెళుతుంది. అప్పుడు రాబంధువుల్లా కాచుకొని కూర్చున్న శాంతి విఘాతక శక్తులు అతన్ని అందమైన పదజాలం, ఆర్థిక లాభాలతో ఆకర్షించి, తమ తుచ్ఛ ప్రయోజనాల కోసం పావుగా వాడుకోవడం సులభమైపోతుంది.

 

06) ముస్లిం పాలకులకు వ్యతిరేకంగా విద్రోహ చర్య ఆదేశం

షేఖుల్ ఇస్లాం ఇబ్ను తైమియా (రహ్మతుల్లాహి అలైహ్) : అహ్లుస్సున్నహ్ వల్ జమాఅహ్ యొక్క ప్రసిద్ధ పంథా ఏమిటంటే, వారు- సంఘం నుండి వేరు పడటం,కత్తితో యుద్ధం చేయడాన్ని సుతరామూ అనుమతించరు. ఒకవేళ నిజంగానే పాలకులు, ప్రభుత్వం తరపు నుండి దౌర్జన్యం జరుగుతున్నా కూడా, ప్రవక్త (స) వారి ప్రసిద్ధ హదీసు దీనికి ఆధారంగా ఉంది. ఎందుకంటే గొడవలు, కలహాలు, అల్లర్లు - పాలకులు చేసే దౌర్జన్యం కన్నా ఎక్కువ ప్రమాదం. ఒక పెద్ద ఉపద్రవాన్ని చిన్న చిన్న ఉపద్రవాలను లేవనెత్తి నిర్మూలించగలగడం అసంభవం.(చెడును మంచితో నిర్మూలించాలి). మానవ చరిత్ర సయితం ఇచ్చే సాక్ష్యం ఏమిటంటే, ఎక్కడ ఎప్పుడు ఎవరయినా ఇలాంటి విద్రోహ చర్యలకు పాల్పడి, వ్యతిరేక నినాదాలు చేసి ఉన్న దుస్థితిని దూరం చేయడం కాదు కదా మరింత దుర్భర స్థాయికి దిగజార్చారు. సమస్యను పరిష్కరించడం అలా ఉంచి, మరింత జఠిలంగా మార్చేశారు.

(మిన్హాజుసున్నహ్ అన్నబవియ్య 3 1390)

 

07) ధర్నాలు, హరాళ్ళ ఆదేశం

ఇమామ్ అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ (రహ్మతుల్లాహి అలైహ్) :

స్త్రీ పురుషులు కలిసి రోడెక్కడం, ధర్నాకు దిగటం, హర్తాళ్ళు చేయడం సమస్య పరిష్కారానికి సరైన విధానం కాదు అన్నది నా అభిప్రాయం. ఇది ఒక విధంగా పరస్పర పగకి, ప్రతీకారానికి తలుపులు తెరుస్తుంది. ఈ విషయంలో షరీయతు పరమైన కారకాలను అవలంబించడం ఉత్తమం . ఉదాహరణకు - ఉత్తరం ప్రతి ఉత్తరం ద్వారా. ఎదుటి వ్యక్తి శ్రేయాన్ని కోరుతూ హితబోధ చేయడం ద్వారా. ఈ విధానాన్నే విజ్ఞులు, విద్యావంతులు, సహాబా, తాబయీనులు పాటించారు ప్రభుత్వానికి, పాలకులకు ఉత్తరం రాయడం, వారితో నేరుగా వెళ్ళి కలిసి చర్చించడం, ఇతర, మాధ్యమాల ద్వారా వారిని సంప్రతించి పూర్తి శ్రేయాన్ని కోరుతూ హితబోధ చెయ్యడం. (వారిలో మార్పు కోసం అల్లాహ్ తో దుఆ చేయడం) ఇలా కాక, వేదికలెక్కి పాలకుల తీరుని ప్రచారం చేయగోరడం, ఫలానా వ్యక్తి ఇలా చేశాడు, అలా చేశాడు అని ఎద్దేవ చేయడం సముచితం కాదు. (అల్లా హ్యే ఆదుకోవాలి) 'వల్లాహుల్ ముస్తఆన్'

 

08) అపహరణ మరియు హత్య ఆదేశం

ఇమామ్ అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ (ర్మ తుల్లాహి అలైహ్) :

అపహరణ, హత్య,అల్లర్ల ఆధారంగా ధర్మబోధ చేయాలనుకోవడం ప్రవక్త (స) వారి విధానం ఎంత మాత్రం కాదు, సహాబా పద్ధతి అంతకన్నా కాదు. ప్రియ ప్రవక్త (స) వారి హిజ్రత్ తర్వాత ఆయనకు మదీనాలో ఆధిపత్యం లభించాక, మంచి స్థాపనకై, చెడు నిర్మూలనకై అల్లాహ్ ఆదేశంతో ఆయన (స) అవిశ్వాసులతో జిహాద్ చేశారన్న మాట వాస్తవం. అల్లాహ్ షరీయతు హద్దులను స్థాపించారు అన్న మాట కూడా యదార్థం. (దానికి ఓ సుదీర్ఘ నేపథ్యం ఉంది)

గొడవ, హత్య, రక్తపాతం వంటి వినాశకర చేష్టలు ధర్మబోధ మార్గంలో పని చేసే వారికి ఏ విధంగా శ్రేయస్కరం కావు. ఇలాంటి విధానం వల్ల సత్యం అంటేనే అసహ్యం కలిగే ప్రమాదముంది. దీనికి భిన్నంగా ధర్మబోధకుల్లో ఓర్పు, సహనం, త్యాగ నిరతి, క్షమ, దయ, స్నేహభావం, సహిష్ణుత వంటి లక్షణాలు పుష్కలంగా పరిపూర్ణ స్థాయిలో ఉండాలి.

మస్జిద్ లోపల, బయట, అన్ని చోట్ల అన్ని వేళలా మంచి మాట, ప్రవర్తనను ఆశ్రయించాలి. తద్వారా మంచోళ్ళు పెరిగి, చెడ్డళ్ళు అంతరిస్తారు. ప్రజలు సయితం సులభంగా మాటను విని, మంచిని, దర్మాన్ని అంగీకరిస్తారు.

 

09) ఫ్లయిట్  హైజాక్ గురించి పండితుల ఫత్వా

కాసింత బుద్ధి బలం గల ఏ వ్యక్తయినా - ఫ్లయిట్ మరియు దౌత్య కార్యాలయాల నుండి వ్యక్తుల్ని కిడ్నాప్ చేయడం అత్యంత అవాంఛనీయ అంతర్జాతీయ నేరం అని గ్రహిస్తాడు.

దీని మూలంగా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే, అనర్ధాలు జరిగే ప్రమాదం ఉంది. అలాగే అమాయక ప్రజలను అన్యాయంగా ఇబ్బంది పెట్టడం, వేధించడం, బాధించడమే అవుతుంది.

దీని పరిణామాలు ఎంత భయంకరంగా ఉండగలవో అల్లాహ్ కు మాత్రమే తెలుసు. ఇలాంటి వెకిలి చేష్టల వల్ల కలిగే నష్టం ఒక వ్యక్తికో, వర్గానికో మాత్రమే పరిమితం అవ్వదు. దీని ప్రభావం, నష్టం అంతర్జాతీయ స్థాయిలో ఉండే ప్రమాదం ఉంది

ఇమామ్ అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ (రహ్మతుల్లాహి అలైహ్) :

 

No comments:

Post a Comment

ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు