Monday, November 6, 2023

యుద్ధం అంతమవ్వాలి... శాంతి పరిఢవిల్లాలి!

యుద్ధం అంతమవ్వాలి...  శాంతి పరిఢవిల్లాలి!




وَأَلَّفَ بَيْنَ قُلُوبِهِمْ ۚ لَوْ أَنفَقْتَ مَا فِي الْأَرْضِ جَمِيعًا مَّا أَلَّفْتَ بَيْنَ قُلُوبِهِمْ وَلَٰكِنَّ اللَّهَ أَلَّفَ بَيْنَهُمْ ۚ إِنَّهُ عَزِيزٌ حَكِيمٌ (63) يَا أَيُّهَا النَّبِيُّ حَسْبُكَ اللَّهُ وَمَنِ اتَّبَعَكَ مِنَ الْمُؤْمِنِينَ (64)

ముఖ్యంగా ఆయన విశ్వాసుల హృదయాలను పరస్పరం కలిపి నీకు కొండంత ధైర్యాన్నిచ్చాడు. నీవు ప్రపంచంలోని సంపద మొత్తం ఖర్చుపెట్టినా వారి హృదయాలను కలపలేవు. వారి హృదయాలను కలిపేవాడు అల్లాహ్  మాత్రమే. నిస్సందేహంగా ఆయన అపార శక్తిసంపన్నుడు, అత్యంత వివేకవంతుడు. ప్రవక్తా! నిన్ను, నీ అనుచరులైన విశ్వాసుల్ని ఆదుకోవడానికి ఆ ఒక్కఅల్లాహ్ యే  చాలు. (అంఫాల్: 63-64)

మీకు గుర్తుందా..గుర్తు ఉండే ఉంటుందని అనుకుంటాను..  రెండో ప్రపంచ యుద్ధంలో షిరోషిమా, నాగసాకి మీద అమెరికా అణుబాంబులు వేసింది. ఇప్పటికీ అక్కడ పచ్చగడ్డి కూడా మొలవడం లేదు. ఇరాన్‌, ఇరాక్‌పై అమెరికా యుద్ధం చేస్తే ఇప్పటికీ అక్కడ శిథిలాలు తప్ప మరేవీ కన్పించడం లేదు. బెంజిమిన్‌ ప్రాంక్లిన్‌ అన్నట్టు ‘మంచి యుద్ధం.. చెడ్డ శాంతి ఉండవు’ దేశాధినేతలు ఇవి గుర్తెరగకపోవడం వల్లే యుద్ధాలు జరుగుతున్నాయి. చివరకు కన్నీళ్లు కూడా మిగలడం లేదు. బాంబుల ధాటికి అభివృద్ధి ఆనవాళ్లు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. నిర్మించిన భవనాలు, ఇళ్లు, ఇలా ఒక్కటేమిటీ అన్నీ భస్మీపటలమవుతున్నాయి. సామ్రాజ్యవాదం, రాజ్య విస్తరణ కాంక్ష, నిలువెత్తు అహంభావం, దోచుకోవాలనే తాపత్రయం, ప్రపంచాన్ని శాసించాలనే కుటిల బుద్ధి వంటి కారణాలు యుద్ధానికి దారి తీస్తున్నాయి. నాటి నాజీల నుంచి నేటి ఫుతిన్‌, ఫలస్తీనలోని  అక్రమార్కులయిన యూదుల   వరకు ఇదే జరుగుతోంది.

నరహత్య చెయ్యవద్దు” “దొంగలింపవద్దు” అన్నవి యూదులు చదివే “తోరా” గ్రంథపు “పది ఆజ్ఞల”లోని రెండు ప్రధాన ఆజ్ఞలు. ఈ రెండిటికీ వ్యతిరేకంగా పాలస్తీనా భూభాగంలో యూదులు నరహత్య చేసి, భూములు దొంగలించి సభ్య ప్రపంచానికి ఏం సందేశం ఇస్తున్నట్టు?

ఒకరు చేసిన దాడికి  ఎదురుదాడి అంటున్నారు. ఎంత మాత్రం కాదు.  గత డిసెంబర్‌ నుంచి ఇజ్రాయిల్‌ నిరంతరం దాడులు చేస్తోంది. ఒక్క వెస్ట్‌ బ్యాంక్‌లోనే 260 మంది చనిపోయారు. అల్‌ అక్సా మసీదుపై ప్రతి రోజూ దాడులు జరుగుతున్నాయి. అల్‌-అక్సా మసీదులో పాలస్తీనా మహిళలతో ఇజ్రాయిల్‌ సైనికులు ఎలా ప్రవర్తించారో అందరూ చూశారు. పాలస్తీనా భూమి ప్రతి రోజూ ఆక్రమణకు గురవుతోంది. పాలస్తీనియన్లు ప్రతి రాత్రి అరెస్టు చేయబడుతున్నారు. ఇజ్రాయిల్‌ జైళ్లలో దాదాపు 5,000 మంది పాలస్తీనా ఖైదీలు ఉన్నారు. ఈ పరిస్థితి ఒక్క గాజాలోనే కాదు. ఇది వెస్ట్‌ బ్యాంక్‌లోనూ వున్నది. పాలస్తీనా ప్రజలు ప్రపంచంలోనే అత్యంత దారుణమైన దురాక్రమణను ఎదుర్కొంటున్నారు.

మానవాళి పట్ల, ప్రపంచం పట్ల బాధ్యత ఉన్న వారెవ్వరైనా ఈ తరహా హింసాకాండను సమర్ధించరు. కానీ, ఇంత దారుణ హింసాకాండ తరువాత కూడా ఇజ్రాయిల్‌ను బైడెన్‌ వెనకేసుకు రావడంతో అమెరికా దుర్నీతి మరోసారి ప్రపంచానికి వెల్లడైంది.

ఒకప్పుడు యుద్ధం గెలవడం కోసం ఆయుధాలు తయారు చేసేవారు. మరిప్పుడు ... ఆయుధ అమ్మకం కోసం యుద్ధాలు సృష్టిస్తున్నారు. యుద్ధానికీ, శాంతికీ మధ్య మనిషి చక్రభ్రమణం నిరంతరాయంగా సాగుతూనే ఉంది. యుద్ధమే ప్రధానమై శాంతి ఎంత అప్రధానమైందంటే,రెండు యుద్ధాల మధ్య తాత్కాలిక విరామాన్నే శాంతిగా నిర్వచించుకునే పరిస్థితికి వచ్చాం. శాంతికాలంలో యుద్ధాన్ని జపించడం, యుద్ధకాలంలో శాంతిని స్మరించడం మనిషికి పరిపాటిగా మారింది. యుద్ధం కడుపున శాంతిశిశువును, శాంతి  కడుపున  యుద్ధశిశువును కోరుకోవడమూ అంతే నిత్య సత్యమైంది.

యుద్దమొచ్చి శాంతిని చెదరగొడుతున్నట్టు భ్రమిస్తాం కానీ; వాస్తవానికి శాంతే మధ్య మధ్య వీచే మలయమారుతమై ప్రచండమైన యుద్ధం వేడిగాల్పులకు అవరోధమవుతోందన్న ఎరుక మనకు లేదు. యుద్ధమే అక్కడ శాశ్వతంగా తిట్టివేసిన చుట్టమైంది; శాంతి ఎప్పుడైనా తొంగిచూసే అతిథి మాత్రమైంది. 

ఏ యుద్ధం అయినా  చివరిలో  అయినవారిని కోల్పోయిన తల్లులు, భార్యల దుఃఖారావాలూ, అర్తనాదాలూ గుండెల్ని పిండివేస్తాయి. అన్ని అనుభవాలున్నా, అన్నిన్ని శోకసముద్రాలు కట్టలు తెంచుకున్న ఉదాహరణలు కళ్ళముందున్నా మనిషిలో యుద్ధోన్మాదం ఉపశమించలేదు; సమర మోహం తీరలేదు; రుధిరదాహం చల్లారలేదు. శాంతియుతంగా జీవించడం మనిషి ఇప్పటికీ నేర్చు కోలేదు. యుద్ధంలో చివరికి అటూ అటూ విజేతలే  ఉండరనీ; మిగిలేవి శవాలూ, జీవచ్ఛవాలు మాత్రమేనన్న సత్యాన్ని మనిషి ఇప్పటికీ అర్థం కోలేదు. బతుకునిచ్చే, బతకనిచ్చే అమ్మతత్వాన్నినికి, అమృతానికి దూరంగా  హాలాహలం దిశగా చావు దిశగా ఈ చీకటి ప్రస్థానం ఎంతకాలం?! ఇంకెంత కాలం? ఏ యుద్ధంలోనైనా తర్వాత మనిషి తినేది వట్టి కూడు కాదు, అక్షరాలా 'నెత్తురుకూడు'.

కత్తి పట్టి యుద్ధం చేసేది వినాశానానికి కాదు..కొత్త చరిత్ర లిఖించేందుకు అంటారు కొందరు. కానీ కత్తి వల్ల జరిగిన యుద్ధాలు, బాంబుల వల్ల జరిగిన యుద్ధాలు వినాశానాన్ని తప్ప కొత్త చరిత్ర లిఖించిన దాఖలాలు ఈ భూమండలం మీద లేవు. రగిలే కాంక్ష, చెలరేగే కత్తి, రివ్వును దూసుకొచ్చే బాంబు, చిందే నెత్తురు సువర్ణాధ్యాయాలను లిఖించిన దాఖలాలు ఇప్పటి వరకూ లేవు. రావు.

ప్రపంచ పటంలో ఆ నేల విస్తీర్ణం- సూదిమొన మోపినంతః జనగణనను ఆరంభిస్తే, ఆ జాతి జనాభా కొద్ది రోజుల్లోనే తేలిపోయేంత! అయితేనేం, వందల ఏళ్లుగా మొత్తం ప్రపంచ ఆలోచనా విధానాన్నే ప్రభావితం చేస్తున్న మహనీయులైన ఎందరో శాస్త్ర సాంకేతిక ప్రతిభావంతులకు, రాజనీతిజ్ఞులకు, మత ప్రవక్తలకు జాతిపరంగా ఆ నేల అమ్మ పేగుగా నిలిచింది. ప్రపంచానికి వెలుగులు పంచింది. కొత్త ఆలోచనలకు దారులు పరిచింది. విశ్వాన్ని తనవైపు విస్మయంగా పరికించేలా చేసింది. ఆ నేలను ఈవేళ యుద్ధ వాతావరణం కమ్ముకొంది. ఆ నేల నలుచెరగులా ఉఉన్మాదం. మదం పెనవేసుకున్న ఉగ్రవాదం కిరాతకంగా ఉరుముతోంది. ఇళ్లు నేలమట్టం అవుతున్నాయి. ప్రజలు కకావికలమవుతున్నారు.

ఆ గడ్డ నెత్తురోడుతోంది. ఆ మట్టి కన్నీటి ప్రవాహాల్లో తడుస్తోంది. ఆ శిధిలాల గుట్టల్లోంచి, ఆ శవాలు గుంపుల్లోంచి రోదిస్తున్న మానవ చరిత్ర సన్నని స్వరం- ప్రళయ భీకర యుద్ధ ఘోషలో అణగారిపోతోంది. ఆధునిక యుగాల్లోని యుద్ధ పరిణామాలు ఆ రెండు దేశాలకే పరిమితం కావెన్నడూ! రణక్షేత్రాలు రక్తంతో మెరిస్తే- తక్కినవన్నీ కన్నీళ్లతో తడుస్తాయి. కవుల మాటల్లో- ఇది 'మనుజాళి, దనుజాళి మసిచరిత్ర. జ్ఞాన ధరిత్రి దీన చరిత్ర.

మారణాయుధాలు మానవతా సంక్షోభాలను సృష్టిస్తాయే తప్ప సామరస్యాన్ని నెలకొల్పలేవు. అమాయకుల నెత్తుటితో నిత్యం తడిసిముద్దయ్యే నేలలో శాంతికి స్థానముండదు. అందుకు ప్రత్యక్ష నిదర్శనం- ప్రస్తుతం పశ్చిమాసియాను పట్టికుదిపేస్తున్న యుద్ధోన్మాదమే. 'గాజా ప్రజలపై మేము యుద్ధం చేయట్లేదు' అంటూనే చిన్నారులూ మహిళలతో పాటు ఎందరో ఆసహాయులను ఇజ్రాయెల్ దళాలు పొట్టనపెట్టుకుంటున్నాయి. ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే 24గంటల్లో ఉత్తర గాజాను ఖాళీచేయాలంటూ పదకొండు లక్షల మంది మెడపై అవి కత్తి పెట్టాయి. సామాన్యులను దుర్భరావస్థల పాల్జేశాయి.

దట్టంగా పరచుకొన్న యుద్ధమేఘాలకు ఆజ్యం పోసిందెవరు? డిసెంబరు 20022లో మరోసారి ఇజ్రాయెల్ అధికార పీఠాన్ని బెంజమిన్ నెతన్యాహు అధిష్ఠించారు. ప్రధానమంత్రి పదవి కోసం పరమ అతివాద పార్టీలతో జతకట్టిన ఆయన- స్వదేశ చరిత్రలోనే అత్యంత మతఛాందస ప్రభుత్వాన్ని కొలువుతీర్చారు. పాలస్తీనియన్ల పొడను చీదరించుకునే జాత్యహంకారులకు మంత్రి పదవులిచ్చారు. వారి అండదండలతో వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలెమ్లలో ఇజ్రాయెలీ సెటిలర్లు అడ్డూ ఆపూ లేకుండా రెచ్చిపోయారు. మొన్న జూన్లోనే పాలస్తీనియన్లపై వాళ్లు 310 దాడులకు(ఇళ్లు తగలబెట్టడం వంటివి) తెగబడ్డారు. ఈ ఏడాది మొదటి ఆర్నెల్లలో వెస్ట్ బ్యాండ్లోనే రెండొందల మంది పాలస్తీనియన్లను చంపేశారు. యూదు జాతీయవాదంలోంచి బుసలుకొడుతున్న ప్రమాదకర ఉగ్రవాదంగా దీన్ని ఇజ్రాయెల్ ప్రతిపక్ష నేత బెన్నీ గాంట్జ్ సైతం ఛీత్కరించారు.  ఇది భారతీయులుగా మనకు ఒక హెచ్చరిక ఒక కనీవిప్పు కాగలగాలి.

వివరాల్లోకి వెళితే

సరిగ్గా వంద సంవత్సరాల క్రితం మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం. నవంబర్ 2, 1917 న అప్పటి బ్రిటిష్ ప్రభుత్వపు విదేశాంగ మంత్రి ‘ఆర్థర్ బాల్ఫోర్’ బ్రిటిష్ యూద వర్గానికి చెందిన ప్రముఖుడైన ‘లియోనెల్ వాల్టర్ రూత్స్ చైల్డ్’కు 67 అక్షరాలతో కూడిన ఒక ‘ఉత్తరం’ రాశాడు.

అప్పటివరకూ పాలస్తీనాలో ప్రశాంత జీవనం గడుపుతూ వస్తున్న ముస్లిములకు పాపం తెలీదు ఆ ఉత్తరం ద్వారా వారి జీవితాలు ఛిద్రం చేయ్యబడి, భవిష్యత్తులో వారి రక్తంతో తడిచిన నేలపైనే మరో దేశం నిర్మించబడుతుందని, తాము స్వతంత్రంగా నివసించిన భూమే తమ కోసం ఓ డెటెన్షన్ క్యాంప్ గా మారబోతుందని, తమ ఇళ్లు కూల్చబడి తమ భూములు లాక్కోబడతాయని, రాబోయే రోజుల్లో ఓ భయంకరమైన రక్తచరిత్ర సృష్టించబడుతుందని.

ఆ ఉత్తరం యొక్క సారాంశం ఏమిటంటే- బ్రిటిష్ ప్రభుత్వం యూదుల కోసం పాలస్తీనా భూభాగంలో ఒక స్వంత దేశాన్ని నిర్మించి ఇవ్వటానికి నిర్ణయం తీసుకుందన్నది. ఆ ఉత్తరం పేరే- ‘బాల్ఫోర్ డిక్లరేషన్’.

కేవలం 1947 నుండి 1949 మధ్యలో 750000 మంది పాలస్తీనా ముస్లిములు తమ ఇళ్ల నుండి గెంటి వేయబడి బయట దేశాల్లో శరణార్ధులుగా మార్చబడ్డారు. గాజా పట్టీ అక్కడి ముస్లిములకు ఒక డిటెన్షన్ క్యాంప్ గా మార్చబడింది. దీనిని బట్టి ఏ విధమైన దౌర్జన్యం పాలస్తీనా ప్రజలపై జరిగిందో అంచనా వెయ్యవచ్చు.

1947 నుండి 49 మధ్యలో 15000 వేల మంది పాలస్తీనా ముస్లిములు దారుణంగా చంపబడ్డారు. వేల కొద్దీ ఇళ్లు నేలమట్టం చెయ్యబడ్డాయి. ఎంతో మంది కట్టుబట్టలతో భార్యా పిల్లల్ని తీసుకుని వేరే దేశాలకు కాలి నడకన వెళ్లిపోయారు.

ఐక్యరాజ్య సమితి ఇచ్చిన పరిమితులతో సంబంధం లేకుండా సుమారు 78 శాతం పాలస్తీనా భూభాగాన్ని యూదులు ఆక్రమించారు. 

ఇంతపెద్ద రక్తపాతాన్ని సృష్టించిన యూదులు మే 15, 1948 న ఇశ్రాయీల్ దేశాన్ని ప్రకటించుకుంటారు. ఆరోజును గుర్తు చేసుకుంటూ ప్రతీ సంవత్సరం పాలస్తీనియన్లు “అక్బా” దినంగా జరుపుకుంటారు. అక్బా అన్న అరబీ పదానికి “ఘోర విపత్తు” అని అర్థం.

 

  ''హంతకుల మీద ఈ రోజు మనం నెపం నెట్టకూడదు. మన పట్ల వారి తీవ్ర ద్వేషాన్ని ఎందుకు గర్హించాలి? ఎనిమిది సంవత్సరాలుగా గాజాలోని శరణార్ధి శిబిరాలలో వారు కూర్చున్నారు. వారు, వారి తండ్రులు నివశించిన చోట వారి భూములు, గ్రామాలను వారి కళ్ళ ముందే మన ఎస్టేట్లుగా మార్చివేయటాన్ని వారు చూస్తున్నారు'' ఈ మాటలు చెప్పింది జనరల్‌ మోషే డయాన్‌. నూటికి నూరు పాళ్లు యూదు దురహంకారే. 1948లో ఇజ్రాయిల్‌ మిలిటరీ పాలస్తీనా అరబ్బు ప్రాంతాల మీద జరిపిన దురాక్రమణ, హత్యాకాండకు నాయకత్వం వహించిన అధికారులలో ఒకడు. తరువాత మిలిటరీ ప్రధాన అధికారిగా పని చేశాడు. 1956లో పాలస్తీనా గెరిల్లాలు జరిపిన దాడుల తరువాత డయాన్‌ చేసిన వ్యాఖ్యలివి. తరువాత కాలంలో పాలస్తీనియన్లతో శాంతి పరిష్కారం కోరుకున్న కారణంగా అదే యూదు దురహంకారులు అతన్ని పక్కన పెట్టారు.

  పాలస్తీనా-ఇజ్రాయిల్‌ వివాదంలో ఒక యూదు దురంహంకారికి తెలిసిన మేరకు కూడా మధ్యవర్తిగా ఉన్న అమెరికా అర్ధం కానంత అమాయకంగా ఉందా? 1948 నుంచి పాలస్తీనియన్ల ప్రాంతాలను ఆక్రమించి వారిని తరమివేయటంతో విదేశాల్లో శరణార్ధులుగా, ఇజ్రాయిలీ పాలకులు బహిరంగ జైలుగా మార్చిన పాలస్తీనా ప్రాంతాలలో బందీల మాదిరి క్షణం క్షణం ఏం జరుగుతుందో తెలియని భయం, అనిశ్చితిలో బతుకుతున్నారు.

ఈ బూడిద గుట్టల మీద నీ అధికారం ఎన్నాళ్ళు సాగుతుంది తిరిగి మరలిపోయిన మనుషులు తప్పక తలెత్తుకుని వస్తారు పచ్చని చిగుళ్ళని మొలకెత్తించడానికి... ఆసుపత్రులు తెరచుకుని  మరల పురుళ్ళు పోసుకుంటాయి  బడి గంటలు మోగి  చినిగిన పైజామాలు ఎగదోసుకుంటు  పిల్లలు మరల పలకా బలపం పట్టి  తమ భవిష్యత్ చిత్రపటాన్ని లిఖించుకుంటారు  ఫీనిక్స్ పక్షిలా మరలా గాజా లేచి నిలబడుతుంది నువ్వెన్ని సార్లు బూడిద చేసినా ఎందుకంటే వాళ్ళు మనుషులు కదా?

వారి ముఖాల్లో చనిపోతున్నాం అనీ ఏడుపులు, పెడబొబ్బలు, బాధ, భయం మచ్చు కైనా కనబడడం లేదు.."దేశ స్వాతంత్ర పోరాట కాంక్ష" సర్వ సృష్టి కర్త అయిన "అల్లాహ్ మీద నమ్మకం తప్ప"

దురాక్రమణదారులకు పశ్చిమ దేశాల మద్దతు ఉంది. మాకు ఔదార్యం కాదు, డబ్బు కాదు. సమస్యకు రాజకీయ పరిష్కారం కావాలి. పాలస్తీనా ప్రజల స్వయం నిర్ణయాధికారం కాపాడబడాలి. మన పిల్లలు ఇతర పిల్లల్లాగే ఆడుకుంటూ పెరిగే అవకాశం ఉండాలి. అంతేగాని వారు ప్రతిరోజూ దాడుల్లో చనిపోకూడదు.

No comments:

Post a Comment

ధనం, ఐశ్వర్యం, పొలం వారసత్వంగా లభించ వచ్చేమోగానీ, ఇస్లాం మాత్రం వారసత్వంగా లభించేది కాదు